Kavitha Kalvakuntla: రాజకీయాలలో రేవంత్ రెడ్డి.. హరీష్ రావు ఉప్పు నిప్పులాగా ఉంటారు. ఒకరి మీద ఒకరు విమర్శలు తీసుకుంటారు. కొన్ని సందర్భాలలో వ్యక్తిగత విషయాలను కూడా బయట పెట్టుకుంటారు.. అయితే వీరిద్దరూ ఇప్పుడు కలిసిపోయారా.. గులాబీ పార్టీని ఖతం చేయబోతున్నారా.. వీరిద్దరూ అసలు ఎక్కడ కలిశారు.. ఎక్కడ ఈ కుట్రలకు శ్రీకారం చుట్టారు.. ఈ విషయాలను తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత బయటపెట్టారు.
చాలా రోజుల తర్వాత కల్వకుంట్ల కవిత విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని.. భారత రాష్ట్ర సమితి కీలక నాయకుడు హరీష్ రావును లక్ష్యంగా చేసుకుని కవిత విమర్శలు చేశారు. హరీష్ రావు.. రేవంత్ రెడ్డి కలిసి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కంపెనీలకు లాభం చేకూర్చే విధంగా పనిచేస్తున్నారట. అధికారంలో ఎవరు ఉన్నా సరే చివరికి ఆంధ్ర ప్రాంత కంపెనీలు.. ఆ ప్రాంతానికి సంబంధించిన నాయకుల మాటే చెల్లుబాటు అవుతోందట. అయితే ఈ లెక్కన కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆంధ్రా ప్రాంతానికి చెందిన కంపెనీల మాటనే చెల్లుబాటు అయినట్టా.. ఆ ప్రకారం చూసుకుంటే కేసీఆర్ కూడా ద్రోహినే కదా.. ఈ మాట మీద నిలబడుతుందా కవిత..
అంతేకాదట పాలలో మిరియాలు.. పసుపు కలుపుకొని తాగే అలవాటు ఉన్న రాష్ట్రీయ ఆర్ఎస్ఎస్ నాయకుడి ఆదేశాలకు అనుగుణంగా హరీష్ రావు పనిచేస్తున్నారట. ఆ ఆర్ఎస్ఎస్ నేత హరీష్ రావు ఇంటికి వస్తున్నప్పుడు పసుపు.. మిరియాలు కలిపిన పాలు సిద్ధం చేస్తారట.. ఆ నాయకుడిని కలవడానికి హరీష్ రావు రాజ్ పుష్ప సంస్థలోని ఓపెన్ స్కై విల్లా కు వెళ్తారట.
ఇటీవల మెదక్ నగరంలో ఎమ్మెల్యేలతో హరీష్ రావు సమావేశమయ్యారట. భవిష్యత్తు తమది అని చెప్పారట. ఆ మీటింగ్ లో ఉన్న ఒక ఎమ్మెల్యే ఈ విషయాన్ని కవితకు వివరించారట. అంతేకాదు ఎన్టీఆర్ మాదిరిగానే కేసీఆర్ పెద్ద నాయకుడని.. ఆ తర్వాత పార్టీని తాను చూసుకుంటానని హరీష్ రావు ఆ ఎమ్మెల్యేలకు చెప్పారట.. దాని వెనుక వ్యవహారాన్ని బిజెపి చూసుకుంటుందని ఆ ఎమ్మెల్యేలకు హరీష్ రావు భరోసా ఇచ్చారట.. అయితే ఇదంతా కూడా గులాబీ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయడానికి జరుగుతున్న ప్రక్రియ అని కవిత కుండబద్దలు కొట్టారు.
ఇక్కడితోనే కవిత ఆగిపోలేదు.. హరీష్ రావు మీద మరో ఆరోపణలు కూడా చేశారు. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన శ్రీ చైతన్య.. నారాయణ విద్యాసంస్థలకు హరీష్ రావు సతీమణి భాగస్వామిగా ఉన్న సంస్థ నుంచి పాలు వెళ్తున్నాయట. ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి ఈ వ్యవహారం సాగుతోందట. దాదాపు వందల కోట్ల రూపాయల విలువైన పాలను హరీష్ రావు సతీమణి భాగస్వామిగా ఉన్న సంస్థ విక్రయించిందట. ఉదయం లేస్తే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తుల మీద విమర్శలు చేస్తే హరీష్ రావు.. ఆ ప్రాంతానికి సంబంధించిన విద్యాసంస్థలకు ఎలా పాలు పోస్తారని కవిత సూటిగానే ప్రశ్నించారు.
కవిత ఆరోపణలు చేసినట్టుగా రేవంత్ రెడ్డి.. హరీష్ రావు కలిసి పోయారా.. ఒకవేళ అలా కలిసిపోతే ఓపెన్ గానే ఈ విషయాన్ని చెప్పవచ్చు కదా.. పైగా హరీష్ రావును ఉద్దేశించి రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. హరీష్ రావు కూడా ఏమాత్రం తగ్గకుండా అదే స్థాయిలో మండిపడుతున్నారు. కవిత మాత్రం వీరిద్దరూ కలిసిపోయారని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే ఈ రాజకీయ చదరంగంలో ఎవరితో ఎవరు ఉంటారు.. ఎవరితో ఎవరు విడిపోతారు.. అనేది అర్థం కాకుండా ఉంది. గతంలో గులాబీ పార్టీలో కీలక నాయకురాలుగా కవిత ఉండేది. తన అన్న గురించి.. నాన్న గురించి గొప్పగా చెప్పుకునేది. పార్టీ గురించి కూడా అద్భుతంగా వివరించేది. తన బావ హరీష్ రావు గురించి కూడా గొప్పగా మాట్లాడేది. కానీ ఇప్పుడు స్వరం మార్చింది.. విమర్శల జోరు పెంచింది. అందుకే అంటారు రాజకీయాలు అనేవి పరమ కంపరమైనవని.. తెలంగాణలో జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తే అవి నూటికి నూరు శాతం కాదు కోటి శాతం నిజమని అర్థమవుతోంది.