Moola Nakshatra Rasi: హిందూ శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన సమయాన్ని బట్టి వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో కొందరు పండితులు చెబుతూ ఉంటారు. అలాగే వారు జన్మించిన సమయం లేదా నక్షత్రాన్ని బట్టి వారి జీవితంలో ఎటువంటి సమస్యలు ఉంటాయని అంటూ ఉంటారు. అయితే వీటిలో కొన్ని నిజాలు ఉన్నాయని.. మరికొన్ని నిజం కావని మరికొందరు పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా మూల నక్షత్ర విషయంలో కొందరు చెబుతున్న విషయాలు ఆవాస్తవమని ప్రముఖ పండితులు చెబుతున్నారు. ఈ నక్షత్ర సమయంలో పుట్టిన పిల్లలను దానం ఇవ్వాలని కొందరు అంటూ ఉంటారు. అలా ఇవ్వాల్సిన అవసరం లేదని.. ఒక వ్యక్తి జీవితం గురించి కేవలం నక్షత్రం మాత్రమే కాకుండా అతడు లేదా ఆమె జన్మించిన గ్రహాలు, మిగతా విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని అంటున్నారు. అసలు మూల నక్షత్రం అంటే ఏమిటి? దీనిపై ఉన్న అపోహలు ఏంటి?
అపోహలు:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మొత్తం 27 నక్షత్రాలు ఉంటాయి. వీటిలో మూల నక్షత్రం ఒకటి. ఇది ధనస్సు రాశిలో ఉంటుంది. మూలా నక్షత్రానికి కేతువు అధిపతి. మూల అంటే వేరు శాఖ లేదా మూలం అని అర్థం. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. దీనిపై చాలామందిలో అపోహలు ఉన్నాయి. ఈ నక్షత్రంలో పుట్టిన పిల్లలు దురదృష్టాన్ని తీసుకువస్తారని భావిస్తారు. అలాగే వీరిని మేనమామ లేదా బంధువులకు, ఆలయాలకు దానం ఇచ్చి మళ్లీ తీసుకోవాలని అంటారు. మూల నక్షత్రంలో పుట్టిన పిల్లలు కుటుంబ సభ్యులకు అపశృతి తెస్తారని భావిస్తారు. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి శుభకార్యాలు చేయకూడదని అంటుంటారు.. వీరికి జీవితాంతం కష్టాలే ఉంటాయని అంటారు.
వాస్తవాలు:
అయితే ప్రముఖ పండితులు చెబుతున్న ప్రకారం ఒక వ్యక్తి జీవితం కేవలం నక్షత్రాలను బట్టి నిర్ణయించరాదని.. అతని లగ్నాత్తు ఉన్న గ్రహ స్థితిని పరిశీలించి దశలు, అంతర్దశల్ని లెక్క కట్టి అన్ని రకాలుగా వారి జీవితంపై నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. మూల నక్షత్రంలో పుట్టిన పిల్లలు పుట్టుకతోనే అశుభం కాదు. వీరి జీవితంలో కేతు ఆధిపత్యంలో ఉంటాడు. కానీ వారి జీవితాన్ని మార్చుకొని అవకాశం ఉంటుంది. ఏ పురాణాల్లోనూ, జ్యోతిష్య గ్రంథాల్లోనూ శిశువును దానం ఇవ్వాలని చెప్పబడలేదు. ఈ నక్షత్రంలో పుట్టిన పిల్లల వారి ఆరోగ్యాన్ని బట్టి వారి జీవితం ఉంటుంది. వీరు జన్మించడం వల్ల ఇతరులకు ఎలాంటి నష్టం ఉండదు. ఎందుకంటే ఎవరి జాతకం ప్రకారం వారి జీవితం కొనసాగుతుంది. పంచాంగంలో తిధి, వారము, లగ్దాన్ని బట్టి శుభకార్యాలను నిర్వహిస్తారు. కేవలం మూల నక్షత్రంలో పుట్టిన వారితో శుభకార్యాలు నిర్వహించొద్దని అనుకోకూడదు.
అయితే మూలనక్షత్రంలో పుట్టిన వారు ధైర్యంగా ఉండగలుగుతారు. ఏ పని అయినా తొందరగా పూర్తి చేయాలని అనుకుంటారు. సత్యాన్ని వెంటనే పలుకుతారు. కష్టాల నుంచి బయట పడాలని అనుకుంటూ ఉంటారు. పూర్వకాలంలో అనారోగ్య కారణాలవల్ల ఎక్కువగా శిష్యులు మరణించేవారు. అలాగే వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల ఇలాంటి ప్రచారాలు కొనసాగాయి. అందువల్ల కేవలం నక్షత్రంలో పుట్టిన వ్యక్తిని నిందించడం కాకుండా అతని ఆరోగ్య పరిస్థితులపై శ్రద్ధ తీసుకోవాలి.