Why Soil Smells After Rain: ఆకాశం లో దట్టంగా మబ్బులు ఏర్పడిన తర్వాత.. చల్ల గాలులు వీస్తాయి. ఆ గాలుల తీవ్రతకు మేఘాలు కరిగిపోతాయి. మేఘాలలో ఏర్పడిన నీటి బిందువుల ఆధారంగా వర్షాలు కురుస్తుంటాయి. వర్షాలు కురిసినప్పుడు నేల పులకించిపోతుంది. సమస్త ప్రకృతి ఆనంద పరవశంలో తేలియాడుతూ ఉంటుంది.
వర్షం కురిసినప్పుడు మట్టి వాసన అద్భుతంగా ఉంటుంది. ఆ వాసన అలానే పీల్చాలి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అందులో ఎటువంటి కృత్రిమ తత్వం ఉండదు. ఆరోగ్యానికి ఎటువంటి హాని చెయ్యదు. పైగా ఆ వాసన పీల్చుతూ నాసికాలు కూడా ఉత్తేజాన్ని పొందుతూ ఉంటాయి. ఆ అనుభూతిని ఇలా రాయడం కాదు గాని.. అనుభవిస్తేనే అర్థమవుతుంది.
వర్షం కురిసే ముందు లేదా వర్షం పడుతున్న సమయంలో మట్టి సువాసన చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే దీని వెనక ఒక సైన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనిని సైన్స్ పరిభాషలో పెట్ట్రీ చోర్ అని పిలుస్తుంటారు. నేలలో స్ట్రెప్టో మైసిస్ అనే బాక్టీరియా ఉంటుంది. మట్టి ఎండిపోయినప్పుడు కొన్ని రకాల బీజాలను అది విడుదల చేస్తూ ఉంటుంది. వాన చినుకులు పడిన తర్వాత అందులో ఉన్న జియో స్మిన్ అనే రసాయనం గాలిలోకి విడుదలవుతుంది. దీనికి కొన్ని రకాల మొక్కల నూనెలు కలుస్తాయి. మెరుపుల వల్ల ఓజోన్ ఏర్పడుతుంది. ఆ ఓజోన్ గాలిలో కలిసిపోవడం వల్ల ఈ వాసన వస్తుంది.. అందువల్లే తొలకరి చినుకులు పడుతున్నప్పుడు చాలామంది మట్టి వాసనను ఆస్వాదించడానికి తాపత్రయపడుతుంటారు.
నేటి కాలంలో మట్టి వాసనను కేవలం గ్రామీణ ప్రాంతాలలో మాత్రమే పీల్చడానికి అవకాశం ఉంది. నగరాలు, పట్టణ ప్రాంతాలలో దాదాపు కాంక్రీట్ జంగిల్స్ ఏర్పడ్డాయి. మట్టి అనేది కనిపించడం లేదు. దీనివల్ల మట్టి వాసన పీల్చడానికి నగరవాసులకు అవకాశం లేకుండా పోతుంది. ఇది ప్రకృతి అందించే గొప్ప వరం. దీనివల్ల నాసిక గ్రంధులు తేలిక అవుతాయని.. మనసు ఉత్తేజితమవుతుందని. సానుకూల దృక్పథం అల వడుతుందని నిపుణులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఇంకా వ్యవసాయం కొనసాగుతోంది. మట్టి రోడ్లు ఉన్నాయి. అందువల్లే వర్షం పడగానే మట్టి వాసన వస్తోంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగిస్తోంది.

