Gaddar Awards Telangana Scam: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గద్దర్ అవార్డుల కార్యక్రమంలో కుంభకోణం జరిగిందా.. కోట్ల రూపాయలు దారి మళ్లాయా? ఇందులో ఇష్టారాజ్యంగా వ్యవహరించారా.. ముందుగా అనుకున్న దానికంటే.. ఎక్కువ ఖర్చు పెట్టారా.. ఇందులో ఎవరి పాత్ర ఎంత.. ఇప్పుడు ఇవే విషయాలను బయటపెట్టారు గులాబీ పార్టీ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్.
గద్దర్ అవార్డుల పేరుతో తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలుగా ఖర్చు చేసిందని శ్రవణ్ ఆరోపించారు. తెలంగాణ సంస్కృతిని గాలికి వదిలేసిందని మండిపడ్డారు. జ్యూరి సభ్యులను.. సినీ పెద్దలను అవమానించారని విమర్శించారు.. విచ్చలవిడిగా ఖర్చుపెట్టిన వ్యవహారంపై ప్రభుత్వం నోరు విప్పాలని.. ఎఫ్ డీ సీ చైర్మన్.. సంబంధిత మంత్రిపై చర్యలు తీసుకోవాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. ఈనెల 19న హైటెక్స్ లో తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిలిం అవార్డులను అందజేత కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతను విజ్ క్రాఫ్ట్ అనే ముంబైకి చెందిన కంపెనీకి అప్పగించింది. అయితే అందులో ఉన్న లెక్కలకు సంబంధించిన ఓ కాపీ బయటికి వచ్చింది. దీనిని శ్రవణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
గద్దర్ అవార్డుల ఫంక్షన్ లో శ్రేయ ఘోషల్ కు 1,65,00,000, దేవిశ్రీప్రసాద్ కు 60,00,000, దేవిశ్రీప్రసాద్ టెక్ రైడర్ కు 20,00,000, నిధి అగర్వాల్ కు 20,00,000, we unbeatable (special act) 10,50,000, classical act 6,50,000, వ్యాఖ్యాతలు సుమ, ప్రదీప్ కు 13 లక్షలు, కొరియోగ్రఫీ చేసిన వారికి 39,20,000, కాస్ట్యూమ్స్ కు ఐదు లక్షలు.. ప్రయాణానికి.. బస, భోజనాల ఖర్చుకు 60 లక్షలు.. రెడ్ కార్పెట్ యాంకర్లకు ఏడు లక్షలు.. హెయిర్.. మేకప్ వేసిన వారికి ఐదు లక్షలు.. మొత్తం ఆర్టిస్టుల ఖర్చు నాలుగు కోట్ల 11 లక్షల 20,000 బిల్లు అయింది.. వేదిక.. లైటింగ్.. ఇతర ఖర్చులకు భారీగా వెచ్చించారని శ్రవణ్ ఆరోపించారు. ఇక ఇదే డాక్యుమెంట్లో టెండర్ కాస్ట్ కాలంలో రెండు కోట్ల 13 లక్షలని ఉందని.. అయితే అసలు బిల్లు మాత్రం నాలుగు కోట్ల 11 లక్షల ఇరవై వేలని.. అనుకున్న దానికంటే రెండు కోట్లు అదనంగా ఖర్చు పెట్టారని శ్రవణ్ ఆరోపించారు. ఈ అదనపు ఖర్చును ఎఫ్డిసి చైర్మన్ లేదా సినిమాటోగ్రఫీ మంత్రి భరిస్తారా అని శ్రవణ్ ప్రశ్నించారు. విజ్ క్రాఫ్ట్ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చిన వ్యక్తులు ఎవరని.. తెలంగాణ ప్రాంతంలో ఎటువంటి ఏజెన్సీలు లేవా.. దీనికి ఏమైనా ఓపెన్ టెండర్లు పిలిచారా.. లేదా ప్రభుత్వం తమకు కావలసిన వారికి కట్టబెట్టిందా అని.. శ్రవణ్ ప్రశ్నించారు. తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు అలానే ఉండిపోయాయని.. కానీ ఒకరోజు ధూంధాం వేడుకకు నాలుగు కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఏమి వచ్చిందని శ్రవణ్ ప్రశ్నించారు.
“మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె!”
గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 – ప్రజల పైసలతోటి ప్రభుత్వం చేస్తున్న అడ్డగోలు ఖర్చు! తెలంగాణ సంస్కృతిని గాలికి వదిలేసి, పిలిచిన పెద్దమనుషులను, జ్యూరీ సభ్యులను అవమాన పరిచిన తీరు ఇది!
ఈ విచ్చలవిడి ఖర్చుల మీద ప్రభుత్వం నోరు విప్పాలె. దీనికి… pic.twitter.com/eW92mAtRYN
— Prof Dasoju Sravan Kumar (@sravandasoju) March 24, 2026
