Homeఆధ్యాత్మికంRakhi Purnima 2024: రాఖీ కట్టడానికి శుభసమయం ఒకే.. మరి విప్పడానికి? ఎన్ని రోజులకు విప్పాలి?

Rakhi Purnima 2024: రాఖీ కట్టడానికి శుభసమయం ఒకే.. మరి విప్పడానికి? ఎన్ని రోజులకు విప్పాలి?

Rakhi Purnima 2024: రాఖీ పండుగను అక్క తమ్ముళ్లు అన్నా చెల్లెల్ల అనుబంధానికి ప్రతీక. సోదరికి జీవితాంతం తోడుగా ఉంటానని సోదరుడు భరోసా కల్పించడమే ఈ పండుగ ఉద్దేశం. పురాణాలు, చరిత్రలో కూడా ఈ పండుగకి చాలా ప్రాముఖ్యత ఉంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. రాఖీ పండుగ, రక్షా బంధన్, రాఖీ పౌర్ణమి ఏ పేరుతో పిలిచిన పండుగ, పండుగ ఉద్దేశం మాత్రం ఒకటే.. సోదరీసోదరుల మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ పండుగ. ఇక ఈ ఏడాది ఆగస్టు 19, సోమవారం నాడు రాఖీ పండుగ వచ్చిన విషయం తెలిసిందే.

ఎక్కడెక్కడో ఉన్న అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ కట్టడానికి ఒక ఇంటికి, ఊరికి, పట్నానికి చేరుతున్నారు. మొత్తం మీద వీలు ఉన్నట్టు కలిసి రాఖీలు కట్టుకుంటున్నారు. తమ సోదరులు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నారు. తమ క్షేమం కోసం రక్ష కట్టిన అక్కాచెల్లెళ్లకు కృతజ్ఞత తెలియజేస్తూ, అన్నదమ్ములు వారికి చేతనైనంతలో బహుమతులు కూడా అందజేస్తున్నారు. మరి ఈ రాఖీ ఎప్పుడు కట్టాలి. కట్టిన రాఖీ ఎప్పుడు విప్పాలి అనే వివరాలు కూడా తెలుసుకుందాం.

అయితే ఈ సంవత్సరం అంటే 2024వ సంవత్సరం రాఖీ పండుగ ఆగస్టు 19, సోమవారం రోజున వచ్చింది. ఆరోజు పౌర్ణమి తెల్లవారుఝామున గం. 3.06ని.లకు ప్రారంభమై, రాత్రి 11.56 ని.లకు ముగుస్తుంది అంటున్నారు పండితులు. రక్షబంధనానికి అనుబంధంగా ఎప్పుడూ భద్రకాలం ఉంటుంది. కానీ ఈ సమయం శుభసమయం కాదు. అంటే ఈ సమయంలో రాఖీ కట్టకూడదు అంటారు పండితులు. భద్రకాలం ముగిశాకే రాఖీ కట్టాలి. ఇక ఈ ఏడాది భద్రకాలం సోమవారం మధ్యాహ్నం 1.30 గం.ల వరకు ఉంటోందట. అంటే ఆ తర్వాతనే రాఖీ కట్టాలి అన్నమాట.

రాఖీ ఎప్పుడు విప్పాలి?
రాఖీ కట్టించుకున్న తర్వాత చాలా మంది అబ్బాయిలు దాన్ని రెండు, మూడు రోజులు ఉంచుకుంటారు. అందంగా ఉన్న రాఖీలు కొన్ని ఎక్కువ రోజులు కూడా ఉంటాయి. ఆ తర్వాత ఎక్కడో ఒక దగ్గర పడేస్తుంటారు. కానీ ఇలా చేయవద్దు అంటున్నారు పండితులు. రాఖీ కట్టించుకోవడానికి శుభ ముహూర్తం ఏ విధంగా ఉంటుందో..అదే విధంగా రక్షను విప్పడానికి కూడా శుభముహుర్తం ఉంటుంది అంటున్నారు పండితులు. రాఖీ విప్పడం గురించి జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకుంటే టెన్షన్ ఉండదు. అయితే రాఖీ కట్టించుకున్న తర్వాత 1, 2 రోజులకే రాఖీని తీయకూడదట. రాఖీని కనీసం 21 రోజులు చేతికి ఉంచుకోవాలి.కుదరకపోతే కనీసం శ్రీకృష్ణ జన్మాష్టమి (26 ఆగస్టు) వరకు అయినా ఉంచుకోవాలి అంటున్నారు పండితులు.

ఈ విప్పిన రాఖీని తీసిన తర్వాత దానిని ఎక్కడ పడేయకుండా ఎర్రటి వస్త్రంలో చుట్టి ఏదైనా పవిత్ర స్థలంలో, మీ సోదరికి సంబంధించిన వస్తువులతో ఉంచాలి అంటున్నారు పండితులు. మళ్లీ వచ్చే రాఖీ పండగ వరకు దాన్ని భద్రపరచాలి. ఆ తర్వాత ఆ రాఖీని ప్రవహిస్తున్న నీటిలో వదిలి వేయాలట.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular