Kerala Food APP: అందరికీ ఆర్థిక స్తోమత ఉండదు. నచ్చిన ఆహారాన్ని ఇష్టంగా తినే అవకాశం ఉండదు. అటువంటివారు అర్ధాకలితోనే బతుకు బండిని నడిపిస్తుంటారు.. తమ దారిద్రాన్ని తిట్టుకుంటూ.. జీవితాన్ని సాగిస్తుంటారు. అటువంటి వారి కోసం ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది. దీనివల్ల కొత్త కొత్త రుచులు తినలేని వారి కడుపు నింపుతోంది.
జొమాటో, స్విగ్గి, ఇలాంటి యాప్స్ ఆర్థిక స్తోమత ఉన్న వారికి మాత్రమే.. ఎందుకంటే ఆ స్థాయిలో డబ్బులు చెల్లించి ఫుడ్ ఆర్డర్ పెట్టేవారు మన సమాజంలో కొంతమంది మాత్రమే ఉంటారు. డబ్బులు ఆ స్థాయిలో లేక.. ఫుడ్ డెలివరీ చేసే సామర్థ్యం లేక చాలామంది అర్ధాకలితోనే జీవితాన్ని సాగిస్తుంటారు. ఇటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని కేరళ రాష్ట్రంలోplenti పేరుతో ఓ యాప్ ను అందుబాటులో తీసుకొచ్చారు. ఈ యాప్ ను మాథ్యూస్ మార్టిన్ బృందం రూపొందించింది.. కేరళ రాష్ట్రంలో హోటళ్లు, బేకరీలలో మిగిలిపోయిన ఆహారాన్ని వృధా చేయకుండా.. సామాన్యులకు తక్కువ ధరకు అందించడానికి ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. కేవలం మూడోవంతు ధరకు మాత్రమే ఈ ఆహారాన్ని అందిస్తారు. ఈ యాప్ ప్రస్తుతం తిరువనంతపురం, కొచ్చి ప్రాంతంలో సేవలు అందిస్తున్నారు.
యూజర్లు సర్ ప్రైజ్ బ్యాగ్స్ రూపంలో ఫుడ్ బుక్ చేసుకుని.. నేరుగా వెళ్లి తెచ్చుకోవాల్సి ఉంటుంది.. ఎందుకంటే ఇది కేవలం ఆకలి తీర్చడానికి మాత్రమే రూపొందించిన యాప్. ఇందులో ఎటువంటి కమర్షియల్ కోణం ఉండదు. అందువల్లే డెలివరీ బాయ్ ల వంటి సౌకర్యం లేదు. అందువల్లే ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నవారు సర్ప్రైజ్ బ్యాగ్స్ రూపంలో నేరుగా తెచ్చుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల విలాసవంతమైన భోజనాన్ని.. ఖరీదైన రుచులను ఆస్వాదించలేని వారికి అవకాశం లభిస్తుంది. అయితే మిగిలిపోయిన ఆహారం అయినంత మాత్రాన.. నాణ్యత లేకుండా ఉండదు. నాణ్యంగా ఉన్న ఆహారాన్ని మాత్రమే విక్రయిస్తుంటారు.
“చాలామందికి భారీగా డబ్బు ఖర్చుపెట్టి విలాసవంతమైన భోజనం చేసే అవకాశం ఉండదు. రోజు ఒకే రకమైన ఆహారం తింటే శరీరం కూడా అంతగా స్వీకరించదు. తప్పదు కాబట్టి చాలామంది ఇలా తింటూ ఉంటారు. అలాంటి ఇబ్బందులు లేకుండా.. తక్కువ ధరకు ఖరీదైన ఆహారాన్ని అందించడానికి ఈ యాప్ రూపొందించాం. చాలామందికి ఇది ఉపయోగపడుతోంది. ఇందులో ఎటువంటి కమర్షియల్ కోణం లేదు. కేవలం కడుపు నింపాలి అనే తాపత్రయం తప్ప. అది చాలామందిని ఆకట్టుకుంటుందని” మాథ్యూస్ మార్టిన్ బృందం చెబుతోంది.