T20 World cup India Vs pakistan : ఏ దేశాలు క్రికెట్ ఆడినా.. అది ఒక ఆట మాత్రమే. కానీ.. భారత్-పాక్ ఆడితే మాత్రం అదొక యుద్ధం. ఈ రెండు దేశాల మధ్య ఉన్న వైరం.. ఆటలోనూ ప్రతిబింబిస్తుంది. అయితే.. కేవలం ఈ రెండు దేశాల అభిమానులు మాత్రమే ఇలా భావిస్తారనుకుంటే పొరపాటే. ప్రపంచ క్రికెట్ మొత్తం కూడా ఇదేవిధంగా చూస్తుంది. అందుకే.. ఏ మ్యాచ్ కూ రానంత రేటింగ్.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు వస్తుంది. ఇప్పుడు టీ-20 వరల్డ్ కప్ విషయంలోనూ ఇదే జరగబోతోంది. ఈ మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు కావడమే ఇందుకు నిదర్శనం.
భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న రాజకీయ వైరుధ్యం కారణంగా.. ఈ రెండు దేశాలూ క్రికెట్ ఆడట్లేదు. ద్వైపాక్షిక సిరీస్ లు ఎప్పుడో నిలిచిపోయాయి. కేవలం ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే ఈ రెండు జట్లూ తలపడుతున్నాయి. చివరి సారిగా ఈ రెండు దేశాలూ 2019 వన్డే వరల్డ్ కప్ లో పోటీపడ్డాయి. మాంచెస్టర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత జట్టు జయభేరి మోగించింది. 89 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.
ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్లకు మరోసారి ఈ రెండు జట్లు పోటీ పడుతున్నాయి. అక్టోబర్ 24వ తేదీన దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్-పాకిస్తాన్ తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల క్రీడాభిమానులే కాకుండా.. ప్రపంచ క్రికెట్కూడా ఎంతగా ఎదురు చూస్తోందో తేలిపోయింది. ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లను అక్టోబర్ 4వ తేదీన ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టింది ఐసీసీ. ఈ మ్యాచ్ టికెట్లు మొత్తం కేవలం గంటల లోపే హాట్ కేకుల్లా అమ్ముడైపోవడం గమనార్హం.
ఇక, టికెట్ల వ్యవహారం ఇలా ఉంటే.. యాడ్స్ పరిస్థితి మరోలా ఉంది. అన్ని మ్యాచులదీ ఒక లెక్క. భారత్-పాక్ మ్యాచ్ ది మాత్రం మరో లెక్క అన్నట్టుగా తయారైంది. వరల్డ్ కప్ ను ప్రముఖ బ్రాడ్ కాస్టింగ్ సంస్థ స్టార్ స్పోర్ట్స్ ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ లో 10 సెకన్ల నిడివి కలిగిన ప్రకటనకు 15 నుంచి 18 లక్షల వరకు వసూలు చేయనున్నట్టు సమాచారం.
అయితే.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు మాత్రం ఈ రేట్ రెట్టింపు అయ్యింది. 10 సెకన్ల యాడ్ కు ఏకంగా 25 లక్షల నుంచి 30 లక్షల వరకు చెల్లించాలని ధర నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే.. ఇంత రేటు నిర్ణయించినా.. కంపెనీలు ఏ మాత్రం వెనకడుగు వేయట్లేదట. ఎంతైనా చెల్లించేందుకు సిద్ధమవుతున్నాయని టాక్. భారత్ – పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కు ఎంత క్రేజ్ ఉందో ఈ విషయమే తెలియజేస్తోంది. హోరా హోరీగా సాగే ఈ మ్యాచ్ ద్వారా ఎవరికి వారు తమ ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు చూస్తున్నారు. మరి, ఈ మ్యాచ్ ను ఆన్ లైన్ ద్వారా ఎన్ని కోట్ల మంది వీక్షిస్తారో చూడాలి.