India Vs Bangladesh
India Vs Bangladesh: టి20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ -8 లో భారత్ కీలక మ్యాచ్ ఆడనుంది. శనివారం బంగ్లాదేశ్ జట్టుతో తలపడనుంది. గ్రూప్ – ఏ లో కొనసాగుతున్న భారత జట్టు.. సూపర్ -8 తొలి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఓడించింది. ఈ క్రమంలో రెండవ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడేందుకు భారత్ సిద్ధమవుతోంది.
కరేబియన్ గడ్డపై జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత జట్టు ఫేవరెట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. బార్బడోస్ వేదికగా ఇటీవల ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ ఓడిపోయింది. భారత జట్టుతో జరిగే మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని బంగ్లాదేశ్ తాపత్రయపడుతోంది . వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టును ఎలాగైనా కట్టడి చేయాలని భావిస్తోంది. ఒక వేళ ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధిస్తే సెమీ ఫైనల్ వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.
వెస్టిండీస్ లోనే అంటిగ్వా వేదికగా భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇంతకుముందు ఈ మైదానంపై సౌత్ ఆఫ్రికా – అమెరికా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా భారీ స్కోరు సాధించింది. ఇక ఇదే మైదానంపై శుక్రవారం ఆస్ట్రేలియా – బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మధ్యలో వర్షం కొంతమేర ఇబ్బంది పెట్టింది.. వాస్తవానికి ఈ మైదానం ముందుగా బ్యాటర్లకు సహకరిస్తుంది. ఆ తర్వాత క్రమేపీ మారుతుంది. అందువల్ల టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.
ఆంటిగ్వా వేదికగా జరిగే ఈ మ్యాచ్ అక్కడి కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు మొదలవుతుంది. ఆ సమయంలో 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటుందట. 18 నుంచి 24 శాతం వరకు వర్షం కురిసేందుకు ఆస్కారం ఉంటుందట. దాని వల్ల మ్యాచ్ కు స్వల్ప అంతరాయం ఏర్పడుతుందట. అంతే గాని మ్యాచ్ రద్దయ్యేందుకు అవకాశం లేదట. ఇదే మైదానం పై ఆస్ట్రేలియా – బంగ్లా దేశ్ తలపడ్డాయి. వర్షం అంతరాయం కలిగించడంతో డక్ వర్త్ లూయిస్ విధానం ప్రకారం ఆస్ట్రేలియాను విజేతగా ప్రకటించారు. ఇక ఈ మ్యాచ్ లో భారత్ గెలిచేందుకు 88 శాతం, బంగ్లాదేశ్ విజయం సాధించేందుకు 12 శాతం అవకాశం ఉంది.
జట్ల అంచనా ఇలా
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), పంత్( కీపర్), విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, సిరాజ్.
బంగ్లాదేశ్
శాంటో(కెప్టెన్), రెహ్మాన్, షకీబ్, హుస్సేన్, హృదయ్, లిటన్ దాస్( వికెట్ కీపర్), హసన్, అహ్మద్, రిశాద్ హుస్సేన్, మహ్మదుల్లా, మహేది హసన్.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
View Author's Full InfoWeb Title: India will face bangladesh in super 8 as part of t20 world cup