Homeక్రీడలుRCB Vs GT: ఆర్సీబీ చేజింగ్.. ప్రేక్షకులకు థ్రిల్లర్ మూవీని పరిచయం చేసింది

RCB Vs GT: ఆర్సీబీ చేజింగ్.. ప్రేక్షకులకు థ్రిల్లర్ మూవీని పరిచయం చేసింది

RCB Vs GT: వరుస ఓటములు.. పాయింట్ల పట్టికలో చివరి స్థానం.. మాజీ క్రికెటర్ల విమర్శలు.. అంతమంది ఆటగాళ్లున్నప్పటికీ ఏం ఉపయోగమంటూ ఎత్తి పొడుపులు.. సరిగ్గా ఇలాంటి సమయంలోనే గోడకు కొట్టిన బంతిలాగా బెంగళూరు దూసుకొచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు విజయాలు అందుకొని, పాయింట్ల పట్టికలో ఏకంగా ఏడో స్థానానికి దూసుకెళ్లింది. ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. శనివారం రాత్రి సొంతమైదానంలో చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో, గుజరాత్ పై నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. నెట్ రన్ రేట్ ను మెరుగుపరచుకుంది.

ఇటీవల మ్యాచ్ లలో ఈ మైదానంపై పరుగుల వరద పారింది.. కానీ శనివారం నాటి మ్యాచ్లో అందుకు విరుద్ధమైన సన్నివేశం చోటుచేసుకుంది. ప్లాట్ మైదానం కాస్త ఒక్కసారిగా బౌలర్లకు అనుకూలంగా మారిపోయింది. ఫలితంగా ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆల్ అవుట్ అయింది. గుజరాత్ జట్టులో షారుక్ ఖాన్ 37 టాప్ స్కోరర్ గా నిలిచాడు. యష్ దయాల్, వైశాఖ్, మహమ్మద్ సిరాజ్ తలా రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఈ స్వల్ప లక్ష్యాన్ని బెంగళూరు 13.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి సాధించింది. బెంగళూరు కెప్టెన్ డూ ప్లేసిస్ 64 పరుగులతో అదరగొట్టాడు. విరాట్ కోహ్లీ 42 రన్స్ చేసి సత్తా చాటాడు. గుజరాత్ బౌలర్లలో నాలుగు వికెట్లు పడగొట్టాడు.

చేజింగ్ ను ప్రారంభించిన బెంగళూరు.. ప్రేక్షకులకు థ్రిల్లర్ మూవీని చూపించింది.. ఓపెనర్లు డూ ప్లేసిస్, విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. 3.1 ఓవర్లలోనే బెంగళూరు స్కోరును 50 పరుగులు దాటించారు. ఈ మ్యాచ్ లో లిటిల్ వేసిన రెండో ఓవర్లో బెంగళూరు కెప్టెన్ మూడు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టి 20 పరుగులు సాధించాడు. మోహిత్ వేసిన నాలుగో ఓవర్లో ఏకంగా 18 పరుగులు పిండుకున్నాడు. దూకుడుగా ఆడిన బెంగళూరు కెప్టెన్ కేవలం 18 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. అతడికి తగ్గట్టుగానే విరాట్ కోహ్లీ కూడా ఆడటంతో 5.4 ఓవర్లలోనే బెంగళూరు 92 రన్స్ చేసింది.. త్వరలోనే విజయ లాంఛనం పూర్తవుతుందని భావిస్తున్న నేపథ్యంలో.. ఒక్కసారిగా బెంగళూరు సీన్ మారిపోయింది. కీలక ఆటగాళ్లు వెంట వెంటనే అవుట్ అయ్యారు. 25 పరుగుల వ్యవధిలోనే బెంగళూరు ఆరు వికెట్ల కోల్పోయింది.. లక్ష్యం చిన్నది కాబట్టి బెంగళూరు ఊపిరి పీల్చుకుంది. లేకుంటే కథ వేరే విధంగా ఉండేది. చివర్లో వచ్చిన స్వప్నిల్ సింగ్ 15, దినేష్ కార్తీక్ 21 పరుగులు చేయడంతో బెంగళూరు విజయాన్ని అందుకుంది.

ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ దారుణమైన ఆట తీరు ప్రదర్శించింది. గిల్, వృద్ధి మాన్ సాహా, సాయి సుదర్శన్ వంటి వారు వెంట వెంటనే అవుట్ అయ్యారు. ఫలితంగా పవర్ ప్లే లో మూడు వికెట్లు కోల్పోయిన గుజరాత్ కేవలం 23 పరుగులు మాత్రమే చేసింది. గుజరాత్ జట్టు ఐపిఎల్ చరిత్రలో ఇదే అత్యంత తక్కువ పవర్ ప్లే స్కోర్. ఈ క్రమంలో షారుక్ ఖాన్, డేవిడ్ మిల్లర్ (30) గుజరాత్ ఇన్నింగ్స్ భారాన్ని భుజాన మోశారు. నాలుగో వికెట్ కు వీరిద్దరూ 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ అలా ఆడకుంటే గుజరాత్ స్కోర్ మరింత దారుణంగా ఉండేది. మిల్లర్, షారుక్ ఖాన్ జోడిని కర్ణ్ శర్మ విడగొట్టాడు.. శారూఖ్ ఖాన్ ను అద్భుతమైన త్రో తో విరాట్ కోహ్లీ అవుట్ చేశాడు. అప్పటికే 5 వికెట్లు కోల్పోవడంతో.. రాహుల్ తేవాటియ 35, రషీద్ ఖాన్ 18 గట్టిగా ఆడటంతో గుజరాత్ ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular