Homeటాప్ స్టోరీస్Bandi Sanjay BJP: బండిని పక్కన పెట్టిన బీజేపీ.. హరీశ్, రేవంత్‌ కోసం ఎందుకు తాపత్రయం?

Bandi Sanjay BJP: బండిని పక్కన పెట్టిన బీజేపీ.. హరీశ్, రేవంత్‌ కోసం ఎందుకు తాపత్రయం?

Bandi Sanjay BJP: బీజేపీ.. అంటే ఒక సైద్ధాంతిక పార్టీ. అధికారంతో సంబంధం లేకుండా విలువలు, సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే నేతలు ఉంటారని అంతా భావిస్తారు. అయితే అదంతా ఒకప్పుడు. ప్రస్తుత బీజేపీ విధానం మారింది. బెంగాల్‌లో తృణమూల్‌ నుంచి వచ్చిన నేతను ముందు పెట్టి అధికారంలోకి వచ్చింది. అదే వ్యూహం తెలంగాణలో అనుసరించాలని భావిస్తోంది. అధికారం సాధించాలనే ఒకే లక్ష్యంతో బీజేపీ అధిష్టానం కొత్త వ్యూహాలు రూపొందిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని లేదా బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావును ఆకర్షించి అధికారంలోకి రావాలని ఢిల్లీ నాయకత్వం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సొంతంగా పార్టీని నిర్మించిన స్థానిక నేతలను వదిలేసి, ఇతర పార్టీల నుంచి వచ్చే వారిపై ఎంతగా నమ్మకం పెట్టుకుంటున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది.

కిషన్‌రెడ్డి డిఫెన్స్‌.. బండి దూకుడు..
రాష్ట్రంలో ఎక్కువ కాలం బీజేపీని నడిపిన కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డికి అధిష్టానం అనేక అవకాశాలు ఇచ్చింది. రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేసినప్పటికీ పార్టీని బలంగా నిలబెట్టడంలో ఆయన విధానం ఎక్కువగా రక్షణాత్మకంగానే ఉండేది. బండి సంజయ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. ఆయన హిందుత్వ నినాదాలు, ప్రజా యాత్రలు, దూకుడు రాజకీయ శైలి బీజేపీని మూడో స్థానం నుంచి బీఆర్‌ఎస్‌కు ప్రధాన పోటీదారుగా మార్చాయి. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఫలితాలు ఈ మార్పుకు నిదర్శనం.

బండి తప్పించి కాంగ్రెస్‌ను గెలిపించి..
2023 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు బండి సంజయ్‌ను అకస్మాత్తుగా అధ్యక్ష పదవి నుంచి తొలగించి మళ్లీ కిషన్‌ రెడ్డికి బాధ్యతలు అప్పగించడం పార్టీ ఎదుగుదలకు బ్రేకులు వేసింది. ఈ నిర్ణయం వల్ల బీఆర్‌ఎస్‌ వ్యతిరేక ఓటర్లు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపారు. అనేక క్షేత్రస్థాయి కార్యకర్తలు బండి సంజయ్‌ను పక్కన పెట్టడమే కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు.

ఇప్పుడు వలస నేతలవైపు..
సొంత పార్టీలోని దూకుడు నాయకులను అణచివేసిన ఢిల్లీ నాయకత్వం, ఆ తర్వాత బయటి నుంచి వచ్చిన ఈటల రాజేందర్‌ వంటి నేతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఈటల రాజేందర్‌ చేరికతో కొంత ప్రయోజనం జరిగినప్పటికీ, బీజేపీ అసలు బలమైన ఓటు బ్యాంకును నిలబెట్టడంలో ఆయన సాధించలేకపోయారు. ఇప్పుడు మళ్లీ రేవంత్‌ రెడ్డి లేదా హరీష్‌ రావు వైపు దృష్టి పెట్టడం ఢిల్లీ నాయకత్వం రాజకీయ నిరాశను చూపిస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలు తాత్కాలికంగా అధికారం ఇవ్వగలరేమో గానీ, బీజేపీ భావజాలాన్ని గ్రామస్థాయిలో వ్యాప్తి చేయలేరు.

బండి సంజయ్‌కు పూర్తి స్వేచ్ఛ ఇస్తే..
రాజకీయ సమీకరణాల పరంగా బండి సంజయ్‌ తెలంగాణలో బీజేపీకి బలమైన ఆయుధంగా మారగలరు. వెనుకబడిన వర్గాలలో ఆయనకున్న సామాజిక పట్టు, యువతలో ఉన్న మాస్‌ ఇమేజ్, హిందుత్వ సెంటిమెంట్, ఏ నాయకుడినైనా ఎదుర్కొనే దూకుడు – ఇవన్నీ పార్టీకి పెద్ద మద్దతు ఇవ్వగలవు. ఒక్కసారి ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, రాబోయే ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు తెస్తే పార్టీని అధికారంలోకి తీసుకెళ్లగలరని అనేక మంది రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్షించి సొంత పార్టీని బలహీనం చేసుకోవడం ఏ పార్టీకైనా ప్రమాదకరం. రేవంత్‌ రెడ్డి లేదా హరీశ్‌రావు లాంటి వారు ఒక్కసారిగా బీజేపీలోకి వస్తారని ఆశించడం కంటే, కళ్లముందున్న బండి సంజయ్‌ వంటి స్థానిక నాయకుడికి పగ్గాలు అప్పగించడమే తెలంగాణలో కమలం వికసించడానికి సరైన మార్గం. ఢిల్లీ అధిష్టానం ఇప్పటికైనా వలస వ్యూహాలను వదిలి, స్థానిక నాయకత్వంపై నమ్మకం పెంచుకుంటేనే రాష్ట్రంలో బీజేపీకి విజయం సాధ్యమవుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular