Singapore
Singapore: కీటకాలు, పురుగులను చూడగానే మనకు కడుపులో దేవినట్లు అనిపిస్తుంది. కొందరికి అయితే భయం కూడా ఉంటుంది. వాటిని చూసి దూరంగా పరిగెత్తుతారు. అయితే చైనా, వియత్నాం, సింగపూర్, కొరియా వంటి దేశాల్లో కీటకాలతోపాటు కొన్ని రకాల జంతువులను ఆహారంగా తీసుకుంటారు. భారత్లోని ఈశాన్య రాష్ట్రాల్లోనూ కొన్ని జాతుల వారు కీటకాలు, పురుగులు, ఇతర జంవుతువులను వండుకుని తింటారు. అయితే తాజాగా సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ 16 రకాల కీటకాలు మానవ హారంగా తీసుకునేందుకు ఆమోదం తెలిపింది. ఇందులో పట్టు పురుగులు, మిడతలు కూడా ఉన్నాయి. తాజా నిర్ణయం అక్కడ సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న హోటల్ రంగానికి ఊతమిచ్చింది.
అధికారిక ప్రకటన..
వివిధ జాతులకు చెందిన కీటకాలు, వాటి సంబంధిత ఉత్పత్తుల దిగుమతిపై ఎలాంటి నియంత్రణ లేదని సింగపూర్ ఆహార నియంత్రణ సంస్థ ప్రకటించింది. ఈ కీటకాలు మానవ ఆహారంగా వినియోగం లేదా జంతువుల ఆహారంగానూ ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. దీంతో అక్కడి హోటళ్ల యాజమాన్యాలు.. చైనా, థాయ్లాండ్, వియత్నాం నుంచి దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.
అడవిలో నుంచి సేకరించొద్దు..
ఇక దిగుమతిపై నియంత్రణ ఎత్తివేసిన సింగపూర్ ప్రభుత్వం కండీషన్కూడా పెట్టింది. స్థానికంగా పెంచిన లేదా దిగుమతి చేసుకున్న కీటకాలు కచ్చితంగా నిబంధనలకు లోబడే ఉండాలని సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ స్పష్టం చేసింది. ముఖ్యంగా అవి అడవుల నుంచి సేకరించొద్దని తెలిపింది. సింగపూర్ ఆహార సంస్థ తీసుకున్న నిర్ణయాలతో అనేక రెస్టారెంట్లు, కేఫ్లలో జోష్ నెలకొంది. కొత్త రుచులతో వినియోగదారులను ఆకర్షించేందుకు సిద్ధమవుతున్నాయి. వీటిలో మిడతలు, గొల్లభామల్లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయని, ఐరన్, జింక్, కాపర్, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని సింగపూర్ మీడియా ప్రకటించింది.