Government Corporate School: సాధారణంగా ప్రభుత్వ బడి అంటే అందరిలో ఒక రకమైన భావన ఉంటుంది. సరైన సదుపాయాలు ఉండవు. పుస్తకాలు, యూనిఫామ్ సక్రమంగా ఉండదు. మధ్యాహ్నం భోజనం సరిగా ఉండదు. ఉపాధ్యాయులలో బాధ్యత కనిపించదు. సరైన క్రమశిక్షణ లేకపోవడంతో విద్యార్థులు కూడా దారి తప్పుతుంటారు. అందువల్లే ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను పంపడానికి తల్లిదండ్రులు వెనకడుగు వేస్తారు. గత కొంతకాలంగా ప్రభుత్వ పాఠశాలలలో డ్రాప్ అవుట్లు పెరుగుతున్నాయి. దీనిని బట్టి ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తొలి గవర్నమెంట్ కార్పొరేట్ స్కూల్ ప్రభుత్వం ఆధ్వర్యంలో గురుకులాలు.. ఇతర విద్యాలయాలు కొనసాగుతున్నప్పటికీ.. ఇప్పటికి అవి కార్పొరేట్ రూపును సంతరించుకోలేకపోతున్నాయి. ప్రభుత్వం వందల కోట్లు ఖర్చుపెడుతున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఆరుట్ల ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ తొలి పబ్లిక్ స్కూల్ ను నిర్మించారు. బుధవారం పాఠశాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.. విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. పూరీలు కూడా చేశారు.. అయితే ఈ స్కూల్లో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్ వరకు విద్యను అందిస్తారు..
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం నాలుగు తెలంగాణ పబ్లిక్ స్కూల్ లను ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసింది.. కార్పొరేట్ పాఠశాలల కంటే దీటుగా ఇందులో ప్రభుత్వం వసతులు కల్పిస్తోంది. అంతేకాదు ఆరుట్ల ప్రాంతంలో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ పైలాన్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.. ఈ పాఠశాలలో ఏర్పాటుచేసిన డిజిటల్ క్లాస్ రూమ్ లు.. గ్రంథాలయాలు.. సైన్స్ ప్రయోగ కేంద్రాలు.. భోజన కేంద్రాలు.. క్రీడ మైదానాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఆ తర్వాత విద్యార్థులు.. ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా సమావేశమై.. వారితో ముచ్చటించారు
ఈ స్కూల్ లో విద్యా ఉచితం. భోజనం కూడా ఉచితం. ప్రపంచ స్థాయిలో సౌకర్యాలు విద్యార్థులకు ఉచితంగానే ప్రభుత్వాన్ని ఇస్తుంది. ఇక్కడ విద్యార్థులను తీసుకురావడానికి ప్రత్యేకంగా బస్సులు ఉంటాయి. ఆరుట్ల , మంచాల, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లి ప్రాంతాలలో పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటు చేయబోతోంది. ఆరుట్ల పాఠశాలలో మొత్తం 1814 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రీ ప్రైమరీ విభాగంలో 150 మంది, ప్రైమరీ విభాగం లో 600 మంది.. రెండు బ్లాక్లలో ఏర్పాటుచేసిన హైస్కూల్లో 800 మంది.. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 160 మంది.. రెండో సంవత్సరంలో 14 మంది విద్యార్థులు చదువుతున్నారు.
ఈ పాఠశాలలో ఒకే ప్రాంతంలో ఇంటర్ వరకు చదువుకునేందుకు విద్యార్థులకు సౌకర్యాలు కల్పించారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన సాగుతూ ఉంటుంది. విద్యార్థులకు ఉదయం టిఫిన్.. మధ్యాహ్నం లంచ్.. ఈవినింగ్ స్నాక్స్ పెడతారు. చదువుతోపాటు ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తారు. సమీప గ్రామాల ప్రజలు ఈ స్కూలుకు రావడానికి బస్సు సౌకర్యం కూడా కల్పించారు. స్మార్ట్ క్లాస్ రూమ్లను ఏర్పాటు చేశారు.. అత్యంత ఆధునికమైన ప్రయోగ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా క్రీడలను కూడా ప్రాధాన్యం కల్పించారు.
క్రికెట్ నుంచి క్యారమ్స్ వరకు అన్ని క్రీడలకు ప్రత్యేకమైన మైదానాలు.. కోర్టులు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేకంగా శిక్షకులను నియమించారు. జిల్లా అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ పాఠశాల నిర్వహణ సాగుతూ ఉంటుంది. ఈ పాఠశాల ప్రభుత్వం విద్య మీద పెడుతున్న దృష్టికి ప్రధాన నిదర్శనంగా నిలిచింది. ప్రభుత్వ పాఠశాలలకు.. ప్రవేట్ పాఠశాలలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడానికి దోహదపడుతోంది. ఆరుట్ల స్కూల్ గనుక విజయవంతం అయితే.. తెలంగాణలో విద్యా విప్లవానికి రేవంత్ రెడ్డి నాంది పలికినట్టు అవుతుంది.
