స్మార్ట్ ఫోన్ల రాకతో సోషల్ మీడియా వినియోగం భారీగా పెరిగింది. ఏ విషయమైనా సోషల్ మీడియా ద్వారా ఒకరి నుంచి మరొకరికి వేగంగా తెలుస్తోంది. అయితే కొందరు ఫేక్ వార్తలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం వల్ల ఇతరులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో పులి పిల్లలు తిరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. చాలామంది ఆ ప్రచారాన్ని నిజమేనని నమ్మారు.
విషయం ఫారెస్ట్ అధికారుల దృష్టికి కూడా వెళ్లడంతో ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి పులి పిల్లలని చెప్పబడుతున్న వాటిని పరిశీలించి అవి పులి పిల్లలు కాదని అడవి పిల్లి పిల్లలని తేల్చారు. కుక్కునూరు అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న మద్దిగట్ల దగ్గర అడవి పిల్లి పిల్లలు దర్శనమివ్వడం గమనార్హం. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన ఫోటోలు అడవిపిల్లి పిల్లలని తెలిసి స్థానికులు అవాక్కయ్యారు.
అటవీ శాఖ అధికారులు అడవిపిల్లి పిల్లలను అడవిలో వదిలేశారు. దూరం నుంచి చూస్తే అవి పులి పిల్లల్లా కనిపించాయని అందుకే వాళ్లు కంగారు పడ్డారని వారు పేర్కొన్నారు. కుక్కునూరు పరిసర ప్రాంతాలలో హల్ చల్ చేసిన అడవి పిల్లి పిల్లలు సోషల్ మీడియా ద్వారా వార్తల్లో నిలవడంతో గ్రామ ప్రజలను భయాందోళనకు గురి చేశాయని చెప్పవచ్చు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు పలు సందర్భాల్లో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
పిల్లి పిల్లలే అయినా చర్మం రంగు పులి పిల్లల్లా ఉండటంతో కొందరు వాటిని పులి పిల్లలని అపోహ పడ్డారు. అయితే పులి పిల్లలని మొదట భయపడిన ప్రజలే ఆ తర్వాత అసలు విషయం తెలిసి నవ్వుకోవడం గమనార్హం.