Cotton Candy Ban
Cotton Candy Ban: మనలో చాలా మంది గోబీ మంచూరియా, పీచు మిఠాయిని ఎంతో ఇష్టంగా తింటుంటారు. లేత గులాబీ రంగులో లేదా తెలుపు రంగులో దొరికే పీచు మిఠాయి నోటిలో వేసుకోగానే అలా కరిగిపోతుంది. ఈ క్రమంలోనే చిన్నారులతో పాటు పెద్ద వారు సైతం పీచు మిఠాయితో పాటు గోబీ మంచూరియాను కూడా ఇష్టపడి లాగించేస్తుంటారు. అయితే వీటిలో వాడే ఆర్టిఫిషియల్స్ కలర్స్ చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదేంటో తెలుసుకుందాం..
గోబీ మంచూరియా, పీచు మిఠాయిలో రోడమైన్ -బి, టార్ట్రాజిన్ వంటి ఇతర రసాయనాలను వినియోగిస్తారని వైద్యాధికారులు చెబుతున్నారు. దీని వలన ప్రజల ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.
కలర్ గోబీ మంచూరియాతో పాటు కాటన్ క్యాండీలలో నాసిరకం నాణ్యతతో పాటు కృత్రిమ రంగులు ఉన్నాయని వైద్యాధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో వీటిని తాజాగా కర్ణాటక రాష్ట్రం బ్యాన్ చేసింది. అంతేకాదు ఈ పదార్థాలను ఎవరైనా అమ్మినట్లయితే ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 10 లక్షల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
అలాగే రోడమైన్ -బి ఫుడ్ కలరింగ్ ఏజెంట్ పై కూడా నిషేధం విధించింది. ఈ ఆర్టిఫిషియల్ రంగులను కలిగి ఉండే స్నాక్స్ ఏమైనా తీసుకోవడం వలన క్యాన్సర్ తో పాటు దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా రోడమైన్ -బి ఆరోగ్యానికి హనికరమని నివేదికలు చెబుతున్న సంగతి తెలిసిందే.