Praful Hinge Vs Vaibhav Suryavanshi: ప్రఫుల్ హింజ్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇతని గురించే చర్చ. మీడియా నుంచి మొదలు పెడితే సోషల్ మీడియా వరకు ఇతడి గురించే కథనాలు.. హైదరాబాద్ జట్టు 30 లక్షలకు కొనుగోలు చేసిందని.. విదర్భ జట్టుకు ఆడాడని.. 13 సంవత్సరాల వయసు నుంచే క్రికెట్ అంటే ఇష్టాన్ని పెంచుకొని అందులో ప్రవేశించాడని.. తండ్రి వద్దన్నప్పటికీ క్రికెట్లోనే తన భవిష్యత్తును వెతుకున్నాడని.. ఇలా రకరకాల కథనాలు కనిపిస్తున్నాయి.. వినిపిస్తున్నాయి.
ప్రఫుల్ హింజ్ ను ఓవర్ నైట్ లో హీరోను చేసిన ఘటన మాత్రం ఒకటే ఒకటి. అదే రాజస్థాన్ రాయల్స్ జట్టులో ప్రమాదకరమైన ఆటగాడు వైభవ్ సూర్య వంశీ ని ఔట్ చేయడం.. వాస్తవానికి ఇది ఎవరూ ఊహించలేదు. ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు 216 పరుగులు చేసింది. బౌలింగ్ లోపం వల్ల.. ఆ లక్ష్యాన్ని కాపాడుకుంటుందా.. అనే అనుమానం అందరిలోనూ కలిగింది. అయితే ఆ అనుమానాన్ని పటాపంచలు చేశాడు ప్రఫుల్ హింజ్. తను వేసిన తొలి ఓవర్ రెండో బంతికే వైభవ్ సూర్య వంశీ ని ఔట్ చేశాడు. నాలుగో బంతికి జురెల్ ను ఆరవ బంతికి ప్రిటోరియస్ ను వెనక్కి పంపించాడు.
దీంతో ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపం మొత్తం మారిపోయింది. రాజస్థాన్ జట్టు మీద ఒత్తిడి పెరిగిపోయింది. ఈ ఒత్తిడిని ప్రఫుల్ క్రమంగా కొనసాగించాడు. పిచ్ నుంచి లభిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. బంతి మీద నియంత్రణ కోల్పోకుండా చూసుకున్నాడు. అందువల్లే రాజస్థాన్ జట్టును లక్ష్యానికి దరిదాపుల్లో కూడా లేకుండా చేశాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రఫుల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. “ప్రతి ఆటగాడు ఇలాంటి రోజు కోసం ఎదురు చూస్తుంటాడు. ఈరోజు అది నేను చేయగలిగాను. వైభవ్ సూర్య వంశీ ఇటీవల ఆటను గమనించాను. ముందుగా అతడికి కళ్లెం వేయాలని భావించాను. అతనితో నాకు ఎటువంటి తగాదా (నవ్వుతూ) లేదు.. వాస్తవానికి ఈ మ్యాచ్ లో నాకు అవకాశం వస్తుందని అనుకోలేదు. మ్యాచ్ కంటే ముందు ఒకరోజు మేనేజ్మెంట్ నుంచి కాల్ వచ్చింది. సిద్ధంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. నేను పూర్తిగా సిద్ధమయ్యాను. నా ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి రెడీ చేసుకున్నాను.. వరుణ్ (అరోన్) భాయ్ తో నాతో చాలా రోజులుగా ఉన్నాడు.. నా బౌలింగ్ మెరుగుదల అతడి వల్ల సాధ్యమైంది. నేను అతడికి పూర్తి క్రెడిట్ ఇస్తాను. ఇది నాకు అద్భుతంగా అనిపించింది. ఇలాంటి ప్రదర్శన చేయడం నాకు ఎప్పటికీ గొప్పగా ఉండిపోతుందని” ప్రఫుల్ హింజ్ పేర్కొన్నాడు.
వైభవ్ సూర్య వంశీ ని ఔట్ చేయాలని ముందుగానే అనుకున్నట్టు ప్రొఫైల్ పేర్కొన్నాడు.. దీనికోసం ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించినట్టు అతడు వెల్లడించాడు.. అందువల్లే లో లెవెల్ బౌన్సర్ వేసినట్టు పేర్కొన్నాడు. ఆ బంతిని అంచనా వేయలేక గట్టిగా కొట్టడానికి సూర్యవంశీ ప్రయత్నించాడు. అది కాస్త బ్యాట్ చివరి అంచుకు తగిలి గాల్లో లేచింది. ఫలితంగా వెనకాల ఉన్న కీపర్ ఆ బంతిని అద్భుతంగా అందుకున్నాడు. వైభవ్ ను ఔట్ చేసిన తర్వాత రాజస్థాన్ జట్టు డిఫెన్స్ లో పడిపోయింది. ఇదే ఊపులో ప్రఫుల్ కట్టుదిట్టంగా బంతులు వేశాడు. ఒకే ఓవర్ లో మూడు వికెట్లు పడగొట్టి రాజస్థాన్ జట్టుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. అంతేకాదు, ఇలాంటి ప్రదర్శన చేయాలని అతడు ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. ప్రత్యేకంగా రాసుకున్నాడు కూడా. చివరికి దానిని ఆచరణలో పెట్టాడు.
