Homeక్రీడలుక్రికెట్‌SRH vs GT : మోడీ అడ్డాలో మెరుపులు ఆశిస్తే .. తుస్సుమనిపించారేంటి బ్రో?

SRH vs GT : మోడీ అడ్డాలో మెరుపులు ఆశిస్తే .. తుస్సుమనిపించారేంటి బ్రో?

SRH vs GT : కోల్ కతా పై 200 కు మించి పరుగులు.. జస్ట్ వెంట్రుకవాసిలో విక్టరీ తప్పింది. ఇక ముంబై జట్టుపై అయితే ఐపీఎల్ లో సరికొత్త రికార్డు నమోదయింది. ఈ మ్యాచ్ లోనూ 200 కు మించి స్కోర్ నమోదయింది.. క్లాసెన్ ఊర మాస్ ఇన్నింగ్స్.. హైదరాబాద్ జట్టును తిరుగులేని పొజిషన్ లో నిలిపింది.. అలా సాధించిన స్కోర్ తో ముంబై జట్టు మీద విజయం సాధించిన నేపథ్యంలో ఆదివారం అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ లోనూ హైదరాబాద్ భారీ స్కోర్ సాధిస్తుందని అందరూ అనుకున్నారు. 200 పక్కా అని భావించారు. క్లాసెన్ నుంచి భారీ ఇన్నింగ్స్ అంచనా వేశారు. కానీ జరిగింది వేరు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టుకు గొప్ప ఆరంభం లభించలేదు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (16; 17 బంతుల్లో రెండు ఫోర్లు) దాటిగా ఆడే క్రమంలో అజ్మతుల్లా బౌలింగ్లో దర్శన్ నల్కండే కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్(19; 14 బంతుల్లో మూడు ఫోర్లు) వెంటనే అవుట్ కావడంతో 58 పరుగుల వద్ద హైదరాబాద్ జట్టు ఓపెనర్లను కోల్పోయింది. ఈ క్రమంలో అభిషేక్ శర్మ, మార్క్రమ్ ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను భుజాలకు ఎత్తుకున్నారు. అభిషేక్ ఇరవై బంతుల్లో 29 పరుగులు చేశాడు. రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టి దూకుడుగా ఆడినప్పటికీ.. మోహిత్ శర్మ బౌలింగ్లో గిల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మార్క్రమ్ కూడా 19 బంతుల్లో 17 పరుగులు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్లో రషీద్ ఖాన్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 108 పరుగులకే నాలుగు కీలక వికెట్లను హైదరాబాద్ కోల్పోయింది.. ఈ దశలో క్లాసెన్, షాబాజ్ అహ్మద్.. బ్యాటింగ్ కు వచ్చారు. అయితే వారిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. మెరుపు ఇన్నింగ్స్ ఆడతారని భావిస్తే.. క్లాసెన్(13 బంతుల్లో 24 ఒక ఫోర్, రెండు సిక్స్ లు) మెరుపులు మెరిపించే క్రమంలో రషీద్ ఖాన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. షాబాజ్ అహ్మద్ కూడా 20 బంతుల్లో 22 పరుగులు చేసి మోహిత్ శర్మ బౌలింగ్ లో రాహుల్ తేవాటియా కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అప్పటికి హైదరాబాద్ జట్టు 159 పరుగులు చేసింది. ఆరు కీలక వికెట్లు కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ గోల్డెన్ డక్ గా అవుట్ అయ్యాడు. చివర్లో అబ్దుల్ సమద్ 14 బంతుల్లో 29 పరుగులు చేయడంతో హైదరాబాద్ ఆమాత్రమైనా స్కోర్ చేయగలిగింది .

గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ మూడు వికెట్లు పడగొట్టాడు. అజ్మతుల్లా, ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ తలా ఒక వికెట్ తీశారు. ఈ మైదానం పేస్ బౌలింగ్ కు అనుకూలంగా ఉండడంతో.. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. సొంత మైదానం కావడంతో అద్భుతమైన బంతులు సంధించారు. ఫలితంగా హైదరాబాద్ జట్టు 8 వికెట్లు నష్టపోయి 162 పరుగులు మాత్రమే చేసింది. గుజరాత్ జట్టు ముందు 163 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ జట్టు వికెట్లు ఏమీ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. వృద్ధిమాన్ సాహ 9, గిల్ 8 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. కాగా, హైదరాబాద్ జట్టు తక్కువ స్కోరు చేయడంతో.. సోషల్ మీడియాలో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.” నరేంద్ర మోడీ అడ్డాలో మెరుపులు మెరిపిస్తారనుకుంటే..ఇలా తుస్సు మనిపించారేంటి బ్రో” అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular