Shubman Gill: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 2026 ఎడిషన్ కు సంబంధించి రోజుకో సంచలనం చోటు చేసుకుంటుంది. ఈ సీజన్లో అన్ని జట్లకు ఇండియన్ ప్లేయర్లు నాయకత్వం వహిస్తున్నారు అని గొప్పగా చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఆ గొప్పను కాస్త పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని జట్లకు నాయకత్వం వహిస్తున్న ప్లేయర్లు ఒత్తిడి తట్టుకోలేక రిజర్వ్ బెంచ్ కు పరిమితమవుతున్నారు.
శనివారం ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై సారథి హార్దిక్ పాండ్యా ఆడలేదు. అతడి స్థానంలో సూర్య కుమార్ యాదవ్ జట్టుకు నాయకత్వం వహించాడు. హార్దిక్ పాండ్యాకు గాయం కావడం వల్ల అతడు సారధ్య బాధ్యతలనుంచి తప్పుకున్నాడని వార్తలు వచ్చాయి. అయితే అతడు ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాడని.. అందువల్లే కాస్త రిఫ్రెష్ కోరుకున్నాడని.. అతడి కోరికను మేనేజ్మెంట్ సమ్మతించి ఢిల్లీతో జరిగిన మ్యాచ్ కు దూరం పెట్టిందని వార్తలు వస్తున్నాయి. కొంతమంది గాసిప్ రాయుళ్లు మాత్రం అతడు సరిగా ఆడ లేకపోవడం వల్లే మేనేజ్మెంట్ పక్కన పెట్టిందని అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంతో అటు ముంబై మేనేజ్మెంట్.. ఇటు హార్దిక్ పాండ్యా బయట పెడితే గాని తెలియదు.
హార్దిక్ పాండ్యా విషయం అలా ఉంచితే.. గుజరాత్ జట్టు సారధిగా ఉన్న గిల్ కూడా రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు. అతడు గాయపడ్డాడని.. అందువల్లే ఈ మ్యాచ్ లో ఆడటంలేదని వార్తలు వస్తున్నాయి. అతని స్థానంలో రషీద్ ఖాన్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దూకుడుగా పరుగులు చేస్తోంది. మరోవైపు గిల్ రిజర్వ్ బెంచ్ లో యాక్టివ్గానే కనిపిస్తున్నాడు. ఉత్సాహంగా తోటి ప్లేయర్లతో మాట్లాడుతున్నాడు. ఇటీవల జరిగిన తొలి మ్యాచ్లో గుజరాత్ జట్టు ఓడిపోయింది. ఈ క్రమంలోనే మేనేజ్మెంట్ అతడిని పక్కన పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.
ఐపీఎల్ లో ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. గతంలో మేనేజ్మెంట్లు గెలుపులను.. ఓటములను సమానంగా తీసుకునేవి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే బెంగళూరు ట్రోఫీ గెలిచిన తర్వాత దాని విలువ అమాంతం పెరిగిపోయింది. అందువల్లే అన్ని యాజమాన్యాలు ట్రోఫీ మీద ఈసారి కన్ను వేశాయి. అందువల్లే ఆటగాళ్లు సమర్ధవంతంగా ఆడాలని భావిస్తున్నాయి. ఏ ఆటగాడు విఫలమైనా సరే ఓర్చు కోవడం లేదు. దీనికి రిషబ్ పంత్.. లక్నో జట్టు యజమాని సంజీవ్ ఉదంతమే ఒక బలమైన ఉదాహరణ.. ఇప్పుడు సంజీవ్ బాటలోనే ముంబై యాజమాన్యం నడిచింది. గుజరాత్ యాజమాన్యం కూడా దానిని కొనసాగించింది. మరి మిగతా యాజమాన్యాలు ఇలానే వ్యవహరిస్తాయా.. సరిగ్గా ఆడలేని ప్లేయర్లపై వేటు వేస్తాయా.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.
