MNC Job Salary Hike Issue India: బహుళ జాతి సంస్థలో ఉద్యోగం అంటే ఎవరైనా సరే ఎగిరి గంతులు వేస్తారు. ముఖ్యంగా ఐటీ విభాగంలో పని చేసేవారు కాలర్ ఎగరేస్తారు. ఎందుకంటే ఐదు అంకెల జీతం.. అంతకుమించిన జీవితం.. సౌకర్యాలు.. సౌలభ్యాలు.. వారంలో రెండు రోజులు సెలవులు.. చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. అయితే ఇదంతా అబద్ధమా.. మల్టీ నేషనల్ కంపెనీలలో ఉద్యోగం అంటే బానిసత్వానికి పరాకాష్ట లాగా ఉంటుందా.. చెప్పుకునే స్థాయిలో సౌకర్యాలు ఉండవా.. జీతాలు కూడా సరిగ్గా ఇవ్వరా.. ఈ ప్రశ్నలకు ఢిల్లీ నగరానికి చెందిన ఓ ఐటీ ఉద్యోగి చెప్పిన సమాధానాలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఇప్పటికే బహుళ జాతి సంస్థలు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ పేరు చెప్పి ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ నిరాటకంగా కొనసాగుతోంది. భవిష్యత్తు కాలంలో ఇలాంటి విధానాలు కొనసాగుతాయని, ఆయా సంస్థలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా జాబ్ మార్కెట్ కోలుకునే అవకాశం కనిపించడం లేదు. దీంతో ఉద్యోగం చేస్తున్నవారు.. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు ఆందోళనలో కూరుకుపోయారు. ఉద్యోగం రాని వాళ్ళది ఒక బాధ అయితే.. ఉద్యోగం ఉన్న వాళ్ళది మరొక రకమైన బాధ.
ఢిల్లీ నగరంలో ఒక మల్టి నేషనల్ కంపెనీలో ఓ ఉద్యోగి పని చేస్తున్నాడు. అతడికి గత ఏడాది కేవలం 9 రూపాయలు మాత్రమే జీతం పెరిగింది.ఈ ఏడాది అది కూడా లేదు. పైగా బాండ్, నోటీస్ పీరియడ్ వంటి కారణాలవల్ల ఉద్యోగం మారలేకపోతున్నాడు. ప్రయాణ ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. కంపెనీ వాటిని కూడా ఇవ్వడం లేదు. సోషల్ మీడియాలో అతడు తన బాధను వ్యక్తం చేయడంతో మల్టి నేషనల్ కంపెనీలలో జరుగుతున్న దారుణం బయటపడింది..
అతడు పెట్టిన ఈ పోస్ట్ మీద రకరకాల స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత జాబ్ మార్కెట్ పూర్తిగా మారిపోయిందని.. కంపెనీల అవసరాలు వేరే విధంగా ఉన్నాయని.. అలాంటప్పుడు నైపుణ్యాలు పెంచుకోవలసిన బాధ్యత ఉద్యోగుల మీద ఉందని నెటిజన్లు చెబుతున్నారు. అలాకాకుండా రొటీన్ గా పని చేస్తే ఏ కంపెనీ కూడా ఒప్పుకోదని.. బాండ్, ఇతరత్రా ఉన్నాయి కాబట్టి ఆ కంపెనీ భరిస్తోందని.. అవి లేకుంటే ఎప్పుడో బయటికి పంపించేదని నెటిజన్లు పేర్కొంటున్నారు.. మరికొందరేమో కంపెనీ విధానాల మీద తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పుడు పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని.. అలా కాకుండా కేవలం 9 రూపాయలు వేతనం పెంచడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
కంపెనీ నిర్వాహకులు ఒకసారి బయటికి వచ్చి బతికి చూపించాలని.. ఆ స్థాయిలో ఖర్చులు పెరిగిపోయిన తర్వాత వారికి కూడా అర్థమవుతుందని నెటిజన్లు చెబుతున్నారు. ప్రస్తుతం జాబ్ మార్కెట్లో ఒత్తిడి ఉందని.. దానిని సాకుగా చూపించి ఉద్యోగులను వేధిస్తున్నారని.. ఇది సరైన పద్ధతి కాదని నెటిజన్లు చెబుతున్నారు. కార్మిక చట్టాలు మల్టి నేషనల్ కంపెనీలకు వర్తించవా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
