ICC shocks Pakistan Cricket Board: టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమ్ ఇండియాతో మ్యాచ్ ఆడబోమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ మేనేజ్మెంట్ మీద విమర్శలు వ్యక్తమౌతున్నాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు టీమిండియాతో ఆడే మ్యాచ్ లో తాము పాల్గొనబోమని ఆదివారం ప్రకటించింది. ఈ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. పాకిస్తాన్ జట్టుకు టీమ్ ఇండియా మీద గొప్పగా రికార్డు లేదు. ముఖ్యంగా వన్డే వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్ లో టీమిండియా పై పాకిస్తాన్ జట్టుకు దారుణమైన రికార్డు ఉంది. అందువల్లే పాకిస్తాన్ జట్టు భారత జట్టుతో ఆడలేక ముందుగానే తన ఓటమిని ఒప్పుకుందని టీమిండి అభిమానులు పేర్కొంటున్నారు.
మరోవైపు పాకిస్తాన్ జట్టు భారత్ తో ఆడేందుకు నిరాకరించిన నేపథ్యంలో ఐసీసీ కీలకమైన ప్రకటన చేసింది. ఇంతవరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమకు అధికారికంగా ఎటువంటి సమాచారాన్ని చేరవేయలేదని.. భారత జట్టుతో తాము ఆడబోమనే విషయాన్ని చెప్పలేదని ఐసిసి వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ప్రకటన క్రికెట్ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని ఐసీసీ వర్గాలు అంటున్నాయి. అంతేకాదు పాకిస్తాన్ జట్టుపై కీలక చర్యలు తీసుకునే అవకాశం కొట్టి పారేయలేదని ఐసిసి వర్గాలు చెబుతున్నాయి. పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం ఆ దేశంలో క్రికెట్ పై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిస్తుందని తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే పున పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
” పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆదాయం అంత గొప్పగా ఉండదు. ఇటీవల కాలంలో ఆ దేశ క్రికెట్ మేనేజ్మెంట్ ఆదాయం లేక చాలా ఇబ్బందులు పడింది. ఆ దేశంలో ఆర్థిక పరిస్థితులు కూడా చెప్పుకునే స్థాయిలో లేవు. అలాంటప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఏది ఏమైనప్పటికీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దలు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలా తీసుకుంటేనే ఆ దేశంలో క్రికెట్ అభివృద్ధికి ఎంతో కొంత నిధులు లభిస్తాయి. అలా జరగని పక్షంలో పాకిస్తాన్ దేశంలో క్రికెట్ తీవ్రమైన ప్రతికూలతను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని” క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
భారత్ కూడా పాకిస్తాన్ జట్టుతో ఆడేందుకు ఒప్పుకోలేదు. కానీ తటస్థ వేదికల్లో మాత్రం పాకిస్తాన్ జట్టుతో భారత్ ఆడింది. క్రీడా స్ఫూర్తిని గౌరవించింది. ఆపరేషన్ సిందూర్ ముందు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గాం ప్రాంతంలో దాడులు చేశారు. భారతీయులను పొట్టన పెట్టుకున్నారు. దానిని దృష్టిలో పెట్టుకొని భారతి క్రికెట్ మేనేజ్మెంట్ పాకిస్తాన్ తో తటస్థ వేదికలో మాత్రమే ఆడాలని నిర్ణయించుకుంది. ఛాంపియన్ ట్రోఫీ, ఆసియా కప్ లో దుబాయ్ లో ఆడింది. అంతేతప్ప పాకిస్తాన్ జట్టుతో ఆడకూడదని నిర్ణయించుకోలేదు. కానీ, పాకిస్తాన్ ఉన్నట్టుండి భారత జట్టుతో జరిగే మ్యాచ్ లో ఆడబోమని చెప్పడం ఆ దేశ క్రికెట్ పెద్దల తల పొగరుకు నిదర్శనమని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.