Delhi Vs Gujarat IPL: ఒకసారి జరిగితే దురదృష్టం అంటారు. రెండోసారి జరిగితే రాత బాగా లేదంటారు. మూడోసారి జరిగితే స్థితి బాగా లేదంటారు. కానీ మళ్ళీ జరిగితే దానిని దరిద్రం అంటారు. ఈ దరిద్రాన్ని ఢిల్లీ జట్టు నెత్తి మీద మోస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే విజయానికి దగ్గరగా ఉన్న ఆ జట్టు.. చివర్లో ఒత్తిడికి గురై.. ఒక్క పరుగు తేడాతో ఓడిపోవడం ఆ జట్టుకు పరిపాటిగా మారింది.
ఐపీఎల్ లో ఢిల్లీ జట్టుకు మంచి చరిత్ర ఉంది. ఇంతవరకు ఒకసారి కూడా ట్రోఫీ అందుకోలేక పోయినప్పటికీ.. ఆ జట్టు చేసే ప్రదర్శన ప్రతి ఏడాది అభిమానులకు కొత్తగానే కనిపిస్తుంది. ఈసారి కూడా వరుసగా రెండు విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో టాప్ స్థానంలో కొనసాగుతోంది. ఈసారి ఢిల్లీ జట్టులో ప్లేయర్లు కూడా సమర్థవంతంగా ఉన్నారు. బౌలింగ్.. బ్యాటింగ్ ఇలా అన్ని విభాగాలలో సత్తా చూపిస్తున్నారు. బలమైన ముంబై జట్టును ఓడించి తన సత్తా చూపించిన ఢిల్లీ.. గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో మాత్రం ఒత్తిడికి గురైంది.. చివరికి ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది.
ఐపీఎల్ లో ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ జట్టు ఓడిపోవడం ఇదే తొలిసారి కాదు. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ జట్టుకు మొత్తంగా నాలుగుసార్లు ఒక్క పరుగు తేడాతో ఓడిపోయిన చరిత్ర ఉంది. 2015లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఢిల్లీ జట్టు ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. 2016లో గుజరాత్ లయన్స్ జట్టు చేతిలో ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ పరాజయాన్ని మూట కట్టుకోవాల్సి వచ్చింది. 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఢిల్లీ జట్టు ఓటమి పాలైంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న సీజన్లో గుజరాత్ చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది.
బుధవారం నాటి మ్యాచ్లో గుజరాత్ గెలిచింది అనే దానికంటే.. ఢిల్లీ చేజేతులారా ఓడిపోయింది అని అనడం కరెక్ట్. వాస్తవానికి అక్కడ పరుగు తీసే అవకాశం ఉన్నప్పటికీ మిల్లర్ ఒప్పుకోలేదు. మిల్లర్ నిర్లక్ష్యం వల్ల ఢిల్లీ జట్టు ఓడిపోవలసి వచ్చింది. ఒకవేళ అతడి గనుక ఆ పరుగు తీసి ఉంటే మ్యాచ్ పరిస్థితి మరో విధంగా ఉండేది. చివరి బంతికి ఒక బై రూపంలో పరుగు వచ్చినా సరే.. ఢిల్లీ జట్టు విజయం సాధించేది. 211 పరుగుల లక్ష్యాన్ని చేదించడంలో మొదటి నుంచి దూకుడును ప్రదర్శించిన ఢిల్లీ.. మధ్యలో చేతులెత్తేసింది. చివర్లో పోరాడింది. కానీ విజయాన్ని అందుకోలేక ఒక్క పరుగు తేడాతో తలవంచింది..