Sameer Rizvi: బుమ్రాకు రెస్పెక్ట్ ఇచ్చాడు. దీపక్ చాహర్ కు చుక్కలు చూపించాడు. మిచెల్ సాంట్నర్ కు పీడకలను మిగిల్చాడు. శార్దూల్ ఠాకూర్ కు వేదన కలిగించాడు. మయాండ్ మర్కండే కు నరకం అంటే ఎలా ఉంటుందో లైవ్ లో చూపించాడు. కార్బిన్ జోష్ కైతే బంతి పట్టుకోవాలంటేనే భయం కలిగేలా చేశాడు. ఇవన్నీ చేసింది కేఎల్ రాహుల్ కాదు.. నితీష్ రానా అంతకంటే కాదు.. అతడు మరెవరో కాదు సమీర్ రిజ్వి.
చెన్నై జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న రిజ్వి.. మెగా వేలంలో చెన్నై జట్టు వదులుకోవడంతో.. ఢిల్లీ యాజమాన్యం కొనుగోలు చేసింది. బదాని నేతృత్వంలో అతడు తన బ్యాటింగ్ స్టైల్ పూర్తిగా మార్చుకున్నాడు. అందువల్లే బీభత్సంగా ఆడుతున్నాడు. గత సీజన్లో చివరి మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసిన అతడు.. ఈ సీజన్లో ఇప్పటికే వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. ఇటీవల జరిగిన మ్యాచ్లో 47 బంతుల్లో 70 పరుగులు చేశాడు.
ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్ల సహాయంతో 90 పరుగులు చేశాడు. వాస్తవానికి అతడు సెంచరీ చేస్తాడని అనుకున్నప్పటికీ.. బాష్ బౌలింగ్లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో సూర్య సేన బ్యాటింగ్ మొదలు పెట్టింది. ఢిల్లీ బౌలర్ల దూకుడు ముందు తలవంచింది.. పటిష్టమైన బ్యాటింగ్ లైన్ అప్ ఉన్నప్పటికీ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సరే కుమార్ యాదవ్ 51, రోహిత్ శర్మ 35, నమన్ దీర్ 28 పరుగులు చేశారు. ఢిల్లీ జట్టు బౌలర్లలో ముఖేష్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఎంగిడి, అక్షర్ పటేల్, విప్రజ్ నిగమ్, నటరాజన్ తలా ఒక వికెట్ సాధించారు.
ముంబై జట్టు విధించిన 163 పరుగుల లక్ష్యాన్ని సాధించడానికి రంగంలోకి దిగిన ఢిల్లీ జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించలేదు. ఓపెనర్ కేఎల్ రాహుల్ కేవలం ఒకే పరుగు చేశాడు. దీపక్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. నిస్సాంక 44 పరుగులు చేశాడు. నితీష్ రన్ అవుట్ అయ్యాడు. ఈ దశలో వచ్చిన సమీర్, మిల్లర్ దూకుడుగా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ ఏకంగా నాలుగో వికెట్ కు 76 పరుగులు జోడించారు. అంతకుముందు సమీర్ రిజ్వి, నిస్సాంక మూడో వికెట్ కు 66 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఒకానొక దశలో 73 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న ఢిల్లీ జట్టును రిజ్వి కాపాడాడు. వన్ మ్యాన్ షో తో అదరగొట్టాడు. ఢిల్లీ మైదానం నలుమూలల బంతిని పరుగులు పెట్టించాడు. సిక్సర్లతో.. ఫోర్ లతో హోరెత్తించాడు. రిజ్వి ప్రమాదకరమైన ఆటగాడు అయినప్పటికీ చెన్నై జట్టు వదులుకుంది. ఢిల్లీ అతడిని అందిపుచ్చుకుంది. ఇప్పుడేమో అతడు జట్టుకు ఆపద్బాంధవుడు అయ్యాడు. ముంబై జట్టు తన పేరును ఎప్పటికీ గుర్తుంచుకునే విధంగా చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు.
