
MLC Kavitha- E.D: ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నిర్వహించే విచారణలో ముందు కవితను ప్రశ్నిస్తోంది. ఆమెతో పాటు తొమ్మిది మందిని ఒకేసారి విచారిస్తోంది. కవితతో పాటు మనీష్ సిసోడియా, అరుణ్ పిళ్లై, దినేష్ ఆరోరా, బుచ్చిబాబు, మనీష్ సిసోడియా మాజీ కార్యదర్శి అరవింద్, మాజీ అధికారులు కులదీప్ సింగ్, నరేంద్ర సింగ్ లను ఒకేసారి విచారిస్తోంది.. వీరంతా కూడా ఐఫోన్లను ధ్వంసం చేశారని, వీరి చాటింగ్ లో సీక్రెట్ కోడ్ లు వాడాలని ఈడీ చెబుతోంది. వాటిని డీకోడ్ చేయగా “మేడమ్ 33%” అని వచ్చిందని, దాని ఆధారంగానే ఈడి విచారణ కొనసాగించనుందని తెలుస్తోంది.
ఇక ఈడి విచారణ నేపథ్యంలో ఢిల్లీలో ఉత్కంఠ నెలకొంది.. కవితను విచారణకు రమ్మని మార్చి 9న ఈడి నోటీసులు జారీ చేసింది. ముందస్తు కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో 11వ తేదీన విచారణకు హాజరవుతానని కవిత వెల్లడించిన నేపథ్యంలో.. అధికారులు ఆ తేదీని ఖరారు చేశారు. ఇక ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కీలక విషయాలు వెల్లడించింది. సౌత్ గ్రూపునకు ప్రాతినిధ్యం వహిస్తున్న అరుణ్ పిళ్ళయి కవిత బినామీ అని పునరుద్ఘాటించింది.. ఈ కుంభకోణంలో “మేడమ్ కవితకు 33 శాతం” ముడుపులు అందినట్టు వివరించింది.. మొత్తం వ్యవహారాన్ని సిసోడియా, ఆప్ నేతల ప్రతినిధి అయిన విజయ్ నాయర్ నడిపించారని, కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శరత్ రెడ్డి, రాఘవరెడ్డి తో కూడిన సౌత్ గ్రూప్ తో కుమ్మక్కయారని వివరించింది. ఈ మేరకు శుక్రవారం ప్రత్యేక కోర్టుకు సమర్పించిన మనీష్ సిసోడియా రిపోర్టులో స్పష్టం చేసింది.. కాగా కవిత శనివారం విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో రిమాండ్ రిపోర్టులో మద్యం కుంభకోణంలో ఆమె పాత్ర పై మరింత స్పష్టత ఇచ్చింది. దీంతో పక్కా సాక్ష్యాధారాలతో ఆమె అరెస్టుకు ఈడీ రంగం సిద్ధం చేసిందని పరిశీలకులు చెబుతున్నారు. అయితే మద్యం కుంభకోణంలో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న వారంతా తమ ఐఫోన్లను ధ్వంసం చేశారని, అందులో ఉన్న సమాచారాన్ని మొత్తం క్రోడీకరిస్తే కీలక విషయాలు తెలిసాయని ఈ డి అంటోంది. వాటి ఆధారంగానే కవిత, మిగతా తొమ్మిది మందిని ఒకేసారి ఈడి అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక కవితకు బినామీగా చెబుతున్న అరుణ్ ప్రస్తుతం ఈడి కస్టడీలో ఉన్నాడు. సిసోడియాను శుక్రవారం ఈడీ కస్టడీలోకి తీసుకుంది. ఈ క్రమంలో వారిద్దరితో వేరువేరుగా, కలిపి కూడా కవితను ప్రశ్నించే అవకాశం ఉందని ఈడి వర్గాలు అంటున్నాయి.. నిందితులు, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలు, సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా ప్రశ్నలు ఉంటాయని తెలుస్తోంది. మరోవైపు కవిత కూడా పలుసార్లు ఫోన్లు మార్చారని, వాటిని ధ్వంసం చేశారని ఈడీ చెబుతున్న నేపథ్యంలో వాటిపై కూడా ప్రశ్నించే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. ఒకవేళ ఈడి విచారణకు సహకరించిన పక్షంలో కవితను కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా ఇప్పటివరకు చాలామందిని ఈ కారణంతోనే అరెస్ట్ చేసింది. అరెస్టు చేసిన తర్వాత వారిని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించింది. కాగా ఈ మద్యం కుంభకోణం విలువ 20వేల కోట్లు అని తెలుస్తోంది. వీరు ఎవరెవరికి ఎంత ఇచ్చారు? ఏ రూపంలో ఇచ్చారు? తీసుకున్నవారు వీరికి ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చారు? అనే అన్ని ప్రశ్నలకు విచారణలో సమాధానాలు రాబట్టే పనిలో ఈడి అధికారులు ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. శనివారం సాయంత్రం బిగ్ బ్రేకింగ్ వార్త తప్పకుండా వినాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.