Homeజాతీయ వార్తలుMunugodu By-Poll: మునుగోడు.. గంటర్నర నుంచి ఏం జరుగుతోంది.? ఫలితాలపై ‘అనుమానాలు’!?

Munugodu By-Poll: మునుగోడు.. గంటర్నర నుంచి ఏం జరుగుతోంది.? ఫలితాలపై ‘అనుమానాలు’!?

Munugodu By-Poll: మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడిపై బీజేపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఎప్పటికప్పుడు ఫలితాలను వెల్లడించకుండా, టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ప్రజాతీర్పును మార్చే కుట్ర జరుగుతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల సంఘం తీరుపై బీజేపీ సీరియస్‌ అయ్యింది.

– అప్‌డేట్‌ చేయడంలో జాప్యం..
ఎన్నికల ఫలితాలను ఎన్నికల అధికారులు ప్రతీ రౌండ్‌కు అప్‌డేట్‌ చేయాలి. ఏ ఉప ఎన్నికల అయినా ఇదే జరుగుతుంది. కానీ మునుగోడు కౌంటింగ్‌లో రౌండ్‌ రౌండ్‌కూ అప్‌డేట్‌ జరుగడం లేదు. ఎన్నికల సంఘం వెబ్‌సైటలోనూ రిజల్ట్స్‌ పెట్టడం లేదు. ఈ తీరు అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫోన్‌ చేసి, ఫలితాల వెల్లడిలో అనుమానాలకు తావిచ్చేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్‌రెడ్డి మండిపాటు తర్వాత పది నిమిషాల్లో ఎన్నికల సంఘం నాలుగు రౌండ్ల ఫలితాలను అప్‌డేట్‌ చేయడం గమనార్హం.

-ఈసీ తీరుపై మండిపడ్డ ‘బండి’
రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌కు మెజార్టీ వచ్చిన రౌండ్ల సమాచారం మాత్రం ఎన్నికల సంఘం ఇస్తోందన్నారు. బీజేపీకి లీడ్‌ వస్తే, దాన్ని మాత్రం ప్రకటించకుండా అలసత్వం ప్రదర్శిస్తోందని బండి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిష్పక్షపాతంగా ఫలితాలను ఎప్పటికప్పుడు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు.

బీజేపీపై టీఆర్‌ఎస్‌ ఎదురు దాడి..
ఎన్నికల పరిశీలకుల వల్లే కౌంటింగ్‌ ప్రక్రియ ఆలస్యమవుతోందని బీజేపీపై ఎదురు దాడి చేస్తోంది టీఆర్‌ఎస్‌. ఎన్నికల అధికారుల ఒత్తిడి వారిపై ఎక్కువగా ఉందని అన్నారు. బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కలిసి..ఇబ్బందులకు గురి చేస్తున్నారని మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల అధికారులు నిబంధనలను పాటించడం లేదని, పోలింగ్‌ సమయంలో అలానే చేశారు. ఇప్పుడు కౌంటింగ్‌లో కూడా అలాగే వ్యవహరిస్తున్నారన్నారు.

-ధర్మమే గెలుస్తుందన్న బీజేపీ అభ్యర్థి
మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎన్నికల సిబ్బంది మధ్య సమన్వయం లోపిస్తోందని తెలిపారు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి. నాలుగో రౌండ్‌ ఫలితం తర్వాత బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్‌ ఆలస్యానికి కారణాలు వెల్లడించారు. నాలుగో రౌండ్‌ పూర్తయ్యాక కౌంటింగ్‌ కాస్త ఆలస్యమవుతోందన్నారు. అనుభవం లేక సిబ్బంది కొంత ఇబ్బంది ఎదురవుతోందని తెలిపారు.

-ఫలితాల డిలేపై ఎస్‌ఈసీ స్పందన..
కౌంటింగ్‌ గందరగోళంపై సీఈవో వికాస్‌ రాజ్‌ స్పందించారు. కౌంటింగ్‌లో ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల ప్రతీ రౌండ్‌కు అరగంట సమయం పడుతుందని వెల్లడించారు. ఆర్‌వో అప్రూవ్‌ చేసిన తర్వాతే ఫలితాలను ఈసీ వెబ్‌సైట్లలో అప్‌డేట్‌ చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతీ టేబుల్‌ దగ్గర ఏజెంట్లు ఉంటారు.. పారదర్శకంగానే కౌంటింగ్‌ జరుగుతోందని తెలిపారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular