Hyderabad Lakes: హైదరాబాద్ నగరం ఒకప్పుడు చెరువులతో.. కుంటలతో ఉండేది. ఈ నగరాన్ని క్యాపిటల్ ఆఫ్ లేక్స్ అని పిలిచేవారు. ఎప్పుడైతే అభివృద్ధి పేరుతో హైదరాబాద్ నగరంలో పెద్దపెద్ద భవనాలు నిర్మించడం మొదలైందో.. అప్పటినుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
హైదరాబాద్ నగర్ వ్యాప్తంగా ఉండే వేలాది చెరువులు మాయమైపోయాయి. కుంటలు కాలగర్భంలో కలిసిపోయాయి. నాలాలు ఆక్రమణకు గురయ్యాయి. ప్రభుత్వ స్థలాలు.. పార్కుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చివరికి ప్రభుత్వ ఆధీనంలో ఉండే గుట్టలను సైతం అక్రమార్కులు కరిగించి సొమ్ము చేసుకున్నారు. అంతకుముందు ఎలా ఉండేదో తెలియదు గాని.. 2014 నుంచి 23 వరకు హైదరాబాద్ నగరంలో అక్రమాలు దారుణంగా జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తూ ఉంటారు.
హైదరాబాద్ నగరంలో వర్షం పడితే చాలు చాలా ప్రాంతాలు నీట మునిగిపోతాయి. ప్రజలయితే నరకం చూడాల్సి ఉంటుంది. ఇక లోతట్టు ప్రాంతాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాలలో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్రమణ లేని హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పంతో హైడ్రా అనే వ్యవస్థను తీసుకొచ్చారు. హైడ్రా కు కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ ను నియమించారు. ఆయన ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను.. చెరువులను.. కుంటలను బాగు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
హైడ్రా రంగనాథ్ వ్యవహర శైలి ఎలా ఉన్నప్పటికీ.. మాదాపూర్ ఏరియాలో సున్నం చెరువును ఆయన బాగు చేసిన విధానం మాత్రం ఎప్పటికీ గొప్పగానే ఉంటుంది. ఈ చెరువును బాగు చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు ఆయన పరిశీలనకు వచ్చాయి. ముఖ్యంగా సున్నం చెరువు పరిధిలో కొంతమంది బోర్లు వేసి ఆ నీటిని కాలేజీలు.. వసతి గృహాలకు విక్రయించేవారు. అయితే ఆ బోర్లను సీజ్ చేసినప్పుడు.. నీటి నమూనాలను హైడ్రా సేకరించింది. ఆ నమూనాలలో అత్యంత ప్రమాదకరమైన అవశేషాలు కనిపించాయి. మనుషుల్లో అత్యంత తీవ్రమైన అనారోగ్యాలకు కారణమయ్యే భార లోహాలు అందులో కనిపించాయి. పరిమితికి మించి దాదాపు 12 రెట్లు అందులో ఎక్కువగా ఉన్నాయని.. అది మాదాపూర్ వాసులకు అత్యంత ప్రమాదకరమని రంగనాథ్ వ్యాఖ్యానించారు.
సున్నం చెరువును బాగు చేసిన తర్వాత ప్రమాదకరమైన కాలుష్య పదార్థాలు అందులోకి రావడం పూర్తిగా తగ్గిపోయిందని.. నీరు కూడా స్వచ్చంగా మారిందని.. నీరు స్వచ్చంగా ఉంటే భూగర్భ జలాలు కూడా బాగుంటాయని రంగనాథ్ పేర్కొన్నారు. సున్నం చెరువును బాగు చేసిన తర్వాత మాదాపూర్ చుట్టుపక్కల ప్రాంతాలలో భూగర్భ జలాలు పెరిగాయి. అక్కడ చెరువులో నీరు కూడా స్వచ్ఛంగా ఉంది. పక్షులు రావడం మొదలైంది. గతంలో సున్నం చెరువు ప్రాంతం చుట్టూ దుర్గంధం ఉండేది. కాలుష్య కారకాలు ఉండేవి. ఒకరకంగా చెప్పాలంటే ఆ చుట్టుపక్కల ప్రాంతం కాలుష్య కాసారం లాగా ఉండేది. ఎప్పుడైతే హైడ్రా ఆపరేషన్ మొదలుపెట్టిందో.. అప్పుడే అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వాస్తవానికి చెరువు బాగుంటేనే ఊరు బాగుంటుంది. ఊరు బాగుంటేనే ప్రజలు బాగుంటారు. అభివృద్ధి అనే మోజులో పడిపోయి చెరువులను ఆక్రమించి నిర్మాణాలను చేపట్టడం అత్యంత దారుణం.
View this post on Instagram