KCR Jagtial public meeting: తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మంట మీద ఉన్నాయి. ఎందుకంటే సుదీర్ఘకాలంగా వ్యవసాయ క్షేత్రానికి పరిమితమైన కేసీఆర్ బయటకు వస్తున్నారు. సరిగ్గా గత ఏడాది ఇదే సమయానికి పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు వరంగల్ లో పెట్టిన సభకు కేసిఆర్ వచ్చారు. ఆ తర్వాత ఆయన బహిరంగ సభలో పాల్గొన్నది లేదు. ఇప్పుడు మళ్లీ కెసిఆర్ జనంలోకి వస్తున్నారు. సహజంగానే కెసిఆర్ బయటకు వస్తున్నారంటే ఆయన పార్టీ అనుకూల మీడియా, సోషల్ మీడియాలో జరిగే చర్చ మాములుగా ఉండదు. అవన్నీ పెయిడ్ బాపతు కాబట్టి.. ప్రచారం అదే స్థాయిలో ఉంటుంది. మా సార్ వస్తున్నాడు.. ఇక చూసుకోండి అంటారు.. ఆ సభ ముగిసిన తర్వాత అటువంటి వాతావరణం ఏమీ ఉండదు.
జీవన్ రెడ్డి భారత రాష్ట్ర సమితిలో చేరిన తర్వాత.. జగిత్యాల లో భారీ సభ పెడుతున్నారు. ఈ సభ కోసం జగిత్యాల పట్టణం మొత్తం గులాబీమయమైంది. సహజంగా కేసీఆర్ సభ అంటే హరీష్ రావు ముందు వరుసలో ఉంటారు. జన సమీకరణ.. ఇతర వ్యవహారాలను మొత్తం ఆయన పరిశీలిస్తుంటారు. అయితే ఈసారి జగిత్యాల సభకు కేసిఆర్ వస్తున్నప్పటికీ.. హరీష్ రావు మాత్రం గైర్హాజరయ్యారు. ఉన్నట్టుండి ఆయన ఢిల్లీ వెళ్లిపోయారు. ఆయన వెంట మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కూడా ఉన్నారు.. ఇప్పటికిప్పుడు హరీష్ రావు ఢిల్లీ వెళ్లడం వెనుక బలమైన కారణం ఉంది. కాకపోతే దీనిని నెగటివ్ కోణంలో కాంగ్రెస్, జాగృతి నేతలు ప్రచారం చేస్తున్నారు.
హరీష్ రావు బిజెపి నేతలతో టచ్ లోకి వెళ్లారని.. ఆయన ఢిల్లీ వెళ్లి బిజెపి కండువా కప్పుకుంటున్నారని.. అందువల్లే జగిత్యాల సభను పక్కన పెట్టి కూడా వెళ్లిపోయారని అంటున్నారు. అయితే కాలేశ్వరం కేసులో విచారణ ఉన్నందున ఆయన ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తోంది. హరీష్ రావు తన ఢిల్లీ ప్రయాణంలో గోప్యత ప్రదర్శించిన నేపథ్యంలోనే ఇటువంటి నెగిటివ్ స్పెక్యులేషన్ సాగుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
గతంలో గులాబీ పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రత్యర్థి పార్టీ నాయకుల మీద ఈ స్థాయిలో నెగిటివ్ ప్రచారం చేసేవారు. ఇప్పుడు అదే ప్రచారం హరీష్ రావు వంటి వారు ఎదుర్కొనవలసి రావడం కర్మ సిద్ధాంతానికి ప్రతీక అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ హరీష్ రావు లేకుండా.. కెసిఆర్ సభ అంటేనే.. ఒకింత ఆశ్చర్యంగా ఉందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ కుమార్తె కవిత హరీష్ రావు మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలకు తగ్గట్టుగానే హరీష్ రావు వ్యవహార శైలి ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.