Homeక్రీడలుక్రికెట్‌Shreyas Iyer : ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ అని అవకాశాలు ఇస్తే.. సున్నా చుట్టి వస్తున్నాడు.....

Shreyas Iyer : ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ అని అవకాశాలు ఇస్తే.. సున్నా చుట్టి వస్తున్నాడు.. డౌటే లేదు భయ్యా.. నీ కెరియర్ ముగిసినట్టే..

Shreyas Iyer :  టీమిండియా స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ దులీప్ ట్రోఫీలో దారుణమైన ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఇటీవల జరిగిన మ్యాచ్లో సున్నా వద్ద అవుట్ అయిన అతడు.. మరోసారి అదే సీన్ రిపీట్ చేశాడు. అనంతపురం వేదికగా జరిగిన మ్యాచ్లో సున్నా పరుగులకే అవుట్ అయ్యాడు. ఐదు బంతులు ఎదుర్కొన్న అతడు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరుకున్నాడు. రాహుల్ చాహర్ సంధించిన బంతిని భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించి.. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి చేతికి దొరికిపోయాడు. దులీప్ ట్రోఫీలో అయ్యర్ ఇండియా – డీ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో 0 పరుగులకు అయ్యర్ అవుట్ కావడం ఇది రెండవసారి. ఇటీవల ఇండియా – ఏ జట్టుతో జరిగిన మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ డక్ ఔట్ అయిన విషయం విధితమే. ఈ క్రమంలో అయ్యర్ టెస్ట్ క్రికెట్ కెరియర్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ సమయంలో నెటిజన్లు అయ్యర్ ఆట తీరుపై దారుణమైన విమర్శలు చేస్తున్నారు.

ఆ స్కోర్ మాత్రమే

దులీప్ ట్రోఫీలో అండర్ డాగ్ ఆటగాళ్లు సెంచరీల మీద సెంచరీలు చేస్తుంటే.. శ్రేయస్ అయ్యర్ మాత్రం తేలిపోతున్నాడు. ఇప్పటివరకు అతడు ఒక హాఫ్ సెంచరీ మాత్రమే కొట్టాడు. 9, 54, 0, 41, 0 స్కోర్ చేసి పూర్తిగా నిరాశ పరుస్తున్నాడు. ముఖ్యంగా రెండుసార్లు అతడు డక్ అవుట్ కావడం తీవ్ర ఇబ్బందికి గురిచేస్తోంది. రెండుసార్లు మాత్రమే అతడు రెండు అంకెల స్కోర్ చేశాడు. ఇటీవల తమిళనాడు వేదికగా జరిగిన బుచ్చిబాబు టోర్నీలో అయ్యర్ ముంబై జట్టు తరఫున రంగంలోకి దిగాడు. కేవలం 2, 22 పరుగులు మాత్రమే చేసి నిరాశపరచాడు. వాస్తవానికి భారత జాతీయ జట్టులో ఇటీవల ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టులో అయ్యర్ స్థానం కోల్పోయాడు. తిరిగి జాతీయ జట్టులోకి ప్రవేశించాలంటే దులీప్ ట్రోఫీలో అయ్యర్ సత్తా చాటడం అత్యంత ముఖ్యం. కానీ అతడు పూర్తిగా తేలిపోతున్నాడు.. జాతీయ జట్టులో చోటు సంపాదించాలంటే అయ్యర్ పరుగుల వరద పారించాల్సి ఉంది. కానీ అతడేమో అలా చేయకుండా సున్నా పరుగులకే అవుట్ అయ్యి వస్తున్నాడు. దీంతో అతడి కెరియర్ ముగిసినట్టేనని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం భారత జట్టు బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఇది ముగిసిన తర్వాత 8 టెస్ట్ మ్యాచ్ లు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో ఆడుతుంది. రెండు మేజర్ టోర్నీలు ముందు ఉన్న నేపథ్యంలో.. ఇలానే ఆడితే శ్రేయస్ అయ్యర్ కు అవకాశం లభించడం చాలా కష్టం.

మరోవైపు యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ సత్తా చాటుతున్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు..దులీప్ ట్రోఫీలో మరో ఆటగాడు ఇషాన్ కిషన్ ఇప్పటికే ఒక సెంచరీ బాదాడు. ఈ లెక్కన చూసుకుంటే జాతీయ జట్టులోకి శ్రేయస్ అయ్యర్ కు చోటు లభించడం చాలా కష్టమని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular