Homeజాతీయ వార్తలురైళ్ళు వస్తున్నాయ్.. జాగ్రత్త!

రైళ్ళు వస్తున్నాయ్.. జాగ్రత్త!

కరోనా లాక్‌ డౌన్‌3.0 లో అనేక కార్యక్రమాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ క్రమంలోనే 15 ఏసీ రైళ్ళకు, కొన్ని ప్రత్యేక రైళ్ళకు రైల్వేశాఖకు అనుమతులు లభించాయి. ఈరోజు మొదటిసారిగా ప్రయాణికుల రైలు సికింద్రాబాద్‌ కు రానుంది. రాత్రి 8:30 గంటలకు కేఎస్ఆర్ బెంగళూరు స్టేషన్‌ లో బయలుదేరిన బెంగళూరు ఢిల్లీ (రాజధాని) ఏసీ సూపర్ ఫాస్ట్ రైలు ఈ రోజు సికింద్రాబాద్ చేరుకోనుంది. అనంతరం బయలుదేరి రేపు తెల్లవారుజామున ఢిల్లీ చేరుకుంటుంది. కాగా, లాక్‌ డౌన్ కారణంగా బెంగళూరులో చిక్కుకుపోయిన దాదాపు 200 మంది తెలంగాణవాసులు ఈ రైలులో సికింద్రాబాద్ చేరుకోనున్నారు. అలాగే, తెలంగాణలో చిక్కుకుపోయిన దాదాపు 300 మంది ప్రయాణికులు ఢిల్లీ వైపుగా ప్రయాణించనున్నారు. మరోపక్క, ఢిల్లీలో నిన్న రాత్రి 9:15 గంటలకు బయలుదేరిన మరో రైలు నేటి సాయంత్రం సికింద్రాబాద్ చేరుకోనున్నట్టు అధికారులు తెలిపారు.

ఈ విధంగా వివిధ రాష్ర్టాల నుంచి వస్తున్న వలస కార్మికుల్లో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉంటున్న కారణంగా.. వారి పట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని, వైరస్‌ వ్యాప్తిని కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లాక్‌ డౌన్‌ సడలింపుల నేపథ్యంలో రాష్ట్రంలోకి పెద్దఎత్తున వలస కార్మికులు, ఇతరులు వస్తున్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్టు మంత్రి తెలిపారు. మొదట విదేశాల నుంచి వచ్చినవారివల్ల, తర్వాత మర్కజ్‌ తో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా జరిగిందని, ఇప్పుడు వలసకార్మికుల వల్ల ఆ ప్రమాదం ఉన్నదన్నారు. ఇతర ప్రాంతాలనుంచి తెలంగాణకు వస్తున్న వారందరినీ ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారం క్వారంటైన్‌ లో ఉంచుతున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు వివిధ మార్గాల్లో 41,805 మంది రాష్ర్టానికి వచ్చారన్నారు. సడలింపులతో ఎక్కువ మంది బయటకు వస్తున్న నేపథ్యంలో ప్రజలు మాస్కులు ధరించడంతోపాటు భౌతికదూరం పాటించాలని సూచించారు.

తెలంగాణకు ఇతర రాష్ర్టాల నుంచి వలస వస్తున్నవారితో కరోనా విస్తరిస్తున్నట్టు తెలుస్తున్నది. గత ఆరు రోజుల్లో ఇతర ప్రాంతాలనుంచి వచ్చిన వారిలో 35 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గ్రామీణ ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తిపట్ల భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో ప్రభుత్వం వలసలు వస్తున్నవారిపై ప్రత్యేకదృష్టి సారించింది. ఎవరిలోనైనా అనుమానిత లక్షణాలుంటే వెంటనే వారిని వైరస్‌ నిర్ధారణ కోసం దవాఖానకు తరలిస్తున్నారు. గత ఐదు రోజుల్లో ఆయా జిల్లాలనుంచి 66,959 మంది బయటకు వెళ్లగా, 41,805 మంది ప్రవేశించినట్టు ప్రత్యేక బృందాలు గుర్తించాయి.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular