Sanju Samson Vs MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత బలమైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్. బ్యాటింగ్.. బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉండడం వల్లే ఈ జట్టు బలమైనది కాదు.. అంతకుమించి తన వ్యూహాలతో జట్టును విజయ పథాన నడిపించే సారధి మహేంద్రసింగ్ ధోని ఈ జట్టుకు అండగా ఉన్నాడు. అందుకే ధోని సారధ్యంలోని చెన్నై జట్టును ఓడించడం ప్రతి జట్టుకు ఒక సవాల్. అయితే, ఐపీఎల్ లోనే అత్యంత బలమైన చెన్నై జట్టుకు గత మూడేళ్ల నుంచి ఓ యంగ్ కెప్టెన్ సారధ్యంలోని జట్టు ముచ్చెమటలు పట్టిస్తోంది. అదే సంజు శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై జట్టుకు చుక్కలు చూపిస్తోంది రాజస్థాన్ రాయల్స్ జట్టు. తాజాగా గురువారం జైపూర్ లోని సవాయి మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ పై 32 పరుగులు తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ జట్టు టాప్ లేపింది. పాయింట్లు పట్టికలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ టాప్ నుంచి మూడో స్థానానికి పడిపోయింది.
ధోని వ్యూహాలకు.. పదునైన వ్యూహాలతో చెక్ పెడుతున్న సంజు..
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయాల్లో కెప్టెన్ మాస్టర్ మైండ్ మహేంద్రసింగ్ ధోని వ్యూహాలది కీలక పాత్ర అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అయితే అటువంటి చెన్నై జట్టును ఈ సీజన్లో రెండోసారి ఓడించింది రాజస్థాన్ జట్టు. రెండు సందర్భాల్లోను యువ కెప్టన్ సంజు శాంసన్ వ్యూహాలతో చెన్నై జట్టుకు చుక్కలు చూపించాడు. మొదట చపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ 3 వికెట్ల తేడాతో చెన్నై పై విజయం సాధించింది. ఇప్పుడు సొంత గడ్డపై సంజు జట్టు 32 పరుగులు తేడాతో చెన్నై జట్టును ఓడించింది. గడిచిన నాలుగేళ్లుగా ఇదే విధమైన ప్రదర్శనతో చెన్నై జట్టుపై విజయాలు సాధిస్తోంది రాజస్థాన్ జట్టు. రాజస్థాన్ పై ధోని సేన ఒకే ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. 2021లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ పై ధోని సేన 45 పరుగులు తేడాతో విజయం సాధించింది. ఆ తరువాత నుంచి ఇప్పటి వరకు ఒక్క విజయం కూడా చెన్నై జట్టు కైవసం చేసుకోలేదు.
15 మ్యాచుల్లో.. 13 మ్యాచ్ ల్లో రాజస్థాన్ విజయం..
2008 నుంచి ఇప్పటి వరకు ఐపీఎల్ లో చెన్నై, రాజస్థాన్ రాయల్స్ జట్లు 15 సార్లు తలపడగా.. 13 సార్లు రాజస్థాన్ జట్టు విజయం సాధించింది. రెండుసార్లు మాత్రమే చెన్నై జట్టు గెలిచింది. పూర్తి స్థాయిలో చెన్నైపై ఆధిపత్యాన్ని కనబరుస్తోంది రాజస్థాన్ జట్టు. మాస్టర్ మైండ్ కెప్టెన్సీతో అదరగొడుతున్న చెన్నైకి.. చెమటలు పట్టిస్తున్నాడు యువ కెప్టెన్ సంజు శాంసన్. అంతే కాకుండా గతేడాది రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ లో రన్నరప్ గా నిలిచింది. ఈ సీజన్ లో 8 మ్యాచుల్లో 198 పరుగులు చేసి బ్యాటింగ్ లోను ఆకట్టుకుంటున్నాడు సంజు. ఇందులో రెండు అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇటు బ్యాటింగ్, అటు కెప్టెన్సీ తో అదరగొడుతూ.. మహేంద్రసింగ్ ధోనీకే ముచ్చెమటలు పట్టిస్తున్నాడు సంజు శాంసన్.
నెరవేరని టీమిండియా జట్టులోకి ఎంట్రీ కల..
ఐపీఎల్ లో ఎంత అదరగొడుతున్న, ఎన్ని రికార్డులు సొంతం చేసుకుంటున్నా.. సంజు శాంసన్ ఒక కల మాత్రం నెరవేరడం లేదు. అదే టీమ్ ఇండియా జట్టులోకి ఎంట్రీ. ఐపీఎల్ లో రాణించిన ఎంతో మంది టీమిండియా జట్టులోకి ప్రవేశించారు. అద్భుతమైన ప్రతిభ, అంత కంటే గొప్ప ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నప్పటికీ అదృష్టం కలిసి రాక సంజు శాంసన్ కు మాత్రం టీమిండియాలో స్థానం దక్కడం లేదు. వరుసుగా ఫెయిల్ అవుతున్న కేఎల్ రాహుల్ ను నమ్మినంతగా.. సంజు శాంసన్ ను నమ్మడం లేదు మన సెలెక్టర్లు. శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ గాయాలతో ఇప్పటికే టీమ్ ఇండియాకు దూరమయ్యారు. వీరిద్దరి స్థానంలో సంజు శాంసన్ అయితే బెటర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు టీమిండియా అభిమానులు. చూడాలి మరి రానున్న సిరీస్ ల కోసమైనా సెలక్టర్లు సంజు శాంసన్ ను ఎంపిక చేస్తారో లేదో.