Homeక్రీడలుక్రికెట్‌INDW vs SLW : టి20 వరల్డ్ కప్ లో భారత మహిళల జట్టు అరుదైన...

INDW vs SLW : టి20 వరల్డ్ కప్ లో భారత మహిళల జట్టు అరుదైన ఘనత.. ఆస్ట్రేలియా రికార్డు సమం

INDW vs SLW : టి20 వరల్డ్ కప్ లో భాగంగా దుబాయ్ వేదికగా బుధవారం శ్రీలంక , భారత మహిళల జట్లు తలపడుతున్నాయి. ఇందులో భాగంగా టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 172 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత జట్టులో షఫాలీవర్మ(43), స్మృతి మందాన(50), హర్మన్ ప్రీత్ కౌర్ (52) పరుగులు చేసి సత్తా చాటారు. ఫలితంగా భారత్ 172 పరుగుల భారీ స్కోరు చేసింది. తొలి వికెట్ కు షఫాలీవర్మ, స్మృతి మందాన 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 7 కు మించి రన్ రేట్ తో పరుగులు తీశారు. ఇటీవల జరిగిన ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాటి ఓటమికి ప్రతీకారం అన్నట్టుగా టీమిండియా ప్లేయర్లు ఆడారు. దూకుడుగా బ్యాటింగ్ చేసి శ్రీలంక బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నారు. టీమిండియా ఓపెనర్లు ధాటిగా ఆడుతున్న నేపథ్యంలో.. వారిని అవుట్ చేయించేందుకు శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు ఏకంగా ఏడుగురు బౌలర్లను ప్రయోగించింది. చివరికి ఆమె కూడా బౌలింగ్ చేయాల్సి వచ్చింది. నాలుగు ఓవర్లు వేసిన చామరి 34 పరుగులు ఇచ్చి ఒక వికెట్ దక్కించుకుంది.. అమ కాంచన ఒక వికెట్ దక్కించుకుంది. స్మృతి మందాన రన్ అవుట్ అయింది. అయితే పాకిస్తాన్ జట్టుతో మెడ నొప్పితో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగిన హర్మన్ ప్రీత్ కౌర్.. ఈ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. 27 బంతులు ఎదుర్కొని ఎనిమిది బౌండరీలు, ఒక సిక్స్ సహాయంతో 52 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. భారీ రన్ రేట్ తేడాతో మ్యాచ్ గెలవాల్సిన నేపథ్యంలో.. భారత ప్లేయర్లు చెమటోడ్చారు. వీరోచితంగా బ్యాటింగ్ చేశారు. పాకిస్తాన్ జట్టుపై జరిగిన మ్యాచ్లో చేజింగ్ లో తీవ్రంగా ఇబ్బందిపడిన భారత ప్లేయర్లు.. ఈ మ్యాచ్లో మాత్రం స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. ఇక ఇదే క్రమంలో అనేక రికార్డులను బద్దలు కొట్టారు.

ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్

ఈ మ్యాచ్లో షఫాలీవర్మ, స్మృతి మందాన సరికొత్త రికార్డులను సృష్టించారు. మహిళల టి20 క్రికెట్లో అత్యధికంగా 50+ పరుగుల (ఏదైనా వికెట్ కు) భాగస్వామ్యాలను నెలకొల్పడంలో సరికొత్త ఘనతను అందుకున్నారు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా అలీస్సాహిలి – బెత్ మూనీ తొలి స్థానంలో ఉన్నారు. వీరిద్దరూ ఇరవై సార్లు 50 కంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత స్థానంలో భారతీయ ప్లేయర్లు స్మృతి మందాన – షఫాలి వర్మ ఉన్నారు. శ్రీలంక జట్టుతో జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్లో భాగంగా తొలి వికెట్ కు వీరిద్దరూ 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తద్వారా అలీస్సాహిలి – బెత్ మూనీ సరసన చేరారు. వీరి తర్వాత స్థానంలో న్యూజిలాండ్ ప్లేయర్లు సుజి బేట్స్ – సోఫీ డివైన్ ఉన్నారు. వీరిద్దరూ 18సార్లు 50+ పరుగుల కంటే ఎక్కువ భాగస్వామ్యాలు నెలకొల్పారు.. యూఏఈ జట్టుకు చెందిన కవీషా – ఈషా జోడి 14 సార్లు 50 కంటే ఎక్కువ భాగస్వామ్యాలను నిర్మించింది. ఇదే సమయంలో టి20 వరల్డ్ కప్ లో ఏదైనా వికెట్ కు భారత జట్టు తరఫున అత్యధిక భాగస్వామ్యాలు నెలకొల్పిన జోడిగా స్మృతి మందాన – షఫాలి వర్మ రికార్డు సృష్టించింది.. 2018లో గయాన వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత ప్లేయర్లు హర్మన్ ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్ 134 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 2014లో సిల్ హెట్ వేదికగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో మిథాలీ రాజ్ – పూనమ్ రౌత్ 117 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 2014లోనే సిల్ హెట్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో మిథాలీ రాజ్ – మిథా ప్రీత్ కౌర్ 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. శ్రీలంక జట్టుతో 2024లో యూఏఈ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్లో స్మృతి మందాన – షఫాలి వర్మ 98 పరుగుల భాగస్వామ్యాన్ని నిలకొల్పారు. శ్రీలంక జట్టుతో 2010లో బస్సె టెరే వేదికగా జరిగిన మ్యాచ్లో మిథాలీ రాజ్ – సులక్షణ నాయక్ 86 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular