Expensive Water Bottle
Expensive Water Bottle: నీరు ప్రకృతి ప్రసాదించిన వరం. జీవ రాశి మనుగడకు నీరు చాలా ముఖ్యం. అందుకే శాస్త్రవేత్తలు ఇతర గ్రహాలపై మానవుడు జీవించేందుకు నీటి జాడను వెతుకుతున్నారు. ఇక ఒకప్పుడు భూమిపై నదుల నీటినే తాగేవారు. అందుకే నాగరికత నదీ తీర ప్రాంతాల్లో వెలిసింది. పెరుగుతున్న జనాభాతో నీటి వనరులు తగ్గుతున్నాయి. దీంతో ఉచితంగా, విరివిగా దొరికే నీరు కూడా ఇప్పుడు ఖరీదవుతోంది. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కూడా ఈ విషయాన్ని చెప్పారు. నీటి కోసం యుద్ధాలు జరుగుతాయని, నీటిని కొనుగోలు చేయాల్సి వస్తుందని తెలిపారు. చెప్పినట్లుగానే ప్రపంచంలో నీటి కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. నీటిని కొనుక్కుని తాగాల్సిన పరిస్థితులూ వచ్చాయి. అందుబాటులో ఉన్న మంచినీటిని వదిలేసి మినరల్ వాటర్ కావాలంటూ దానివెంట పడ్డారు. తాగేది మంచినీరో తెలియదు.. మినరల్ వాటరో తెలియదు. కానీ రోజూ బాటిల్ల కొద్దీ తాగేస్తున్నాం.
తాగేవారిని బట్టి నీటికి విలువ..
నీటి విలువ రోజూ పెరుగుతోంది. తాగేవారినిబట్టి మారుతోంది. పేద, మద్య తరగతి ప్రజలు రూపాయి నుంచి రూ.50 వరకు లీటర్ నీటిని తాగుతున్నారు. ఇక మనకు బయట మార్కెట్లో దొరికే వివిధ కంపెనీల లీటర్ వాటర్ ధర రూ.20 నుంచి రూ.50 వరకు ఉంది. ఈ ధర కూడా ప్రాంతాన్ని బట్టి మారుతుంది. బస్ స్టేషన్, రైల్వేస్టేషన్, థియేటర్స్, మెట్రో స్టేషన్లు.. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో ధర పలుకుతుంది. అయితే మంచినీళ్ల సీసా ఖరీదు రూ.లక్షల్లో ఉంటే కొంటారా? మంచినీళ్ల సీసా విలువ అంత ఉందా అని ఆశ్చర్యపోవద్దు. 750 ఎంఎల్ మంచినీళ్ల సీసా అక్షరాలా రూ.50 లక్షలుగా ఉంది.
నీటికి కాదు.. సీసాకే విలువ..
అయితే 750 ఎంఎల్ నీళ్ల సీసాలో నీటి విలువకన్నా.. ఆ సీసా విలువే ఎక్కువ. అక్వాడి క్రిస్టల్లో ట్రిబ్యూటో ఎ మొడిగ్లియాని అనే మంచినీళ్ల సీసా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్గా గుర్తింపు పొందింది. ఇది గాజు సీసా. 24 క్యారట్ల బంగారాన్ని పోతపోసి చేశారు. ఈ సీసాకు మ్యాజిక్ టచ్ ఉంటుంది. దీన్ని ప్రముఖ డిజైనర్ ఫెర్నాండో అల్టామిరానో అందించింది. ఈ సీసాలోని ప్రతీ నీటి చుక్కలో 5 గ్రాముల 23 క్యారెట్ల బంగారం ఉంటుంది. అంతకంటే ముందు… ఆ నీళ్లను ఐస్లాండ్, ఫిజీ, ఫ్రాన్స్లోని హిమనీనదాల(గ్లేసియర్స్) నుంచి సేకరించి– శుద్ధి చేస్తారు. కాలుష్యరహితమైన ఆ నీళ్లలో ఆల్కలీన్ శాతం, మినరల్స్ అధికంగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట.
బెవర్లీ హిల్స్ 90 హెచ్ 2ఓ.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మంచి నీళ్ల బ్రాండ్ గా పేరుంది బెవర్లీ హిల్స్ 90 హెచ్ 2ఓకి. ఎందుకంటే ఖనిజాలు అధికంగా ఉండే ఈ నీళ్లను క్యాలిఫోర్నియాలోని పర్వతాల్లో సహజంగా ఏర్పడిన నీటి బుగ్గల నుంచి సేకరిస్తారు. కాలుష్యం, మలినాలు లేని ఈ నీళ్లలో ఎలక్ట్రోలైట్ లు ఎక్కువగా ఉండటం వల్ల– తాగిన వెంటనే తక్షణ శక్తి లభిస్తుందట. ఇంకా మరెన్నో సుగుణాలున్న ఈ నీళ్లను నింపిన గాజు సీసా మూతలకు వజ్రాలను పొదుగుతారు. వాడిన వజ్రాలను బట్టి ధర మారుతుంది.
స్టేడియంకు తెచ్చిన నీతా అంబానీ..
అంబానీ కుటుంబం ఈ ఏడాది చాలాసార్లు వార్తల్లో నిలిచింది. కేవలం వ్యాపార విజయాలే కాకుండా జూలై 12న తన చిన్నకుమారుడు అనంత్ అంబానీ వివాహనం, అంతకుముందు రెండుసార్లు ప్రీవెడ్డింగ్ వేడుకలు నిర్వహించారు. ఇందుకు సుమారు రూ.5 వేల కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అంబానీ కుటుంబం ఈ దుబారాను వేడుకలకే కాదు. ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీకి జీవితంలో మంచి విషయాల పట్ల మక్కువ ఎక్కువ. ఇటీవల, ఆమె ఓ ఫొటో వైరల్ అయ్యింది. దీనిలో ఆమె బాటిల్ నుంచి నీటిని సిప్ చేస్తూ కనిపించింది. ఇది కేవలం ఏదైనా యాదృచ్ఛిక నీటి బాటిల్ కాదు. ఇది ’ఆక్వా డి క్రిస్టల్లో ట్రిబ్యూటో ఎ మొడిగ్లియాని’ అని చెప్పబడింది, ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బాటిల్ వాటర్.
గిన్నిస్ వరల్డ్ రికార్డు..
ఇదిలా ఉంటే.. ‘ఆక్వా డి క్రిస్టల్లో ట్రిబ్యూటో ఎ మొడిగ్లియాని’ను 2010లోనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. దాని అసమానమైన లగ్జరీ హోదాను హైలైట్ చేసింది. ఈ ప్రత్యేకమైన నీటిని ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్లు ఇష్టపడుతున్నారు.