Yuvraj Singh Batting: “ఆ పొద్దు వాడు కత్తి తిప్పిన వేగం చూస్తే ఒళ్ళు జలదరించింది. కత్తి వాని చేతికి మొలిచిందేమో అనిపించింది.. నారపరెడ్డి బిడ్డ వీర రాఘవ మన వాళ్ల మీద కత్తి దూస్తా ఉంటే భయమేసింది” అరవింద సమేత సినిమాలో జగపతిబాబు జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి పలికే డైలాగ్ అది. ఈ డైలాగు వింటుంటే రోమాలు నిక్కబొడుస్తుంటాయి. మామూలుగానే జూనియర్ ఎన్టీఆర్ ఫైట్ బాగా చేస్తారు. ఇక ఈ సినిమాలో అయితే శివతాండవం చేశారు.
అచ్చం ఈ సినిమా డైలాగ్ మాదిరిగానే టీమ్ ఇండియా ఆల్ టైం ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ రెచ్చిపోయాడు. 2011లో వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా మీద తన ప్రతాపం చూపించాడు. ఆస్ట్రేలియా అంటేనే ఒక మాదిరిగా ఆడే యువరాజ్.. నాడు తన బ్యాట్ చేతికి మొలచినట్టు బ్యాటింగ్ చేశాడు. నాడు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో యువరాజ్ అదరగొట్టాడు. దుమ్ము రేపే రేంజ్ లో బ్యాటింగ్ చేశాడు. ఫలితంగా 24 సంవత్సరాల తర్వాత వరల్డ్ కప్ లో టీమిండియా ఆస్ట్రేలియా మీద విజయం సాధించింది. నాడు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆటగాడు పాంటింగ్ సెంచరీ చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. బ్రాడ్ హడిన్ హాఫ్ సెంచరీ చేశాడు. చివర్లో డేవిడ్ హసి 38 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో అశ్విన్, జహీర్ ఖాన్, యువరాజ్ తలా మూడు వికెట్లు సాధించారు.
నాటి మ్యాచ్లో ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ చేసింది. 261 పరుగులు చేసింది. ఆ తర్వాత టీమిండియా చేజింగ్ మొదలుపెట్టింది.. మొదట్లో కాస్త ఇబ్బంది పడినప్పటికీ.. ఆ తర్వాత టీమిండియా లక్ష్యాన్ని విజయవంతంగా చేదించడాన్ని మొదలుపెట్టింది. ఆ తర్వాత వికెట్లు కోల్పోయిన క్రమంలో యువరాజ్.. బ్యాటింగ్ కు వచ్చాడు. వన్ డౌన్ ఆటగాడిగా వచ్చిన అతడు.. జట్టుకు మూల స్తంభాలాగా నిలిచాడు. 8 ఫోర్ల సహాయంతో 57 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాకు విజయాన్ని దూరం చేసి.. భారత జట్టును ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఫైనల్ వెళ్లిన టీమ్ ఇండియా శ్రీలంకను ఓడించింది. వన్డే వరల్డ్ కప్ సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్లో కూడా యువరాజ్ అదరగొట్టాడు. చివరి వరకు నిలబడి టీమ్ ఇండియాకు విజయాన్ని అందించాడు. రక్తపు వాంతులు అవుతున్నప్పటికీ.. యువరాజ్ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ప్రాణం ముందా.. దేశం ముందా అంటే.. దేశానికే ఓటు వేసి.. గెలిపించాడు యువరాజ్. నాటి మ్యాచ్లో సచిన్ 53, గౌతమ్ గంభీర్ 50, సురేష్ రైనా 34, విరాట్ కోహ్లీ 24 పరుగులు చేశారు.
