Congress Internal Politics Leaks: ఇది కొత్తేమీ కాదు. కాంగ్రెస్ పార్టీలో అనాదిగా వస్తున్న సంప్రదాయమే. అందరికీ తెలిసినట్టుగానే ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా ఉంటుంది. ఒకరి పొడ ఒకరికి గిట్టదు. ఒకరు ఎదిగితే ఇంకొకరు తట్టుకోలేరు. స్థూలంగా చెప్పాలంటే పరమపద సోపానం అనేది కాంగ్రెస్ పార్టీలో అణువణువు కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొత్తగా మారింది లేదు. కొత్తగా ఆ పార్టీలో అలవడిన క్రమశిక్షణ కూడా లేదు.
ఇటీవల పీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మీద బిగ్ టివి ఛానల్ లో వ్యతిరేక కథనాలు ప్రసారమయ్యాయి. ఈ ఛానల్ ముఖ్యమంత్రి కి అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తులదని తేలింది. కాంగ్రెస్ పార్టీకి బిగ్ టివి మొదటినుంచి కూడా సపోర్ట్ చేసుకుంటూ వస్తోంది. ఒక్క నెగిటివ్ స్టోరీ కూడా అందులో పబ్లిష్ కాలేదు. పబ్లిష్ అయ్యే అవకాశం కూడా లేదు. అయితే ఉన్నట్టుండి ఆ ఛానల్ లో మహేష్ కుమార్ గౌడ్ మీద నెగిటివ్ స్టోరీలు టెలికాస్ట్ కావడం నిజంగానే సంచలనం కలిగించింది.
మహేష్ కుమార్ గౌడ్ వ్యవహార శైలి మీద బిగ్ టీవీ అలాంటి స్టోరీలు టెలికాస్ట్ చేయడం నిజంగానే ఒక రకమైన దిగ్భ్రాంతిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కలిగించింది. అసలు మహేష్ కుమార్ గౌడ్ కు.. బిగ్ టి వి యాజమాన్యానికి ఎక్కడ తేడా వచ్చిందో అర్థం కావడం లేదు.. తెర వెనుక ఎలాంటి వివాదాలున్నా సరే.. తెర ముందు ఇలా బిగ్ టీవీ చేస్తుందని ఎవరూ అంచనా వేయలేదు. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ వర్సెస్ బిగ్ టివి యాజమాన్యానికి పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇది ఎక్కడ దాకా వెళ్తుంది.. ఎంత దాకా దారి తీస్తుందనేది చూడాల్సి ఉంది.
ఆమధ్య భట్టి విక్రమార్క మీద ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ తన కొత్త పలుకులో బొగ్గు గనుల కేటాయింపు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై విక్రమార్క తెర ముందుకు వచ్చారు. ఆయన కూడా తనదైన స్టైల్ లో రాధాకృష్ణ మీద విమర్శలు చేశారు. దీనికంటే ముందు ఎన్టీవీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఒక కలెక్టర్ మధ్య సంబంధం ఉన్నట్టు న్యూస్ టెలికాస్ట్ అయింది. దాని మీద ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్రస్థాయిలో మండిపడింది..
కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఆ ఛానల్ ఆ స్థాయిలో నెగిటివ్ స్టోరీ పబ్లిష్ చేయడానికి బొగ్గు గనుల కేటాయింపు ప్రధాన కారణమని ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ సరికొత్త బాంబు పేల్చారు.. ఎన్ టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి అల్లుడు.. భట్టి విక్రమార్క కలిసి మైనింగ్ వ్యవహారం చేస్తున్నారని.. దానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డుపడుతున్నారని.. అందువల్లే ఆయన మీద ఎన్టీవీలో స్టోరీ పబ్లిష్ చేసినట్టు రాధాకృష్ణ చెప్పుకొచ్చారు.
వాస్తవానికి మీడియా వాస్తవాలను మాత్రమే ప్రసారం చేస్తే ఇంత చర్చ ఉండేది కాదు. మీడియా అనేది రాజకీయ పార్టీకి తొత్తుగా మారిపోయిన తర్వాత.. కేవలం రివేంజ్ తీర్చుకునే వ్యవస్థ గానే అది రూపాంతరం చెందింది. గతంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీడియా కాస్త హద్దుల్లో ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియా వ్యక్తిగత దాడులకు మాత్రమే ఉపకరించే వ్యవస్థగా దిగజారిపోయింది.
కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద వ్యక్తుల చేతుల్లో పరోక్షంగా కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి. అవి ఇష్టానుసారంగా కథనాలను ప్రసారం చేస్తున్నాయి. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ మరింత దారుణంగా అభాస పాలవుతోంది. ఫలితంగా పదేళ్లపాటు అధికారం కోసం ఎదురుచూసిన ఆ పార్టీ.. ఇప్పుడు ఉన్న అధికారాన్ని నిలబెట్టుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఒకరికి తెలియకుండా మరొకరు మీడియాకు లీకులు ఇచ్చుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ పరువు బజారున పడుతోందని.. అపార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంతటి దుస్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక లాభదాయకమైన అంశం చోటు చేసుకుంటున్నది. అదేంటంటే క్షేత్రస్థాయిలో భారత రాష్ట్ర సమితి బలంగా లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కాస్తలో కాస్త బెటర్ పొజిషన్ కనిపిస్తోంది. ఒకవేళ భారత రాష్ట్ర సమితి గనుక బలంగా ఉండి ఉంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వేరే విధంగా ఉండేది. ఇప్పటికైనా ఆ నాయకులు మారాలని.. సమిష్టిగా పార్టీ విజయం కోసం కృషి చేయాలని కార్యకర్తలు కోరుతున్నారు.
