Telangana municipal elections : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలకు, నగర పాలకాలకు ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించబోతోంది. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ మొదలైంది. ఆశావాహులు పోటీపడి నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి.. ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. ఒక్కో కౌన్సిలర్ స్థానానికి ఇద్దరు లేదా ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు.
అభ్యర్థుల నుంచి విపరీతమైన పోటీ ఉండడంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎవరికి టికెట్లు కేటాయించాలో తెలియక సతమతమవుతున్నారు. చైర్మన్లను ఇప్పటికే ప్రకటించకూడదని.. అన్ని స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవాలని.. ఆ తర్వాతే సమీకరణాల ఆధారంగా చైర్మన్ పదవులు కేటాయించాలని రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. పలు ప్రాంతాలకు ఎన్నికల పర్యవేక్షకులుగా మంత్రులను ముఖ్యమంత్రిని నియమించారు. వారంతా కూడా ఆయా ప్రాంతాలలో సమాలోచనలు.. సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఒకవైపు ఎన్నికల ప్రక్రియ జరుగుతుండగానే.. మరోవైపు మున్సిపాలిటీలకు.. కార్పొరేషన్లకు భారీగా ఆదాయం వస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసేవారు కచ్చితంగా ఆయా మున్సిపాలిటీలకు.. కార్పొరేషన్లకు ఆస్తి పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా అభ్యర్థులు పన్నులు చెల్లిస్తున్న నేపథ్యంలో మునిసిపాలిటీలకు.. కార్పొరేషన్లకు దండిగా ఆదాయం వస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ కార్పొరేషన్ కు ఏకంగా ఒక అభ్యర్థి 8 కోట్ల 16 లక్షలను చెల్లించింది. ఆమె ఇలా చెల్లించడం ఒకరకంగా సంచలనం కలిగించింది. నిజామాబాద్ నగర కార్పొరేషన్ పోటీలో ఉన్న శమంత నరేందర్ రెడ్డి ఏకంగా 8,16,65,000 కోట్ల ఆస్తి పన్ను బకాయి చెల్లించింది. శమంత కుటుంబానికి ఓ హోటల్ ఉంది. 2009 నుంచి ఈ హోటల్ ఆస్తిపన్ను చెల్లించలేదు. దీనిపై నిజామాబాద్ నగర్ కార్పొరేషన్ అధికారులు హైకోర్టు దాకా వెళ్లారు. శమంత కుటుంబ సభ్యులు కూడా హైకోర్టుకు వెళ్లారు. ఇరుబ్పక్షాల మధ్య దాదాపు 17 సంవత్సరాల పాటు కోర్టులో వాదనలు జరిగాయి. చివరికి హైకోర్టు ఆస్తి పన్ను చెల్లించాలని తీర్పు ఇవ్వడంతో.. శమంత అన్ని కోట్లు కట్టేసింది. ఈమె అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తే మేయర్ అవ్వాలని ఈమె భావిస్తున్నారు. దానికంటే ముందుగానే 8 కోట్లకు మించిన ఆస్తి పన్ను నిజామాబాద్ కార్పొరేషన్ కు చెల్లించారు.