Pawan Kalyan- YCP: ఏపీలో వైసీపీ శ్రేణులను చూస్తే జాలేస్తోంది. అసలు వారు ఆ పార్టీ అధినేత జగన్ ను లెక్కచేయడం లేదు. ఆయన్ను స్మరించుకోవడం మానేశారు. నిత్యం తన నామస్మరణే చేసుకోవాలన్న ఆయన ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా వైసీపీ శ్రేణుల యవ్వారం ఇదే విధంగా ఉంది. తెల్లారి లేచింది మొదలు పడుకునే వరకూ ఇప్పుడు వారు పవన్ నామస్మరణే చేస్తున్నారు తప్ప జగన్ ను గుర్తించుకోవడం లేదు. చివరకు మంత్రుల దీ అదే పరిస్థితి. పేటీఎం బ్యాచ్ గురించి అయితే చెప్పనక్లర్లేదు. తమ అధినేతకు, మంత్రులకు, నేతలకు ఉన్న వేలాది వాహనాలు కంటే వారాహి వాహనమే వారికి గుర్తొచ్చినట్టుంది. దాని కలర్ పై రకరకాల పోస్టులు పెడుతున్నారు. ట్రోల్ చేస్తున్నారు. ఇలా పెట్టి పెట్టి వారాహి వాహనాన్ని ఇండియన్ పొలిటికల్ సర్కిల్ లోనే ఒక హిస్టరికల్ ప్లేస్ లో పెట్టేశారు. ఎంతో మంది నాయకులు ఎన్నో ప్రచార రథాలు, వాహనాలు వినియోగించారు. కానీ పవన్ ప్రచార రథానికి మాత్రం కనీవినీ ఎరుగని రీతిలో ఉచిత ప్రచారం కల్పించింది మాత్రం వైసీపీ శ్రేణులే.

పవన్ తన ఆలోచనలు, తన అభిరుచులకు తగ్గట్టు వాహనాన్ని రూపొందించుకున్నారు. తయారు చేసే బాధ్యతలు తీసుకుంది సక్సెస్ ఫుల్ యంగ్ ఇండస్ట్రీయలిస్ట్ ఉదయ్. టీటైమ్ వ్యవస్థాపకుడిగా ఉన్న ఈయన ఏరికోరి పవన్ ప్రచార రథం తయారీబాధ్యతలు తీసుకోవడానికి ముందుకొచ్చారు. తయారుచేసింది హైదరాబాద్ లోని పటాన్ చెరువు ప్రాంతంలో. అనుమతులిచ్చింది తెలంగాణ ట్రాన్స్ పోర్టు డిపార్ట్ మెంట్, రిజిస్ట్రేషన్ చేసింది ఆ శాఖే. కానీ పొలి కేకలు మాత్రం ఏపీ నుంచి వినిపించాయి. విష ప్రచారం వైసీపీ నుంచి వినిపించింది. అలాగని అనుమతులు ఆగాయా? రిజిస్ట్రేషన్ ఆగిందా? అక్కడుంది వైసీపీ సర్కారు కాదు. తెలంగాణ ప్రభుత్వం. పవన్ విషయంలో తోక జాడిస్తే అక్కడ మూల్యం తప్పదు. ఇప్పుడున్న కష్టాలకు తోడు పవన్ రూపంలో మరో కష్టాన్ని తెచ్చుకునేందుకు తెలంగాణ సర్కారు సిద్ధపడుతుందా అంటే అదీ లేదు. కానీ ఇవేవీ తెలియకుండా కోటి రూపాయలు విలువైన ప్రచార రథానికి.. పదికోట్ల రూపాయల ప్రచారం కల్పించి తాము అల్పులమని వైసీపీ శ్రేణులు నిరూపించుకున్నారు.
ఇంత జరిగింది కదా.. తాము ఎంత గగ్గోలు పెట్టినా రంగుపై అభ్యంతరాలు లేవు.. రిజిస్ట్రేషన్ సైతం ఆగలేదు కదా అని సైలెంట్ అయ్యారంటే అదీ లేదు. ఇది తెలంగాణ కాదు.. ఏపీ.. ఇక్కడఅధికారంలో ఉంది మేము. అక్కడి పర్మిషన్లు అక్కడే..,ఇక్కడ నిబంధనలు పాటించాల్సిందే.. ఆ వాహనం ఏపీలో ఎలా తిరుగుతుందో చూద్దామంటూ కుర్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్ చేశారు. కిందపడినా మాకే బలం.. మాదే ఆధిపత్యం అన్న పిల్ల చేష్టలు మాదిరిగా మాట్లాడుతున్నారు. ఇంకా ఈ ఎపిసోడ్ ముగిసిపోలేదని హెచ్చరించి పలుచన అయ్యారు. పవన్ ఇంటి బయట ఉంచే ప్రచార రథానికే భయపడినట్టు వ్యవహరిస్తున్నారు.

పవన్ ను పావలా అంటారు.. ప్యాకేజీ నాయకుడంటూ మురిసిపోతారు. అసలు జనసేన ఒక పార్టీయేనా? అని వ్యంగ్యంగా మాట్లాడతారు. అటువంటప్పుడు పవన్ ను ఎందుకు పట్టించుకుంటున్నారన్నది ఏపీ ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఉన్నారు. ఆయన వారసత్వాన్ని అందుకోవాలని చూస్తున్న తనయుడు లోకేష్ ఉన్నారు. వారిని కాదని పవన్ నే ఎందుకు టార్గెట్ చేస్తున్నట్టు? ఈ విషయంలో ఏపీ ప్రజలకు ఒక క్లారిటీ తెప్పించింది వైసీపీ నేతలే. ప్రజల అనుమానాలను నివృత్తి చేసింది వారే. తమ పిల్ల చెష్టలతో పవన్ కు మంచి చేస్తుంది వారే. అయితే జగన్ శ్రేయోభిలాషులైన కొద్దిమందికి మాత్రమే ఈ విషయం తెలుసు. మిగతా వారికి మాత్రం అధికారమనే మదం కప్పేసి ఉంది. ఇప్పటికైనా పవన్ ను వారు వదలకుంటే … జగన్ అనే పేరు మార్చిపోయి.. పవన్ అనే నామస్మరణ, నామధేయం తప్పించి.. వారి నోట మరో మాట వచ్చే చాన్స్ అయితే ఉండే పరిస్థితులు కనిపించడం లేదు.