Fuel Exports: ఇండియా నుంచి ఇంధన ఎగుమతులు భారీగా పెరుగుతున్నాయి. అందేంటి మన దేశం నుంచి ఇంధనం ఎగుమతులు ఏంటి.. మనమే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం కదా అనుకుంటున్నారా.. కానీ ఇది నిజం. ఇంధన ఎగుమతుల్లో లెక్కలు మారుతున్నాయి. అమెరికా, యురోపియన్ యూనియన్ దేశాలకే భారత్ ఇంధనం ఎగుమతి చేస్తోంది. అంతర్జాతీయ ఆయిల్ మార్కెట్లో ఇండియా కీలకంగా మారుతోంది. రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురు దిగుమతి చేసుకుని దానిని ప్రాసెసింగ్ చేసి అమెరికా, యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తోంది. గత డిసెంబర్ నెలలోనే అమెరికాకు రోజుకు 89 వేల బ్యారెళ్ల గ్యాసోలిన్, డీజిల్ను ఇండియా ఎగుమతి చేసింది. గత నాలుగేళ్లలో ఇదే అత్యధికం. ఇక జనవరి నెల వచ్చేసరికి ప్రతీరోజు 1.72 లక్షల బ్యారెళ్ల డీజిల్ను యురోపియన్ యూనియన్ దేశాలకు భారత్ ఎగుమతి చేసింది. ఇది కూడా గత రెండేళ్లలో అత్యధికం.

ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యతో..
ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య కారణంగా అమెరికా, ఈయూ దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా ఎగుమతులు నిలిచిపోయాయి. క్రూడ్ ఆయిల్ దిగుమతిపై యూరప్ దేశాలు నిషేధం విధించాయి. ఇదే సమయంలో రష్యాపై ఎలాంటి ఆంక్షలు అమలు చేయని భారత్కు అయిల్ ఎగుమతులను భారీగా పెంచుతోంది. అది కూడా రూపాయలలో, తక్కువ ధరకు. ఇలా వచ్చిన క్రూడ్ ఆయిల్ను అమెరికా, ఈయూ దేశాలకు ఇండియా ఎగుమతి చేస్తోంది. అందుకే పెద్దగా ఉత్పత్తిలేని భారత్ నుంచి ఆయిల్ ఎగుమతులు పెరుగుతున్నాయి.
దిగుమతి ఒక్కటే మార్గం..
సాధారణంగా ఇంధనం ఉత్పత్తి చేయని దేశాలకు ఉత్పత్తి చేసే దేశాలనుంచి దిగుమతి చేసుకోవడం ఒక్కటే మార్గం. ఇంధన వ్యాపారం మొత్తం డాలర్ల రూపంలో జరుగుతుంది. దీంతో విదేశీ మారకాల్లో చాలావరకు ఇంధన దిగుమతుల కోసమే ఖర్చు చేయాల్సిన పరిస్థితి. భారత్ లో కూడా ఇంధన ఉత్పత్తి అంతంత మాత్రమే. అందుకే ఒపెక్ దేశాల నుంచే ఇంధన దిగుమతి చేసుకుంటూ విదేశీ మారకాన్ని భారీగా ఖర్చు చేస్తున్నాం. ఇంధన దిగుమతుల కోసం భారత్ సౌదీ అరేబియాపైనే అధికంగా ఆధారపడింది.
రష్యాతో స్నేహం కలిసి వస్తోంది..
ఉక్రెయిన్, రష్యా యుద్ధం తర్వాత ప్రపంచ దేశాలు రష్యాపై విధించిన ఆంక్షలు భారతకు కలిసి వస్తున్నాయి. రష్యాకు భారత్తో ఉన్న స్నేహం, ఆంక్షలు అమలు చేయకపోవడం, యుద్ధంపై భారత్కు ఉన్న వైఖరి కారణంగా తక్కువ ధరకే భారీగా ఇంధనం ఇస్తామని రష్యా ముందుకు వచ్చింది. ట్రాన్స్పోర్టు ఇబ్బందులు కూడా చేస్తామని ప్రకటించింది.
రష్యాను ఆర్థికంగా నిలబెడుతున్న ఇండియా..
ఉక్రెన్పై యుద్ధం కారణంగా విధించిన ఆర్థిక ఆంక్షలతో రష్యాకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ తరుణంలో ఇండియా అండగా నిలిచింది. తక్కువ ధరకు వస్తున్న ఇంధనాన్ని భారీగా దిగుమతి చేసుకుంటూ రష్యాను ఆర్థికంగా నిలబెడుతోంది ఇండియా. అయితే ఇదే సమయంలో రష్యాకు అండగా నిలుస్తున్న భారత్ను ఇబ్బంది పెట్టాలని అమెరికా, ఈయూ దేశాలు భావించాయి. భారత్ యుద్ధాన్ని తమకు ఆర్థిక వనరుగుగా మార్చుకుందని అమెరికా విమర్శించింది కూడా. కానీ దీనిని విదేశాంగ మంత్రి జయశంకర్ దీటుగా కౌంటర్ ఇచ్చారు. ఆంక్షల పేరుతో డ్రామాలు తప్ప భారత్కంటే ఇంధనం దిగుమతి చేసుకునే దేశాలు అమెరికా, యురోపియన్ యూనియనే అని ప్రకటించారు. దీంతో అమెరికా, ఈయూ దేశాలకు తత్వం బోధపడింది. ఇండియా, రష్యాను నిలువరించడం సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చింది.
అమెరికాకూ ఆపన్న హస్తం..
మారుతున్న పరిస్థితులతో ఇప్పుడు అమెరికా, ఈయూ దేశాలకు భారతే ఆపన్న దేశమైంది. ఆక్షలతో ఇంధన నిల్వలు తగ్గిపోతుండడంతో అమెరికా, యూరప్ దేశాలు భారత్ను ఆశ్రయించాయి. దీంతో ఇండియా ఇంధనం ఎగుమతి చేస్తోంది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న క్రూడ్ ఆయిల్నే ఎగుమతి చేస్తున్న విషయం ఆయా దేశాలకు తెలుసు. అయినా నోరు మెదుపడం లేదు. దీంతో ఇండియా ఎగుమతులు పెంచుతోంది.
రష్యాలో ఉత్పాదక వ్యయం తక్కువ..
వాస్తవంగా అమెరికా, ఈయూ దేశాలు ఇంధన దిగుమతులు నిలిపివేస్తే రష్యా ఆర్థిక మూలాలు దెబ్బతింటాయని భావిచాయి. కానీ రష్యాలో పరిస్థితి పూర్తిగా భిన్నం. అక్కడ ఇంధన ఉత్పాదకత వ్యయం మిగతా దేశాలతో పోచ్చితే చాలా తక్కువ. రష్యా ఒక బ్యారెల్ ఇంధనం ఉత్పత్తికి కేవలం 30 డాలర్లు మాత్రమే ఖర్చు చేస్తుంది. ఇదే సమయంలో రష్యా తాము నష్టపోయి భారత్కు ఇంధనం సరఫరా చేయదు. భారత్ కూడా ఉత్పాదక వ్యయం కంటే తక్కువ చెల్లించదు. ఈ లాజిక్ మర్చిపోయిన అమెరికా, యురోపియన్ దేశాలు ఆంక్షల పేరుతో రష్యా ఇబ్బంది పడుతుందని భావిస్తున్నాయి. వాస్తవం మాత్రం భిన్నంగా ఉంది. అమెరికా, ఈయూ దేశాలకు భారత్ నుంచి ఇంధన ఎగుమతులు పెరుగుతుండడంతో రష్యానుంచి భారత్కు వచ్చే ఇంధన దిగుమతులు పెరగుతున్నాయి. ఫలితంగా రష్యా ఆర్థికంగా బలపడుతోంది. ఈ చిన్న లాజిక్ను అగ్రరాజ్యం ఎలా మిస్ అయిందో అర్థకాదు.

చైనాకు గట్టిపోటీ..
ఎప్పటికైనా చైనాకు గట్టి పోటీనివ్వగల సామర్థ్యం భారత్కు ఉందని చాలా మంది విశ్వసిస్తుంటారు. ముఖ్యంగా తయారీలో దూసుకెళ్తున్న చైనాకు ఇండియా అడ్డుకట్ట వేయగలదని చెబుతుంటారు. అపార మానవ వనరులే భారత్కు ప్రయోజనాన్ని చేకూరుస్తాయని వివరిస్తుంటారు. ఈ మధ్య కాలంలో చైనాతో పాశ్చాత్య దేశాల పొరపొచ్చాలు పెరిగిన తర్వాత.. భారత్ వైపు సానుకూల పవనాలు వీస్తున్నాయి. డ్రాగన్ దేశం నుంచి పరిశ్రమల్ని తరలిస్తే.. ప్రత్యామ్నాయంగా భారత్నే ఎంచుకునే అవకాశం ఉందని చాలా మంది ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ అంచనాలన్నింటికీ బలం చేకూర్చే కీలక పరిణామం ఒకటి చోటుచేసుకుంది. ఇంధన ఎగుమతులు భారీగా పెరిగాయి. ఈ పరిణామాలు భారత్ను అంతర్జాతీయంగా నెక్ట్స్ లెవల్కు తీసుకెళ్తున్నాయి.