Vindhya Vishaka: ఐపీఎల్.. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్. డబ్బుకు డబ్బు.. ఆటకు ఆట.. అందానికి అందం.. అందుకే ఐపీఎల్ అంటే చాలామంది చెవి కోసుకుంటారు. గతంలో చీర్ లీడర్స్ ఉండేవారు. వారిని పక్కన పెట్టి అంతకుమించి అనేలాగా సరికొత్త ఆకర్షణలను ఈ ఆటకు అద్దారు నిర్వాహకులు. అందులో భాగమే ప్రాంతీయ భాషల్లో కామెంట్రీ.
ఎంతో పేరు పొందిన ఐపీఎల్ లో తెలుగులో కామెంట్రీ చేస్తూ.. వ్యాఖ్యాతగా ఆ వ్యవహరిస్తూ అదరగొడుతోంది వింధ్య విశాఖ.. ఈ పదహారణాల అమ్మాయి తన మాటతీరుతో.. ఆటకు సరికొత్త అందాన్ని తీసుకొస్తున్నది. సాధారణంగా ఐపీఎల్ లో మహిళా యాంకర్స్ ను చూసేందుకు అభిమానులు ఇష్టపడుతుంటారు. అలా తన యాంకరింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నది వింధ్య.
సాధారణంగా మనకు తెలుగు యాంకర్లు అంటే అనసూయ, రష్మీ, సుమ గుర్తుకొస్తారు. కానీ వారందరికీ వింధ్య కచ్చితంగా పోటీ ఇస్తుందనడం లో ఎటువంటి సందేహం లేదు. వాస్తవానికి స్పోర్ట్స్ యాంకర్ అంటే చాలామందికి మాయాతి లంగర్ గుర్తుకువస్తుంది. కానీ ఆమెకు పోటీ ఇచ్చే అందం వింధ్యదనడంలో ఎటువంటి సందేహం లేదు. వింధ్య తెలుగులో చాలావరకు టీవీ షోలకు యాంకరింగ్ చేసింది. అయినప్పటికీ ఆమెకు అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. ఎప్పుడైతే ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిందో.. అప్పుడే ఆమె జాతకం మారిపోయింది. ఐపీఎల్ తర్వాత ప్రో కబడ్డీ వంటి స్పోర్ట్స్ ఈవెంట్లకు కూడా వింధ్య యాంకర్ గా వ్యవహరిస్తోంది.
వింధ్య 1992 ఏప్రిల్ 18న సికింద్రాబాద్లో జన్మించింది. వింధ్య తల్లి పేరు మమతా చక్రవర్తి, తండ్రి పేరు సత్తిరెడ్డి. వింధ్య తల్లి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. టెలివిజన్ వ్యాఖ్యాతగా, స్పోర్ట్స్ ప్రజెంటర్ గా, వీడియో జాకీగా, స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు తెలుగులో యాంకరింగ్ చేసిన మహిళగా వింధ్య పేరు పొందింది. వింధ్య తెలుగు చాలా బాగుంటుంది. స్పష్టంగా మాట్లాడుతుంది. అందుకే ఆమెంటే చాలామంది ఇష్టపడుతుంటారు. అందాల బుట్ట బొమ్మగా.. అధునాతన డ్రెస్సులలో పట్టుకొమ్మగా వింధ్య పేరు పొందింది.
వింధ్య విద్యాభ్యాసం సికింద్రాబాద్లోని మారేడ్ పల్లిలో కస్తూర్బా గాంధీ మహిళా డిగ్రీ, పీజీ కాలేజీలో కొనసాగింది. ఆమె ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లీషులో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసింది. మోడలింగ్ మీద ఆసక్తి ఉండడంతో 2013లో బిగ్ బజార్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిస్ కవర్ గర్ల్ హైదరాబాద్, కళామందిర్ నిర్వహించిన ఫ్యాషన్ వీక్ లో వాక్ ది ర్యాంప్ విభాగంలో రన్నరప్ గా నిలిచింది. ఇక అదే ఏడాది నవంబర్లో హెచ్ఎంటీవీ లో వ్యాఖ్యాతగా కెరియర్ మొదలు పెట్టింది. 2013లో స్టార్ మా చానల్లో వీడియో జాకీగా చేరింది. చాయ్ బిస్కెట్ ప్రోగ్రాం కు వ్యాఖ్యతగా వ్యవహరించింది. 2014లో జీ తెలుగులో ప్రసారమైన ఫ్యామిలీ సర్కస్ అనే కామెడీ షోకు ప్రజెంటర్ గా పని చేసింది. 2016 నుంచి 2017 వరకు ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన హంగామా అనే కామెడీ షో కు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. టీవీ9 లో హాట్ వీల్స్, ఈటీవీ -2 లో సఖి, మాటీవీ లో మా ఊరి వంట అనే కార్యక్రమాలకు ప్రజెంటర్ గా పనిచేసింది. 2017లో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో జాయిన్ అయింది. స్పోర్ట్స్ ప్రజెంటర్ గా కెరియర్ మొదలుపెట్టింది. ప్రో కబడ్డీ లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఐసీసీ ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. గతంలో మాటీవీలో సినిమా అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులు, సంతోషం సిని అవార్డులు, జీ కుటుంబం అవార్డులు, జీ సినీ అవార్డుల వంటి వేడుకలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది.