Beer Sales
Beer Sales: తెలంగాణలో ఏప్రిల్లోనే ఎండలు మండిపోతున్నాయి. 45 డిగ్రీల సెల్సీయస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో మద్యం ప్రీయులు బీర్లు లాగించేస్తున్నారు. ఉక్కపోత, వేడిగాలుల నుంచి చిల్డ్ బీర్లతో చిల్ అవుతున్నారు. దీంతో ఈసారి బీర్ల అమ్మకాల రికార్డు బ్రేక్ చేశారు.
రూ.670 కోట్ల బీర్లు అమ్మకం..
ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 18వ తేదీ వరకే రాష్ట్రంలో రూ.670 కోట్ల విలువైన 23 లక్షల కేస్ల బీర్లు తాగేశారు. ఇది ఆల్టైం రికార్డని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గతేడాది ఏప్రిల్ నెల అమ్మకాలతో పోలిస్తే 28.7 శాతం ఎక్కువగా జరిగాయని పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో బీర్లు దొరకడం లేదు. దీంతో అధికారులు అందుబాటులో ఉంచేందుకు యత్నిస్తున్నారు. బీర్లతో పాటు బ్రాందీ, విస్కీ అమ్మకాలు కూడా పెరిగాయని అబ్కారీ శాఖ తెలిపింది. ఎండలు మండుతుండటంతో మద్యం ప్రియులు చల్లని బీర్లు ఎక్కువగా తాగుతున్నారని వెల్లడించారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతుండడంతో.. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరగాయని పేర్కొంటున్నారు.
మే నెలలో మరింత పెరిగే ఛాన్స్..
ఏప్రిల్లోనే బీర్ల అమ్మకాలు ఇలా ఉంటే.. వచ్చే మే నెలలో ఎండలు మరింత మండుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. మద్యం, మాంసం, శీతల పానీయాలు తీసుకోవద్దని పేర్కొంటోంది. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగాలని వైద్యులు చెబుతున్నారు. అయితే మందు బాబులు మాత్రం చల్లని బర్లు లాగించేందుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో మే నెలలో గత రికార్డులకు మించి బీర్లు లాగించేస్తారని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు.
నీటి ఎద్దడితో బీర్ల కొరత..
ఒకవైపు బీర్ల అమ్మకాలు పెరుగుతుంటే.. మరోవైపు నీటి ఎద్దడి కారణంగా బీర్ల ఉత్పత్తి తగ్గుతోంది. ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురవడంతో జలాశయాల్లో నీటి మట్టాలు వేగంగా అడుగంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బేవరేజెస్కు నీటి సరఫరా తగ్గించింది. దీంతో కంపెనీలు ఉత్పత్తి తగ్గించాయి. ఈ కారణంగా కొన్ని జిల్లాల్లో బీర్లు దొరకడం లేదు. కొన్ని మద్యం శాపుల్లో కొన్ని రకాల బ్రాండ్ల బీర్లు మాత్రమే లభిస్తున్నాయి.