Rythu Bharosa 2026: తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో అమలు చేస్తున్న ‘రైతు భరోసా’ పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఏడాదికి ఎకరానికి రూ.12000 చొప్పున రెండు విడతలుగా పంపిణీ చేస్తోంది. ఈ ఏడాదిలోఇప్పటికే మొదటి విడుతను పంపిణీ చేసింది. ఇప్పుడు రెండో విడత కింద ఈ నెల 30న నిధులను విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ముందుగా ఈ భూమి కలిగిన రైతులకు ఈ నిధులు అందనున్నాయి. వారు ఎవరంటే?
రైతు భరోసా రెండో విడతలో భాగంగా మొదటి దశలో ఒక ఎకరం వరకు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రూ.6,000 చొప్పున జమ చేయనున్నారు. చిన్న, సన్నకారు రైతులకు ముందుగా ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది చిన్న రైతులు ఈ విడతలో లబ్ధి పొందనున్నారు.
ఆ తర్వాత రెండో దశలో రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు, అనంతరం ఐదు ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు రైతు భరోసా నిధులను జమ చేయనున్నారు. భూ వివరాల పరిశీలన, అర్హుల జాబితా ఖరారు ప్రక్రియ పూర్తైన వెంటనే ఈ చెల్లింపులు కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు.
ఐదు ఎకరాలకు పైగా భూమి కలిగిన రైతులకు కూడా నిధులు అందుతాయని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే నిధుల లభ్యత, ఆర్థిక సర్దుబాటు, అర్హుల వివరాల ధృవీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత తదుపరి విడతల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఈసారి నిధుల పంపిణీ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రైతుల బ్యాంకు ఖాతాలు, భూ రికార్డులు, ఆధార్ వివరాలను సమన్వయం చేసి అర్హులైన ప్రతి రైతుకు నేరుగా డబ్బులు జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటోంది. దీంతో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నిధులు నేరుగా రైతుల చేతికి చేరనున్నాయి.
రైతు భరోసా నిధుల విడుదలతో ఖరీఫ్ సాగు పనులు ప్రారంభిస్తున్న రైతులకు గణనీయమైన ఊరట లభించనుంది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలుకు ఈ సాయం ఉపయోగపడుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దశలవారీగా అన్ని అర్హులైన రైతులకు నిధులు అందేలా చర్యలు కొనసాగుతున్నాయి.
