India Vs South Africa Final: టి20 వరల్డ్ కప్ లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా సరి కొత్త రికార్డు సృష్టించింది. మిగతా జట్లకు అందనంత ఎత్తులో నిలిచింది. వెస్టిండీస్ లోని బార్బడోస్ మైదానం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసి 176 పరుగులు చేసింది.. టి20 వరల్డ్ కప్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్లో టీమిండియా చేసిన స్కోరే ఇప్పటివరకు హైయెస్ట్ గా ఉంది.. స్పిన్ కు సహకరిస్తున్న మైదానంపై.. భారత జట్టు ఈ స్థాయి స్కోరు సాధించడం నిజంగా ఒక రికార్డే. 34 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ.. 176 పరుగుల స్కోర్ సాధించింది.
ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.. కెప్టెన్ రోహిత్ శర్మ 9, సూర్య కుమార్ యాదవ్ 3, రిషబ్ పంత్ 0 పరుగులకే ఔట్ అయ్యారు.. పీకల్లోతు కష్టాల్లో పడిన టీమ్ ఇండియాను విరాట్ కోహ్లీ ఆదుకున్నాడు.. 59 బంతుల్లో 76 పరుగులు చేశాడు. తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. అక్షర్ పటేల్ తో కలిసి 72, శివం దూబే తో 57 పరుగుల భాగస్వామ్యాలను నెలకొల్పాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా ఏడు వికెట్లు నష్టానికి 176 పరుగులు చేసింది.
టీమ్ ఇండియా చేసిన 176 పరుగులు టి20 వరల్డ్ కప్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్లో హైయెస్ట్ స్కోర్ గా నమోదయింది. టీమ్ ఇండియా కంటే ముందు 2021లో దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా రెండు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.. ఇప్పటివరకు ఇదే హైయెస్ట్ స్కోర్ గా ఉంది. ఇదే దుబాయ్ వేదికగా 2021లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా పై న్యూజిలాండ్ నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. 2016లో కోల్ కతా వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ పై వెస్టిండీస్ ఆరు వికెట్ల నష్టానికి 161 రన్స్ చేసింది. 2007లో జోహాన్నస్ బర్గ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ పై భారత్ 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.