Homeఆంధ్రప్రదేశ్‌JanaSena Chief Pawan Kalyan : నవ నాయకత్వమే... తెలంగాణకు మార్గం!

JanaSena Chief Pawan Kalyan : నవ నాయకత్వమే… తెలంగాణకు మార్గం!

* సామాజిక మార్పు కచ్చితంగా అవసరం
* వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీలో ఉంటాం
* ఎవరితో.. ఎలా అన్నది కాలం చెబుతుంది
* మీడియా సమావేశంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  

JanaSena Chief Pawan Kalyan : ‘నాకు ఆంధ్ర జన్మనిస్తే, పునర్జన్మనిచ్చించి తెలంగాణ. అదే బాధ్యతతో తెలంగాణలో రాజకీయాలు చేస్తా. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా తెలంగాణలో జనసేన పార్టీ పోటీలో ఉంటుంది. ఎన్ని స్థానాలు.. ఎక్కడ.. ఎవరితో.. ఎలా ముందుకు వెళ్ళబోయేది పూర్తి స్థాయి ప్రణాళిక తో వచ్చే రోజుల్లో సమాధానం చెబుతామ’ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సైదులు అనే జనసైనికుడి కుటుంబానికి చౌటుప్పల్ మండలం లక్కారంలో శుక్రవారం పార్టీ తరఫున రూ. 5 లక్షల ప్రమాద బీమా చెక్కును శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందజేశారు. అనంతరం అక్కడే మీడియా సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “తమ్ముడు సినిమా సమయంలో నాకు జరిగిన ఒక సంఘటన నన్ను చాలా ప్రభావితం చేసింది. సినిమా హిట్ అయ్యిందని.. ఫంక్షన్ చేద్దామని యూనిట్ సభ్యులు అంటే, అలా కాకుండా ఆ డబ్బుతో నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ తో బాధ పడుతున్న ఒక గ్రామాన్ని దత్తత తీసుకుందామని నేను ప్రతిపాదించాను. అయితే దీనికి మా సినిమా యూనిట్ ఒప్పుకున్నా, అక్కడి స్థానిక నాయకులు కొందరు ఒప్పుకోలేదు. ఇక్కడే నాలో అంతర్మథనం మొదలైంది. ప్రజలకు మేలు చేయాలంటే కచ్చితంగా రాజకీయ అండ అవసరం అని కృతనిశ్చయానికి వచ్చాను. అదే నన్ను రాజకీయాల వైపు నడిపించింది. దాని కోసమే 2007 నుంచి రాజకీయాల్లో ఉంటూ, తర్వాత తెలంగాణ గడ్డ పైనే పార్టీ ప్రస్థానం మొదలు పెట్టాను.

* ఓడిపోయాను కనుకే బాధ్యత తెలుసు
నేను ఓడినా బాధ్యతతో కూడిన రాజకీయాలు చేసే వ్యక్తిని. ఓడిపోయాను కాబట్టి మరింత అనుభవం, బాధ్యత వచ్చాయి. ఇక నుంచి జనసేన నాయకులు తెలంగాణ సమస్యలు తెలుసుకుంటారు. ప్రతి నియోజకవర్గంలో తిరుగుతారు. నేను సైతం ప్రతి నెలలో వీలును బట్టి తెలంగాణ ప్రాంతంలో తిరిగేందుకు ప్రత్యేక సమయం కేటాయిస్తాను. హైదరాబాద్ లో ప్రత్యేక కార్యాలయం తీసుకుని అక్కడ తెలంగాణ అంశాలపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటాం. పార్టీ నిర్మాణం చాలా క్లిష్టతరమైన బాధ్యత. ఆంధ్ర లో సైతం నాలుగేళ్లు తిరిగి, అక్కడి పరిస్థితి.. సమస్యల పరిశీలన చేసిన తర్వాతే పార్టీ నిర్మాణం చేపట్టాం. తెలంగాణ మీద ఇక ప్రత్యేక ద్రుష్టి ఉంటుంది. 25 ఏళ్ళు భవిష్యత్ అనే మాట నేను ఊరికే అనను. అన్నీ గమనించిన తర్వాత, అన్నీ విషయాలు అర్ధం చేసుకున్న తర్వాత మాత్రమే రాజకీయ అడుగులు వేస్తాం. పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడాలి అన్నదే లక్ష్యం.

* ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత రాజకీయంగా, రాష్ట్ర భవిష్యత్ పరంగా తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ బలంగా అడుగులు వేస్తున్నాయి. ఈ మూడు పార్టీల మధ్య జనసేన రాజకీయ ప్రయాణం ఎలా అనేది, ఒక ప్రణాళికతో కార్యాచరణ రూపొందిస్తాం. అందరూ కూర్చుని మాట్లాడుకుని దీనిపై ముందుకు వెళ్తాం. కచ్చితంగా తెలంగాణాలో సామాజిక మార్పు రావాలి. అన్నీ వర్గాలకు, అధికారం రాని వారికీ న్యాయం జరగాలి. బీసీ, గిరిజన, ఇతర వర్గాలకు న్యాయం జరగాలి. వారసత్వ రాజకీయాలు కంటే కొత్త నాయకత్వం తీసుకురావాలనేది జనసేన అభిమతం. విద్యార్థులు, యువత తెలంగాణ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయి. మళ్ళీ నవ నాయకత్వానికి వారే అడుగులు వేయాలి. దానికి కట్టుబడి రాజకీయాలు చేస్తాం. తెలంగాణ ప్రాంతంలో ఒక మార్పు తెచ్చే దిశగా మా ప్రయాణం ఉంటుంది.

* మా బలం తెలుసు
తెలంగాణలో బలమైన అభిమాన బలం మాకు ఉంది. తెలంగాణలో పూర్తిస్థాయిలో రాజకీయ బలం ఉందని చెప్పడం లేదు కానీ కచ్చితంగా కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావితం చేసే స్థాయిలో మాకు ఓటు బలం ఉంది. దానిని మంచి నాయకత్వం ఎన్నుకునేందుకు ఉపయోగిస్తాం. తెలంగాణలోనూ పార్టీ పూర్తి స్థాయి కమిటీలు ఉంటాయి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ లో కచ్చితంగా 20 శాతం స్థానాల్లో పోటీ చేయాలి అనేది నా భావన. దీనిపై మా నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి ఎక్కడెక్కడ పోటీ చేయాలి అనేది నిర్ణయిస్తాం. వచ్చే ఎన్నికల్లో పరిమిత స్థాయిలో పోటీలో ఉంటాం అని మాత్రం కచ్చితంగా చెప్పగలను. ఎవరితో కలిసి ముందుకు వెళ్ళాలి అనేది కూడా చర్చల్లో ఉంది. అది పూర్తిస్థాయిలో అవగాహనకు త్వరలోనే వస్తుంది” అని స్పష్టం చేశారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular