Village Fine For Abusive Language: గ్రామ స్వరాజ్యం.. ఈ మాటను గాంధీమహాత్ముడు ఊరికే అనలేదు. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని ఆయన నమ్మారు. గ్రామ స్వరాజ్యాన్ని సాధించాలని ఆయన కలలుగన్నారు. నేటికీ ఆయన కన్న కలలు అలాగే ఉండిపోయాయి. కొన్ని గ్రామాలు మాత్రం స్వరాజ్యాన్ని సాధించి.. నిలువెత్తు సాధికారతకు నిదర్శనం గా నిలుస్తున్నాయి.
గ్రామ స్వరాజ్యం అంటే స్వీయ కట్టుబాట్లు.. గొప్పగా జీవించడం.. గొప్పగా ఆలోచించడం.. అభ్యుదయ భావాలతో అభివృద్ధి బాటబట్టడం.. దీనివల్ల పేదరికం ఉండదు. ఆర్థిక తారతమ్యం ఉండదు. అభివృద్ధి ఒక్క సిద్ధాంత ప్రకారం జరిగిపోతూ ఉంటుంది. మనుషుల మధ్య అంతరాల ఉండదు. దీనివల్ల వసుదైక కుటుంబం అనే నానుడి గ్రామాల్లో కొనసాగుతూ ఉంటుంది. ఇటువంటి గ్రామాలు ఉన్నచోట అశాంతికి, అస్పృశ్యతకు, ఇతర సామాజిక దురాచారాలకు అవకాశం ఉండదు. అందువల్లే గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యమని గాంధీ మహాత్ముడు అన్నారు.
మనదేశంలో కొన్ని గ్రామాలలో స్వీయ కట్టుబాట్లు ఉంటాయి. కొన్ని గ్రామాలలో మద్యం తాగరు. కొన్ని గ్రామాలలో వరకట్నం తీసుకోరు. ఇంకా కొన్ని గ్రామాలలో సాంఘిక దురాచారాలను పాటించరు. అయితే చరిత్రలో తొలిసారిగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బోర్సార్ గ్రామ ప్రజలు ఒక వినూత్నమైన తీర్మానాన్ని చేశారు. అది కాస్త దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
బోర్సార్ ప్రజలు చేసిన తీర్మానం ప్రకారం.. ఆ గ్రామంలో ఎవరైనా బూతులు మాట్లాడితే 500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. జరిమానా చెల్లించిన పక్షంలో కమ్యూనిటీ సర్వీస్ చేయాలి. బూతులు మాట్లాడుకోవడం వల్ల గ్రామములో అశాంతి ఏర్పడిందని.. అది కొట్లాటకు దారితీస్తోందని అక్కడి సర్పంచ్ చెబుతున్నారు. అందువల్లే గ్రామస్తుల తో సమావేశం ఏర్పాటుచేసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు.
సాధారణంగా బూతు మాట్లాడటం వల్ల ఎదుటి వ్యక్తిలో భావోద్వేగాలు పెరుగుతున్నాయని.. ఆ కోపంలో ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని సర్పంచ్ చెబుతున్నారు. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఈ నిర్ణయం వల్ల గ్రామస్తులు శాంతి బాటలో నడుస్తున్నారని.. ఎదుటివారిని దూషించాలంటే భయపడుతున్నారని సర్పంచ్ చెబుతున్నారు. ఈ నిర్ణయం సత్ఫలితాలను ఇస్తోందని సర్పంచ్ వివరిస్తున్నారు.
ఈ గ్రామంలో 6000 మంది జనాభా ఉన్నారు. గ్రామంలో బూతులను నివారించడానికి ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు. గ్రామస్తులు చైతన్యం తీసుకురావడానికి గ్రామం మొత్తం పోస్టర్లు ఏర్పాటు చేశారు. పోస్టర్లు ఏర్పాటు చేసిన నేపథ్యంలో గ్రామంలో ప్రజల్లో చైతన్యం పెరిగింది. అంతేకాదు వారు బూతులు మాట్లాడేందుకు వెనకాడుతున్నారు. పోస్టర్లు వేయడం వల్ల గ్రామస్తులు మాట్లాడే విధానాన్ని మార్చుకున్నారని అక్కడి సర్పంచ్ అంతర్ సింగ్ చెబుతున్నారు. బూతులు మాట్లాడుకోకపోవడం వల్ల గొడవలు తగ్గిపోయాయని .. మనుషుల్లో స్నేహభావం కనిపిస్తోందని అంతర్ సింగ్ పేర్కొన్నారు.
