America: ఉన్నత చదువులు చదువుకునేందుకు అమెరికా వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థినులను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదుకు చెందిన ఓ యువతి, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువతి ఇద్దరూ కలిసి ఇక్కడ చదువులు పూర్తయిన తర్వాత అమెరికా వెళ్లారు. న్యూ జెర్సీ ప్రాంతంలో ఉన్నత చదువులు చదువుతున్నారు. ఈ క్రమంలో వారు సరుకులు కొనుగోలు చేసేందుకు స్థానికంగా ఉన్న ఒక మార్కెట్ కు వెళ్లారు. అక్కడ వారికి సంబంధించిన సరుకులు కొనుగోలు చేసిన తర్వాత బిల్లు చెల్లించకుండా అలానే పట్టుకుని వస్తున్నారు. దీంతో ఆ షాప్ ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సంఘటనా స్థలానికి వచ్చారు. ఆ ఇద్దరు యువతులను అరెస్టు చేశారు.
న్యూ జెర్సీలోని హోబో కైన్ షాప్ రైట్ పేరుతో ఒక సూపర్ మార్కెట్ ఉంది. అక్కడ ఇండియన్ వస్తువులు, కూరగాయలు, పండ్లు, ఇతర సామగ్రి లభిస్తాయి. న్యూ జెర్సీ ప్రాంతంలో స్థిరపడిన ఇండియన్స్ మొత్తం ఈ షాప్ లోనే వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలో హైదరాబాద్, గుంటూరు ప్రాంతానికి చెందిన యువతులు కూడా ఇక్కడే వస్తువులు కొనుగోలు చేశారు. అయితే వారు తాము కొనుగోలు చేసిన వస్తువులకు డబ్బులు చెల్లించలేదు. అలానే వస్తువులు పట్టుకెళ్తుండడంతో షాపు ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు సంఘటనా స్థలానికి వచ్చి ఆ యువతులను అరెస్టు చేశారు. “తెలియక చేసాం క్షమించండి. ఆ సరుకులకు రెట్టింపు డబ్బు ఇస్తాం మమ్మల్ని వదిలిపెట్టండి. ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు చేయం. మమ్మల్ని క్షమించండి” అంటూ ఆ యువతలు వేడుకున్నప్పటికీ పోలీసులు క్షమించలేదు. పైగా అమెరికన్ చట్టాల గురించి వారికి వివరించారు. కచ్చితంగా జైలుకు వెళ్లాల్సిందేనని.. శిక్ష అనుభవించాల్సిందనని చెబుతూ వారిని అరెస్టు చేసి, తమ వెంట తీసుకెళ్లారు.
స్థానికంగా ఈ సంఘటన ఏప్రిల్ 17న జరిగింది.. గురువారం వెలుగులోకి వచ్చింది. ఆ యువతులు అరెస్టు కావడంతో ఇక్కడ ఉన్న వారి బంధువులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే వారు తెలియక సరుకులతో బయటకు వచ్చారా? యాదృచ్ఛికంగా జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది. పోలీసుల విచారణలో అసలు విషయాలు వెలుగు చూస్తాయని తెలుస్తోంది. మరోవైపు కోర్టు ఎదుట పశ్చాత్తాపం వ్యక్తం చేస్తే జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లభిస్తుందని ప్రవాస భారతీయులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆ ఇద్దరు యువతులు న్యూ జెర్సీ లో ఏ యూనివర్సిటీలో చదువుతున్నారో మాత్రం తెలియ రాలేదు.