KCR and KTR: సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా మారిపోయింది. జాతీయ పార్టీగా ఎదిగేందుకు కలలు కన్నది. ఆంధ్ర ప్రదేశ్లో శాఖను కూడా ఏర్పాటు చేసింది. తోట చంద్రశేఖర్ ను అధ్యక్షుడిని చేసింది. ఏపీలో కార్యాలయం కూడా ప్రారంభించింది. అంతేకాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొనుగోలు చేయడానికి కూడా సింగరేణి ముందు వరుసలో నిలిపింది. ఇలా ఎన్నో చేసింది. కానీ సొంత రాష్ట్రంలోని గెలవలేకపోయింది. అంతేకాదు.. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పంజాబ్, బీహార్, ఢిల్లీ వంటి రాష్ట్రాలలో కేసీఆర్ పర్యటించారు. అక్కడి రైతులకు చెక్కులు కూడా ఇచ్చారు. ఇలా ఎన్నో రకాలుగా జాతీయ వాదాన్ని ఆయన వినిపించారు.
చివరికి కెసిఆర్ భారత రాష్ట్ర సమితి భారతదేశంలో అధికారంలోకి రాలేకపోయింది. సొంత రాష్ట్రమైన తెలంగాణలో పట్టు నిలుపుకోలేకపోయింది. అంతేకాదు పార్లమెంటు ఎన్నికల్లో సున్నా స్థానాలకు పరిమితం అయిపోయింది. రాజకీయంగా తీవ్రమైన ఒడిదుడులను ఎదుర్కొంటున్నది. మరోవైపు పార్టీ నుంచి కవిత వెళ్లిపోయింది. గులాబి పార్టీకి బలంగా ఉన్న తెలంగాణ పేరును తన పార్టీకి పెట్టుకుంది. అటు తెలంగాణ వాదాన్ని దూరం చేసుకోవడం.. జాతీయ రాజకీయాల మోజులో పడి ఇష్టానుసారంగా వ్యవహరించడంతో కెసిఆర్ పరిస్థితి దారుణంగా మారింది.
2027 ఎన్నికల్లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి గులాబీ పార్టీ మీద ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ అధినేత కేసిఆర్ సరికొత్త నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయన ఇప్పుడు పాదయాత్ర చేసే అవకాశం లేదు. అప్పట్లో తెలంగాణ మూమెంట్ సాగుతున్నప్పుడు ఆయన కొద్ది రోజులపాటు పాదయాత్ర చేశారు. అయితే ఇప్పుడు పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి వయసు రీత్యా ఆయన పాదయాత్ర చేసే అవకాశం లేదు.
వ్యవసాయ క్షేత్రానికి పరిమితమైన ఆయన ఇప్పుడు బస్సు యాత్ర చేస్తారని తెలుస్తోంది. కార్యకర్తలను ఏకతాటి పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలబృతం చేసేందుకు బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. దీనికోసం రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. మన వైపు కేటీఆర్ కూడా పాదయాత్ర చేస్తారని సమాచారం. పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు కేటీఆర్ సిద్ధమవుతున్నారు.
అటు తండ్రి.. ఇటు కొడుకు రెండు వ్యూహాలతో ఒకేసారి జనంలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ యాత్రలకు సంబంధించి త్వరలోనే పూర్తిస్థాయి షెడ్యూల్ వస్తుందని సమాచారం. ఇప్పటికే పార్టీలోని కీలక నాయకులకు కేసిఆర్.. కేటీఆర్ వర్తమానం పంపారని.. కొద్దిరోజులుగా దీని గురించి చర్చలు జరుగుతున్నాయని.. సమాచారం. ఇటీవల కేటీఆర్ మలేషియా వెళ్లారు. అక్కడ జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు.. గతంలో కూడా కేటీఆర్ తన పాదయాత్ర గురించి బయటకు చెప్పేశారు. ఈ నేపథ్యంలో ఏకంగా కెసిఆర్ నుంచి మీడియాకు లీకులు వస్తున్న నేపథ్యంలో.. కచ్చితంగా పాదయాత్ర.. బస్సు యాత్ర ఉంటుందని తెలుస్తోంది.

