ఐపీఎల్ 14వ ఎడిషన్లో మరికొద్ది గంటల్లో ఎనిమిదో మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఇద్దరి కింగ్స్ మధ్య ఈ మ్యాచ్ జరగబోతోంది. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్.. కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వహిస్తున్న పంజాబ్ కింగ్స్ ఢీకొనబోతున్నాయి. వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే తొలి మ్యాచ్లో ఢిల్లీ కేపిటల్స్పై ధోనీ సేన ఓటమి పాలవ్వగా.. ఈరోజు సెకండ్ మ్యాచ్ ఆడబోతోంది. ఈ మ్యాచ్లో ధోనీ డకౌట్ కావడం కూడా అభిమానులు కలవరపరిచింది.
ఇక పంజాబ్ కింగ్స్ జట్టు ఆట ఇందుకు భిన్నంగా ఉంది. ఆడిన ఫస్ట్ మ్యాచ్లోనే భారీ స్కోరు దంచింది. 221 పరుగులు చేసి.. ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని విధించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్, క్రిస్గేల్, దీపక్ హుడా కూడా రెచ్చిపోయి ఆడారు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఇదే హైయ్యస్ట్ స్కోరు కూడా. 220 ప్లస్ స్కోరుతో ఇప్పుడు ఆ జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. బ్యాటింగ్ లైనప్ కూడా ఫుల్ ఫామ్లో ఉంది. ఇక అదే ఊపు చెన్నైనైనా కొనసాగిస్తే ఇక ఆ జట్టుకు మరోసారి తిరుగుండదు. మరోసారి భారీ స్కోర్ నమోదు కావడం ఖాయమే.
మరోవైపు.. చెన్నై జట్టులో ఇద్దరు కీలక ప్లేయర్లు జట్టుకు దూరం అయ్యారు. లుంగి ఎంగిడి, జేసన్ బెహ్రెన్డార్ప్ ఈ మ్యాచ్లో ఆడట్లేదు. ఎప్పట్లాగే డు ఫ్లెసిస్రుతురాజ్ గైక్వాడ్తో ఇన్నింగ్స్ను ఆరంభించే అవకాశాలు ఉన్నాయి. తొలి మ్యాచ్లో వారిద్దరూ విఫలమయ్యారు. డుప్లెసిస్ సుదీర్ఘకాలంగా జట్టు బ్యాటింగ్ లైనప్లో పిన్పాయింట్గా ఉంటున్నాడు. తొలి మ్యాచ్లో నిరాశ పరిచాడు కూడా. కానీ.. టోర్నీ సాగుతున్న కొలదీ అతడు రాటుదేలుతుంటాడు. గైక్వాడ్ తొలి మ్యాచ్లో తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేదు. అయినప్పటికీ- మేనేజ్మెంట్ అతనిపై విశ్వాసంతో ఉంది. గైక్వాడ్ వద్దనుకుంటే రాబిన్ ఉతప్పను ఓపెనర్గా పంపించే అవకాశం ఉంది.
జట్టు మిడిలార్డ్లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. తొలి మ్యాచ్లో తన సత్తా చాటిన రైనా.. ఈ మ్యాచ్లోనూ అదే స్థాయిలో ఆడుతాడో లేడో చూడాలి. అంబటి రాయుడిని కూడా తక్కువ అంచనా వేయలేం. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే అతడి తాకిడిని తట్టుకోవడం కష్టం. ఇక కెప్టెన్ ధోనీ కూడా ఫామ్లోకి వస్తే ఆయనను ఆపడం కూడా ఎవరితో కాదు. ఫస్ట్ మ్యాచ్లో డకౌట్ అయిన ధోనీ.. ఈ మ్యాచ్లో ఎలా ఆడుతాడనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది.