Telangana Rain Alert: తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రోజులుగా భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. కానీ ఒక్కసారిగా వాతావరణం చల్లబడ్డది. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు మారుతున్నట్లు గుర్తించి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు ఉక్కపోతతో ఇబ్బందిపడ్డవారికి కాస్త ఉపశమనం కలగనుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం గంటకు సుమారు 5 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇది భారీ వర్షం కాకపోయినా, కొన్ని ప్రాంతాల్లో రోడ్లు తడవడం, ట్రాఫిక్కు స్వల్ప అంతరాయం కలగడం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆఫీస్ టైమింగ్లో బయటకు వెళ్లే వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.సోమవారం ఉదయం నుంచి రాష్ట్రంలో ఎండ తీవ్రత అధికంగా ఉన్నా.. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణంలో మార్పు కనిపించింది. మేఘాలు కమ్ముకోవడం.. చల్లని గాలులు వీస్తుండటం వల్ల ఉష్ణోగ్రతలు కొంత తగ్గాయి. దీంతో ప్రజలు ఎండ వేడి నుంచి తాత్కాలిక ఉపశమనం పొందుతున్నారు.
వాతావరణ మార్పుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో మెరుపులు, ఈదురుగాలులు కూడా ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఓపెన్ ప్రదేశాల్లో నిలబడకుండా, చెట్ల కింద ఆశ్రయం తీసుకోవద్దని సూచిస్తున్నారు. అవసరం లేకపోతే బయటకు వెళ్లకుండా ఉండడం మంచిదని చెబుతున్నారు. ఈ వర్షాలు తాత్కాలికంగా చల్లదనాన్ని అందించినప్పటికీ, వాతావరణంలో త్వరితగతిన మార్పులు చోటు చేసుకునే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండటం అవసరం.
ఈ తేలికపాటి వర్షాలు సాధారణంగా రైతులకు పెద్దగా నష్టం కలిగించేలా ఉండవు. కానీ అవి పడే సమయం, పంట దశపై ఆధారపడి ప్రభావం మారుతుంది. ప్రస్తుతం వేసవి కాలంలో నేల చాలా ఎండిపోయి ఉంటుంది. ఇలాంటి సమయంలో పడే తేలికపాటి వర్షాలు నేలలో తేమను పెంచి, వచ్చే పంటల విత్తనాల కోసం కొంత ప్రయోజనం కలిగిస్తాయి. కానీ కోత దశలో ఉన్న పంటలకు మాత్రం ఇలాంటి వర్షాలు కొంత ఇబ్బందిగా మారవచ్చు. ఎండలో ఆరబెట్టిన ధాన్యం తడవడం వల్ల నాణ్యత తగ్గే ప్రమాదం ఉంటుంది. అలాగే పత్తి, మిర్చి వంటి పంటలు బయట ఎండబెట్టినపుడు వర్షం పడితే నష్టం కలగొచ్చు.ఇంకా కొన్ని ప్రాంతాల్లో గాలులతో కూడిన వర్షం పడితే పంటలు వంగిపోవడం లేదా పువ్వులు రాలిపోవడం వంటి సమస్యలు కూడా వస్తాయి. ఇది ముఖ్యంగా మక్కజొన్న, పప్పుధాన్యాలపై ప్రభావం చూపవచ్చు.
