AIADMK Election Manifesto Tamil Nadu: శాశ్వత అభివృద్ధి.. దీర్ఘకాలిక పనులు చేసి ఒకప్పుడు రాజకీయ నాయకులు ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగేవారు. ఇప్పుడు కాలం మారింది. శాశ్వత అభివృద్ధి పక్కకు వెళ్ళిపోయింది. దీర్ఘకాలిక పనులు కాలగర్భంలో కలిసిపోయాయి. స్థూలంగా చెప్పాలంటే ఎప్పటికయ్యేది ప్రస్తుతమో అన్నట్టుగా నేటి రాజకీయాలు మారిపోయాయి.
ఎన్నికలు సమీపిస్తే చాలు రాజకీయ పార్టీలు ప్రజల మీద ఉచిత పథకాల వల వేస్తున్నాయి. అన్ని ఫ్రీ అని చెబుతూ ప్రజలను సోమరిపోతులను చేస్తున్నాయి. గతంలో ఇటువంటి ఉచిత పథకాలు ఒక స్థాయి వరకే ఉండేవి. ఇప్పుడు అందరికీ అన్నీ ఉచితమని రాజకీయ పార్టీలు చెబుతుండడం గమనార్హం. పైగా అధికారంలోకి రావడానికి రాజకీయ పార్టీలు ఉచిత మంత్రాలను ప్రజల మీద ప్రయోగించడం వల్ల బడ్జెట్ మొత్తం సంక్షేమ పథకాలకే సరిపోతుంది. బడ్జెట్ మొత్తం స్కీములకే సరిపోతున్న నేపథ్యంలో.. దీర్ఘకాలిక అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి. శాశ్వత అభివృద్ధి పథకాలు మరుగున పడిపోతున్నాయి.
తమిళనాడులో త్వరలో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష ఏఐడీఎంకే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. ఇందులో భాగంగా రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఉచితంగా రిఫ్రిజిరేటర్ అందిస్తామని ప్రకటించింది. రేషన్ బియ్యంతో పాటు కిలో కందిపప్పు.. లీటర్ వంట నూనె ఇస్తామని వెల్లడించింది. ప్రతి కుటుంబానికి 10,000 వరకు ఆర్థిక సహాయం.. మహిళలతో పాటు పురుషులకు కూడా బస్సులలో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. విద్యా రుణాలను మాఫీ చేస్తామని.. వృద్ధులకు రెండు వేల రూపాయల సామాజిక పింఛన్ అందిస్తామని.. గ్రామీణ ఉపాధి పథకం కింద 150 రోజుల కూలీ దినాలు కల్పిస్తామని ప్రకటించింది. ఐదు లక్షల మంది వర్కింగ్ ఉమెన్స్ కు 25వేల రాయితితో టూ వీలర్లు అందిస్తామని తన మేనిఫెస్టోలో వెల్లడించింది. జల్లికట్టు ఎద్దులకు శిక్షణ ఇచ్చే కుటుంబాలకు సంవత్సరం సూచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు.. పదిలక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని ఏఐడీఎంకే ప్రకటించింది.
జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీవీలను.. మిక్సీలను ఉచితంగా ఇచ్చారు. నాడు ఆమె ప్రకటించిన ఈ పథకం ఎన్నికల్లో ఏఐడీఎంకేను గెలిపించింది. ఇప్పుడు అదే మంత్రాన్ని ఈ పార్టీ నమ్ముకుంది. ఇప్పటికే తమిళనాడు రాష్ట్రం లో రెవెన్యూ లోటు కొనసాగుతోంది. కొన్ని సందర్భాలలో ఉద్యోగులకు సకాలంలో వేతనాలు కూడా పడటం లేదు. అలాంటప్పుడు ఏఐడీఎంకే అధికారంలోకి వస్తే ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయని సామాజిక విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఉచిత ప్రయాణం వల్ల చాలా రాష్ట్రాలలో రవాణా సంస్థలు అప్పులలో ఉన్నాయి. ఇప్పుడు పురుషులకు కూడా ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తే.. రవాణా సంస్థలు నిండా మునగడం ఖాయమని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
