BRS: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుతో పదేళ్లు కలిసి ప్రయాణం చేసిన నేతలంతా ఇప్పుడు ఆయనను ఒంటరి చేసి వెళ్లిపోతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదవులు స్వీకరించిన వారు కూడా కేసీఆర్పై కనికరం చూపడం లేదు. పవర్ ఎక్కడుంటే.. తాము అక్కడే ఉంటాం అన్నట్లుగా బీఆర్ఎస్ను చిలువలు పలువలు చేస్తున్నారు. పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు.
చోటా లీడర్ నుంచి బడా నేత వరకూ..
చిన్న చిన్న నాయకులు పార్టీ మారుతున్నారంటే వారి ఉనికి కాపాడుకోవడానికి అనుకోవచ్చు. కానీ నేటి రాజకీయాల్లో బడా లీడర్లుగా ఎదిగిన వారు కూడా సిద్ధాంతాలు, కట్టుబాట్లు అనేవి ఎప్పుడో వదిలేశారు. అధికారం ఉండాలి. లీడర్ గిరీ చేయాలి అన్నట్లుగా అధికారంలో ఏ పార్టీ ఉంటే.. ఆ పార్టీలో చేరుతున్నారు. తాజాగా కడియం నుంచి కేశవరావు వరకు ముఖ్యనేతలంతా బీఆర్ఎస్ను వీడిపోయారు. పదేళ్లు పదవులు ఇచ్చిన కేసీఆర్పై కనీసం సానుభూతి కూడా చూపకపోవడం ఆశ్చర్యంగా ఉంది.
కేసీఆర్ నేర్పిన విద్యే కదా..
ఇక పదేళ్లు పదవులు అనుభవించిన నేతలను కష్టకాలంలో పార్టీని వీడడం సరికాదు కలా అని అంటే.. కేసీఆర్ నేర్పిన విద్యే కదా అని సమాధానం చెబుతున్నారు. దశాబ్దం క్రితం ఇతర పార్టీల నేతలను బీఆర్ఎస్లోకి లాగి వికృత విధానం మొదలు పెట్టింది కేసీఆరే కదా అంటున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత అయితే కాంగ్రెస్ను చీల్చి సీఎల్పీ లేకుండా చేయలేదా అని గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని చూసింది కేసీఆర్ కాదా అని ఎదురు ప్రశ్నించడం కేసీఆర్పై కనికరం లేదనడానికి నిదర్శనం.
చీల్చి సమర్థించుకోవడం..
ఇక పార్టీలను చీల్చి వాటిని సమర్థించుకోవడం కూడా కేసీఆర్కే చెల్లిందని అంటున్నారు. అసెంబ్లీ వేదికగానే కేసీఆర్ మాట్లాడుతూ నేతలు స్వచ్ఛందంగా వస్తున్నప్పుడు తాను ఏమీ చేయలేనని తెలిపారు. ‘మీరు మీ నాయకులను నిలబెట్టుకోగలగాలి. మా దగ్గరికి వస్తున్నారంటే అది మన తప్పు కాదు. మీ నాయకత్వంపై వారికి నమ్మకం పోయిందని అర్థం. ఇది రాజ్యాంగ విరుద్ధమా? మనం ఎవరినైనా గొంతు కోశామా’ అని ప్రశ్నించిన తీరును ఇప్పుడు పార్టీ వీడుతున్నవారు గుర్తుచేస్తున్నారు. పార్టీలను చీల్చి సమర్థించుకోవడం కేసీఆర్కే చెల్లిందని అంటున్నారు.
సీన్ రివర్స్ అయితే ఏడుపు..
దశాబ్దం తర్వాత సీన్ రివర్స్ అయి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో ఇప్పుడు కేసీఆర్కు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో కారు ఖాళీ అవుతోంది. మాజీ మంత్రి కేటీ. రామారావు అందరిపైనా చర్యలు తీసుకోవాలని స్పీకర్కు ఫిర్యాదు చేశారు. అయితే పదేళ్ల కిందట కేసీఆర్కు అదే పరిస్థితి ఎదురైందని, అయితే తన పదవి ఈ చివర నుంచి మరో చివరకి మారుతున్నదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కేసీఆర్ తన పార్టీ నేతలను నిలదీయడం నేర్చుకోవాలని, తన మనుషులను తమ పార్టీలోకి లాగుతున్నారని ఫిర్యాదు చేయవద్దని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.