RCB Sale 2026: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు. ఇల్లు చక్కబెట్టుకునే విధానం దీపం వెలుగుతున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇదే సూత్రాన్ని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాతృ సంస్థ యునైటెడ్ స్పిరిట్స్ అమలు చేసింది. అమలు చేయడం మాత్రమే కాదు అద్భుతమైన డీల్ కుదుర్చుకొని.. వేల కోట్లు వెనకేసుకుంది.
ఐపీఎల్ చరిత్రలో అత్యంత విలువైన జట్లుగా చెన్నై, ముంబై పేరుపొందాయి. గత ఏడాది మాత్రమే ఒక ట్రోఫీ సాధించిన బెంగళూరు జట్టు విలువ కూడా వాటికి మించి ఉంది ఇప్పుడు. ఎందుకంటే బెంగళూరుకు బలమైన అభిమానుల మద్దతు ఉంది. సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ ఉంది.. దీనికి తోడు బెంగళూరు జట్టు ప్రతి ఏడాది ఐపీఎల్ ఆడే విధానంలో కొత్త ఒరవడిని సృష్టిస్తుంది. దీనికి తోడు కన్నడ ప్రజల భాషాభిమానం బెంగళూరు జట్టుకు విశేషమైన పేరును తీసుకొచ్చాయి. ప్రతి ఏడాది ఐపీఎల్ ప్రారంభంలో అన్ బాక్స్ పేరుతో బెంగళూరు యాజమాన్యం ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. అంతే కాదు పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ఇందులో ప్లేయర్లను కూడా భాగస్వామ్యం చేస్తుంది. తద్వారా క్రికెట్ అంటే కాసుల క్రీడ మాత్రమే కాదని.. అంతకుమించిన వినోదం.. సామాజిక బాధ్యత అని ప్రజలకు తెలిసేలా చేస్తుంది ఆర్సీబీ మేనేజ్మెంట్.
ఆర్ సి బి మేనేజ్మెంట్ తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల జట్టు విలువ పెరిగిపోయింది. గత ఏడాది ఐపీఎల్ ట్రోఫీ అందుకున్న నేపథ్యంలో బెంగళూరు జట్టు విలువ అమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే బెంగళూరు జట్టు మాతృ సంస్థ యునైటెడ్ స్పిరిట్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ను విక్రయించింది. కొద్దిరోజులుగా విక్రయానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి నాటికి ఇవి ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం బెంగుళూరు జట్టును ఆదిత్య బిర్లా గ్రూప్ ఆధ్వర్యంలోని కన్సర్షియం కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ కన్సర్షియంలో బిర్లా గ్రూప్.. అమెరికా కంపెనీలు డేవిడ్ బ్లిట్జర్, బ్లాక్ స్టోన్, టైమ్స్ ఆఫ్ ఇండియా భాగస్వాములుగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం డీల్ విలువ 1.78 బిలియన్ డాలర్లు అని సమాచారం. ఇండియన్ కరెన్సీ లో ఇది 16, 706 కోట్ల వరకు ఉంటుంది.
యునైటెడ్ స్పిరిట్స్ పూర్తిగా మద్యం వ్యాపారంలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు బెంగళూరు విలువ పెరిగిపోయిన నేపథ్యంలోనే అమ్మాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. యునైటెడ్ స్పిరిట్స్ కంపెనీ మనదేశంలో ప్రీమియం బీర్లను తయారు చేస్తూ ఉంటుంది. ఇతర దేశాలకు కూడా వాటిని ఎగుమతి చేస్తూ ఉంటుంది. పూర్తిగా మద్యం వ్యాపారం లో మాత్రమే ఉండాలని నిర్ణయించిన నేపథ్యంలో బెంగళూరు జట్టును యునైటెడ్ స్పిరిట్స్ కంపెనీ అమ్మినట్టు తెలుస్తోంది. అయితే ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా ఓ పత్రిక యాజమాన్యం ఒక జట్టు కొనుగోలులో భాగస్వామిగా ఉండడం ఇది రెండవసారి. గతంలో దక్కన్ చార్జర్స్ ను డెక్కన్ క్రానికల్ యాజమాన్యం కొనుగోలు చేసింది. ఆ తర్వాత దక్కన్ చార్జర్స్ కాస్త సన్ రైజర్స్ హైదరాబాద్ గా మారిపోయింది.
