Kalvakuntla Kavitha: తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ’తెలంగాణ రాష్ట్ర సేన’ (టీఆర్ఎస్) పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో జరిగిన ఆవిర్భావ సభలో ఆమె పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించి, రానున్న రాజకీయాల్లో తాను స్వతంత్ర శక్తిగా ఎదగనున్నట్లు సంకేతాలిచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. ఈ క్రమంలో కవిత పెట్టిన పార్టీ ఎవరిని దెబ్బతీస్తుంది అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది.
బీఆర్ఎస్కు తప్పనిసరి పరీక్ష
కవిత తన పార్టీకి ’టీఆర్ఎస్’ అని పేరు పెట్టడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. ఒకప్పుడు కేసీఆర్ నేతృత్వంలోని ఉద్యమ పార్టీ ‘టీఆర్ఎస్’ (తెలంగాణ రాష్ట్ర సమితి) పేరును బీఆర్ఎస్గా మార్చుకున్న తర్వాత ఏర్పడిన సెంటిమెంట్ శూన్యాన్ని భర్తీ చేసేందుకు కవిత ఈ వ్యూహాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ‘బీఆర్ఎస్ తన ఆత్మను కోల్పోయింది‘ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు పాత తరం ఉద్యమకారులను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం బీఆర్ఎస్కు అతిపెద్ద ముప్పుగా మారనుందని, పార్టీ ఓటు బ్యాంకును, ముఖ్యంగా కేడర్ను కవిత వైపు మళ్లించే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.
కేసీఆర్ కుటుంబంపై కవిత దాడి
కవిత తన తొలి ప్రసంగంలో కాంగ్రెస్, బీజేపీలను పక్కనబెట్టి, కేసీఆర్, కేటీఆర్ నాయకత్వాన్ని టార్గెట్ చేయడం గమనార్హం. ‘కేసీఆర్ ఇప్పుడు మారు మనిషి అయ్యారు, గుంట నక్కల చేతిలో బందీ అయ్యారు‘ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కుటుంబ కలహాల తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఆస్తుల పంపకాల విషయంలో తలెత్తిన విభేదాలే ఈ పార్టీ ఆవిర్భావానికి ప్రధాన కారణమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్లోని అసంతృప్త నేతలను, కేటీఆర్, హరీష్రావుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించే శ్రేణులను తనవైపు తిప్పుకోవడమే కవిత ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది.
తెలంగాణ సెంటిమెంట్పై పోరు..
రాష్ట్రంలో తనదైన ముద్ర ఉన్న కవిత, క్షేత్రస్థాయిలో ప్రజలను ప్రభావితం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నారు. కేసీఆర్ ఇటీవల మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ కార్డును తెరపైకి తెచ్చినప్పటికీ, కవిత అదే సెంటిమెంట్ను ’తెలంగాణ రాష్ట్ర సేన’ పేరుతో వాడుకోవడం బీఆర్ఎస్కు పెద్ద ఇబ్బందిగా మారింది. ఒకప్పుడు షర్మిల రాజకీయ ప్రవేశం జరిగినప్పటికీ ఆమెకు లభించిన స్పందన కంటే, కవితకున్న సామాజిక గుర్తింపు మరియు తెలంగాణ ఉద్యమకారులతో ఉన్న అనుబంధం కారణంగా, బీఆర్ఎస్ ఓటు బ్యాంకును ఆమె చీల్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కవిత ఎత్తుగడలు కేసీఆర్ కుటుంబంలోనే కాకుండా, పార్టీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.
తెలంగాణ సెంటిమెంటు..
కేసీఆర్ ఇటీవల జీవన్రెడ్డి చేరిక సభలో తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. కొత్త ఎత్తులు పనిచేయకపోవడంతో పాత సెంటిమెంటును రగిలించే యత్నం చేశాడు. ఇప్పుడు కవిత కూడా తెలంగాణ సెంటిమెంటును పండిచంఆలనుకుంటుంది. దీంతో బీఆర్ఎస్కు ఇది ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. కవితకు తెలంగాణలో మంచి పట్టు ఉంది. ప్రజలను ప్రభావితం చేయగలదు. దీంతో కవిత పార్టీతో ముప్పు ఎదుర్కొనేది బీఆర్ఎస్ పార్టీనే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
