Missing Tiger Mystery: క్రూరమైన చూపు. బలమైన అడుగులు.. విశాలమైన దేహం. పటిష్టమైన పంజా దెబ్బ.. ఒక్క ఉదుటున మాటు వేస్తే ఎంతటి జంతువైనా సరే చావాల్సిందే. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ పులి గురించి వర్ణన ఒక పట్టాన ముగిసిపోదు.
అటువంటి భయంకరమైన పులి ఇప్పుడు కనిపించడం లేదు. మహారాష్ట్రలోని తాడోబ అడవి నుంచి వందల కిలోమీటర్ల దూరం అది ప్రయాణించింది. తెలంగాణ గడ్డమీద అడుగుపెట్టింది. ఇక్కడ అనేక ప్రాంతాలు తిరుగుతూ చివరికి యాదగిరిగుట్ట వరకు వచ్చింది. అటువంటి భయంకరమైన పులి ఇప్పుడు కనిపించడం లేదు. అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలలో అది కొద్ది రోజులు కనిపించింది. ఆ తర్వాత కనిపించడం మానివేసింది. దీంతో అటవీశాఖ అధికారులలో ఆందోళన నెలకొంది.
యాదగిరిగుట్ట నుంచి అటవీ ప్రాంతాల్లోకి వెళ్లిన పులి.. ఆ తర్వాత జగిత్యాల మీదుగా నిజామాబాద్ ప్రాంతంలోకి ప్రవేశించింది. ఇక అక్కడి నుంచి ఆ పులి కనిపించడం లేదు. ఎక్కడెక్కడ వెతికినా సరే దాని జాడ తెలియడం లేదు. ట్రాకింగ్ చేయడంలో అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యం వహించారా.. పులి వేటగాళ్ల ఉచ్చులకు చిక్కి చనిపోయిందా.. అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించాల్సి ఉంది. సాధారణంగా వేసవి కాలంలో పులులు ఆహార అన్వేషణ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉంటాయి. మహారాష్ట్ర నుంచి పులులు తెలంగాణకు రావడం సర్వ సాధారణం. వర్షాలు కురిసిన తర్వాత మళ్లీ ఆ పులులు మహారాష్ట్ర వెళ్ళిపోతుంటాయి. ఇది నిత్యం జరిగే ప్రక్రియనే. కానీ ఆ పులి అక్కడి నుంచి వచ్చి.. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందనేది అర్థం కావడం లేదు.
మహారాష్ట్రలో ఇటీవల ఒక పులి ఆడ తోడు కోసం తెలంగాణ దాకా వచ్చింది. ఇక్కడ సరైన జోడు లభించకపోవడంతో.. వెర్రి లేచినట్టు తిరిగింది. ఇష్టానుసారంగా ఇతర జంతువులను చంపి తినేసింది. ఒక రకంగా మహారాష్ట్రకు సరిహద్దుల్లో ఉన్న తెలంగాణ జిల్లాల్లో భయాన్ని కలగజేసింది. చివరికి ఆ పులి ఆడ తోడు దొరకడంతో శాంతించింది. అయితే తడోబా ఫారెస్ట్ నుంచి వచ్చిన ఈ పులి మాత్రం అలాంటి దారుణాల కైతే పాల్పడలేదు. అలాగని ఇతర జంతువులను చంపి తినకుండా ఉండలేదు. అయితే ఉన్నట్టుండి ఈ పులి ఎక్కడికి వెళ్లిందనేది ఇప్పుడు అంతు పట్టడం లేదు.